ఈమధ్యనే ఒకరు ‘వైధవ్యం’ గురించి వ్రాసిన ఒక టపా చదివాను (మాలిక లో). ఆ ఆచారాన్ని ఖండిస్తూ వ్రాసిన వ్యాసం. ఆ ఆచారాన్ని ఖండించడం అనేది ఒప్పుకోదగ్గ విషయమే!! ఇక్కడ ఇంకో విషయం దాగుంది. ఏంటంటే ఈ దురాచారానికి కారణం ‘బ్రాహ్మణీయ భావజాలం’ ట. అసలు ఈ మధ్య సమాజం లో ఏం జరిగినా దానికి కారణం ‘బ్రాహ్మణజాలం‘ ,’బ్రాహ్మణిజం’ ,‘బ్రాహ్మణత్వం’ – అలా వీటిల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఈ ‘technical terms’ ఎందుకు వాడతారంటే, ఎప్పుడో ( మరి ఏ యుగమో , ఏ కాలమో నాకు తెలీదు)
- బ్రాహ్మణులే కులాలని/వర్ణాలని విభజించారు!!
- వేదాలన్నీ బ్రాహ్మణులే కంట్రోల్ లో పెట్టుకున్నారు!!
- బ్రాహ్మణులే అధర్మాలన్నీ చెప్పారు!!.
- బ్రాహ్మణులే పీఠాధిపత్యం తీసుకుంటారు !! సంగీతం/నాట్యం లాంటి కళలు బ్రాహ్మణులకే సొంతం!!
- బ్రాహ్మణుడు తప్ప ఇంకెవరైనా వేదం వింటే చెవుల్లో సీసం పోయించమన్నారు!!
(ఇంతేనా బ్రాహ్మణులు చేసిన పనులు ఏమైనా మర్చిపోయానా ?)
అందుకని ఆ technical terms వాడతారు అని నాకు కొంచెం కొంచెం గా అర్ధమయ్యింది. …
సరే ఇటువంటి వారు చెప్పినట్లే – బ్రాహ్మణుడు అన్నీ కులాలలో తానే గొప్ప అనుకున్నాడు అనుకుందాం !! బ్రాహ్మణులే నేటి సమాజంలో అన్నీ దుస్థితులకి కారణం అనే అనుకుందాం. ఈ క్రింద వ్రాసినదంతా చదివి చెప్పండి ఆ మాట అనటం ఎంత వరకు సబబు అని !!
నాకు తెలిసిన ‘కొన్ని’ ఉదాహరణలు ఇవి:
- నాలుగు శునకాలతో ఎదురుపడ్డ ఛండాలుడిని పరమ శివుడిగా గుర్తించిన ఆది శంకరాచార్యుల వారు ఒక బ్రాహ్మణుడు!!
- చంద్రగుప్తుడిని చక్రవర్తిని చేసి భారతావనిని ఒక్కటి చేసిన చాణుక్యుడు బ్రాహ్మణుడే. చాణుక్యడు లేకపోతే చంద్రగుప్తుడు లేడు. చంద్రగుప్తుడు లేకపోతే బింబిసారుడు లేడు . బింబిసారుడు లేకపోతే బౌద్ధమతానికి పెద్ద పీట వేసిన అశోకుడు ఉండేవాడు కాదు. ‘అశోకుడు చెట్లు నాటించెను’ అని మనం చిన్నప్పుడు చదువుకొని ఉండేవాళ్ళం కాదు!!
- రాముడెవరు ? ఒక క్షత్రియుడు. నిధి కంటే ఆ శ్రీరాముని సన్నిధి చాలా సుఖమని నాదోపాస చేసిన త్యాగరాజు ఒక బ్రాహ్మణుడు. నగలు చేయించినందుకు కారాగారం లో బంధింపబడినా కూడా శ్రీరామచంద్రుడిని తలుచుకొని కీర్తించినదీ ఒక బ్రాహ్మణుడే. . ఆ కీర్తనలకి సంగీతం బాణీ కట్టి రేడియో లో వినిపించినదీ ఒక బ్రాహ్మణుడే. ఆ శ్రీరాముడి మీద కల్పవృక్షం వ్రాసినది బ్రాహ్మణుడే.
- మహాభారతం లో పాండవులు ఎవరు ? క్షత్రియులు. మరి తన సొంత కొడుకుని( ఆ కొడుక్కి ఇవ్వడానికి గుక్కెడు పాలు కూడా లేవు) కాకుండా క్షత్రియుడైన అర్జునుడిని ధనుర్విద్యా పారంగతుడను చేసింది ఒక బ్రాహ్మణుడే. ఆ భారతాన్ని తెనిగించిన నన్నయ, తిక్కన, ఎర్రా ప్రగ్గడ బ్రాహ్మణులే!!
- మనకి అల్లరి చేసే పిల్లలని చూస్తే ఎవరు గుర్తొస్తారు ? బుజ్జి శ్రీకృష్ణుడు. పిల్లలని బుజ్జగించి లాలించే తల్లి ని చూస్తే ఎవరు గుర్తొస్తారు ? యశోదా దేవి. మరి శ్రీకృష్ణుడు ఎవరు ? ఆ కృష్ణుడిని లాలించిన యశోదా దేవి ఎవరు ? యాదవులు. ఆ కృష్ణుడినిపై అంత అందంగా భాగవతాన్ని తెనిగించిన పోతనామాత్యుడు బ్రాహ్మణుడు. ‘ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు’ ,’ ‘పిలువరే కృష్ణునీ ‘ అంటూ గానం చేసినది ఒక బ్రాహ్మణుడు.
- గుడిలో భగవంతుడి ఎదుట కోర్టు కేసు గురించి ఆలోచిస్తున్న రాణి రాసమణి చెంప పగులగొట్టి భగవధ్యానంలో ఉండమని చెప్పిన రామకృష్ణ పరమహంస కూడా బ్రాహ్మణుడే. ‘సోదర సోదరీ మణులారా ‘ అంటూ ప్రపంచానికి భారత దేశం ఉనికి చాటి చెప్పిన భారత వీర నరేంద్రం, వివేకానందుడు ఒక బ్రాహ్మణుడే!!
- తన కులం లో వారే కదా అని వదిలి పెట్టకుండా ‘తాంబూలాలిచ్చేసానిక తన్నుకు చావండి’ అంటూ ఒక సాంఘిక దురాచారానికి కారకులైన అగ్నిహోత్రావధాని, లుబ్దావధానుల గురించి తన రాతల ద్వారా చెప్పింది ఒక బ్రాహ్మణుడే!!
- హిందువా ముస్లిమా అని అర్ధం కాని వారికి సాయి దైవమే అని తెలియజేస్తూ బాబా జీవిత చరిత్ర వ్రాసిన హేమాద్రి పంత్ , అన్నా సాహెబ్ ధబోల్కర్ ఒక బ్రాహ్మణుడే!!
- ‘అపరంజి మదనుడే’ అంటూ ఏసుక్రీస్తుని , ‘శంకరా నాద శరీరాపరా ‘ అంటూ శంకరుడిని స్తుతి చేసిన వేటూరి ఒక బ్రాహ్మణుడే.
- నారదుడు వాల్మీకికి వర్ణించిన శ్రీరామచంద్రుడిని, ఈ రోజున తన మాటలతో కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ 42 రోజులు రామాయణ ప్రవచనం & పోతన గారు చూసిన చిన్ని కృష్ణుడిని ఒక్కసారి మన కళ్ళెదురుగా నిల్చోబెడుతూ భాగవత ప్రవచనాలు చేసిందీ/చేస్తున్నదీ ఒక బ్రాహ్మణుడే.
మరి కులాలని తనే విభజిస్తే, రాముడిని ఎందుకు పూజించమన్నాడు ? బ్రాహ్మణుడే భగవద్గీత చెప్పి ఉండవచ్చు గా ? శ్రీ కృష్ణుడు ఎందుకు చెప్పాలి ? ఆ కృష్ణుడినే ఎందుకు పూజించాలి ? దశావతారాల్లో బ్రాహ్మణులైన వామనుడు, పరశురాముడుని ఎందుకు పూజించము? రామావతారాన్ని, కృష్ణావతారాన్ని కాకుండా వామనావతారాన్ని, పరశురామావతారాన్ని పూజించమని ఏ బ్రాహ్మణుడు కూడా ఎందుకు చెప్పలేదు ? ప్రతి ప్రవచనాకారుడి నోటా రాముడు, కృష్ణుడే ఉంటారు మరి !!
రావణాసురుడు బ్రాహ్మణుడు. వేదం చదువుకున్నవాడు. అతడిని చంపితే బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది. అయినా సరే, ధర్మాన్ని విడిచిపెట్టాడు కనుక వదలద్దు చంపేయమని రాముడికి అస్త్రాలు ఇచ్చి మరీ చెప్పారు బ్రాహ్మణులు !!
ఒక బ్రాహ్మణుడు చెప్పినది ఏంటి – ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించమనటం. అది తప్పా? ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్పడం. అది తప్పా? మంచిని మంచిగా చూడమని -చెడుని చెడుగా చూడమని బోధించడం. అది తప్పా? ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించు అని చెప్పడం. అది తప్పా?
ఏ రాజు అయినా బ్రాహ్మణుడుని సలహాదారుగా, గురువుగా, మంత్రి గా పెట్టుకునేవాడు. ఎందుకు ? వారు చెప్పిన దానిలో ‘మంచి’ అనేది ఉంది!! ఆ బ్రాహ్మణుడికి ‘నిజాయితీ’ ఉంది
!! ఏ కులగురువో అయితే ఆకులు , అలములు తిని బ్రతుకుతుంటాడు. డబ్బు, పదవీ వ్యామోహం అనేదే లేదు! ! కాబట్టే ఏ రాజయినా కూడా బ్రాహ్మణుడి మాటలు విన్నాడు. నచ్చకపోతే ముందు ఆ బ్రాహ్మణుడి మీదే తన క్షత్రియ బలం & శక్తి ఉపయోగించేవాడుగా !!
ఒక సంస్థ చక్కగా నడుస్తోంది అంటే అందరూ మేనేజర్ లు ఉండరు గా !! మేనేజర్ లకి సెక్రెటరీలు ఉంటారు. మేనేజర్ క్రింద క్లర్క్ లు ఉంటారు. ఏ ఒక్కరు లేకపోయినా సంస్థలో పని జరగదు.అన్ని సంస్థల్లోకి తన సంస్థ బాగుండాలంటే మేనేజర్ ఎప్పుడూ ఎత్తు పైన ఎత్తు వేస్తూనే ఉండాలి. దానికి నమ్మకస్తులైన ఉద్యోగులు ఉండాలి. అందరికీ మంచి వేతనాలు ఉంటేనే సంస్థలో ఉంటారు. లేకపోతే ఉద్యమం మొదలవుతుంది.
మరి భారత సమాజం కూడా అన్ని కులాలు/వర్ణాలతో కలిసిమెలిసి ఒక సంస్థలాగే ఉండేది కాబట్టే దేశం సుభిక్షంగా ఉండేది. అందుకే ఎన్నో దాడులకు కూడా గురయ్యింది. ఇది భారత దేశం లో ఈ రోజుకి కూడా ఎంత మందికి అర్ధమవుతుందో కానీ, యూరోపియన్లకి మాత్రం బాగా అర్ధమయ్యింది. అందుకనే భారత దేశపు వ్యవస్థ ని కూకటి వేళ్ళతో సహా పీకివేశారు. ఇంటిలో శుభకార్యం అయితే ఇంటి రజకుడు, క్షురకుడు ఎంత ముఖ్యమో చూసిన తరం మనది !! ఆ విధంగా సమాజం లో ప్రతిఒక్కరూ ముఖ్యమే అని చెప్పిన భారత సమాజం గురించి ఎవరో పరాయిదేశం వారు చెప్పనక్కరలేదు కదా !! అయినా సరే, మనం బుర్రపెట్టి ఎందుకు ఆలోచిస్తాము ? ఒక తెల్లదొర చెప్పగానే నమ్మేస్తాము!! తోటిసహోదరులని గేలిచేస్తాం !!
కొందరి మాటలు చూడండి !! మరి ఎటువంటి సంతృప్తి వస్తుందో వీరికి అర్ధం కాదు !!
“పరశురాముడు క్షత్రియులని చంపాడు. విశ్వామిత్రుడు అంటే క్షత్రియుడు కాబట్టి దేవతలకి ఇష్టం లేదు/ వశిష్ఠుడు బ్రాహ్మణుడు కాబట్టి అంటే బాగా ఇష్టం. అందుకే విశ్వామిత్రుడుని తపస్సు చేసుకోనివ్వలేదు” . పురాణాన్ని వక్రీకరించడం కాకపోతే అర్ధం ఉందా ఇలాంటి మాటలకి ? కామక్రోధాలని జయించిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడి లో కన్పించేది ‘క్షత్రియ కులం’, ఎంత కష్టంలో కూడా క్రోధాన్ని అదుపులో పెట్టుకున్న వశిష్ఠుడిలో కన్పించింది ‘బ్రాహ్మణ కులం’ !! ఒక మానవుడు ఎంతో నేర్చుకోవాల్సిన కథలో కులాలు తప్ప ఏవీ కనిపించవా ?
ఒక బ్రాహ్మణుడు, ‘బ్రాహ్మణుడు’ అనిపించుకోవాలి అంటే , బ్రాహ్మణ కులంలో పుట్టగానే సరికాదు. ధర్మం ప్రకారం ఆ కర్మలు కూడా ఆచరించాలి!!అందుకే అసలు వేదం చదువుకొనని వాడు బ్రాహ్మణుడే కాదు అని కూడా చెప్పారుగా శాస్త్రాలలో మరి!! మరి ఈ రోజున ఇది ఎంతవరకూ అనువర్తిస్తుంది? కేవలం బ్రాహ్మణ వృత్తిలోనే కాక ఎన్నో రకాల వృత్తులలో ఉన్నారు బ్రాహ్మలు. మేము మధుర వెళ్తే జంధ్యం వేసుకుని, పిలక పెట్టుకుని ఒక బ్రాహ్మణ పిల్లవాడు మాకు గైడ్ లాగా వచ్చాడు. గైడ్ గా ఎంత అడిగాడో అంతే ఇచ్చాము కానీ జంధ్యం వేసుకున్నాడని అగ్రహారాలు ఇవ్వలేదే ? ఈ మధ్య ఒక వీడియో చూసాను. కొంత మంది సులభ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్నారు . కొంత మంది రిక్షాలు తొక్కుకుంటూ బ్రతుకుతున్నారు. మరి కొందరు పెద్ద పెద్ద కంపెనీ లలో CEO లు గా కూడా ఉన్నారు. వ్యాపారాలు కూడా చేస్తున్నారు!!పైగా ప్రతి పనికి, ఈ రోజుకి కూడా బ్రాహ్మణుడు అనేవాడు ఒక ప్రామాణికము !!. బహుశా ఇది బ్రాహ్మణుడి వలన ఏ ఒక్క తప్పు జరిగినా ముందు వారి కులం పేరు చెప్పి వేలు చూపించడానికేమో !!
‘పేరుకి బ్రాహ్మణుడు. కానీ లంచాలు తీసుకుంటాడు !!’
‘ ఈ రోజుల్లో బ్రాహ్మలే మాంసం బాగా తింటున్నారు’
‘బ్రాహ్మలయి కూడా ఆచారం పాటించరు’
మన సంస్కృతిలోని ఉన్న ఆశ్చర్యపరిచే అనేక విషయాలలో వేదం ముఖ్యమైనది . వేదాలు ఎప్పటివో, ఏనాటివో తెలియదు. కేవలం గురుశిష్య పరంపర ద్వారా ఒకరి నోటినుండి విని నేర్చుకొని ఇంకొకరికి చెప్పడం. కొన్ని తరాలుగా సాగిపోతున్న ప్రక్రియ. ఎన్నో ఏళ్ళనుంచి చదువుతున్న విష్ణుసహస్రనామం, లలిత సహస్రనామం చదివేవారే మరచిపోతున్నామని పుస్తకం ఎదురుగా పెట్టుకుని చదువుతారే !!అటువంటిది అంత క్లిష్టమైన వేదం పఠించే బ్రాహ్మణులని దేశ సంస్కృతి లో ముఖ్యభాగంగా చూపించి గర్వించాల్సింది పోయి, ఎద్దేవా చేయడం, దూషించడం !! ఏ దేశంలోనూ సంస్కృతి లోను ఇటువంటివి చూడము!! కళ్ళెదురుగా అద్భుతం కనిపిస్తుంటే, ఎక్కడో ఈజిప్ట్ లో కట్టిన సమాధిల గురించి మాట్లాడతాము!!
నేను ఎప్పుడూ కులం గురించిన టపాలు బ్లాగులో కానీ ముఖపుస్తకం లో కానీ టపాలు వ్రాయలేదు. నాకు తెలిసి నేను ఒక కులాన్ని ఎద్దేవా చేయడం కూడా జరగలేదు. మరి ఇప్పుడు మాత్రం ఇలా ఎందుకు వ్రాస్తున్నాను అంటే – తెలియక కొందరు, వితండ వాదన కోసం కొందరు మాట్లాడే మాటలు చూసి చూడనట్లు వదిలి వేయవచ్చు. అలా వదిలివేయడం జరిగింది కూడా !!
‘బ్రాహ్మణులూ’ అంటూ మనుష్యుల్ని విభజించి, కులాన్ని ఎద్దేవా చేస్తూ, దోషుల్ని మాట్లాడినట్లు మాట్లాడుతూ, మనోభావాల్ని గాయపరుస్తూ ఏకంగా పుస్తకాలే వ్రాసేస్తుంటే చూసి చూడనట్లు ఎలా ఊరుకుంటాము ? మౌనంగా ఉండటం కూడా వారి మాటలని సమర్థిస్తున్నట్లు కాదా ?ఇష్టం వచ్చినట్లు కులాల పేర్లు చెప్పి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం కులాల్ని నిర్మూలించండి, కులరహిత సమాజం కావాలి అని మాట్లాడటం. ఈ దూషణకి ఒక పేరు “Freedom of Speech” !! చట్టపరంగా వీరు మాట్లాడేది నేరం కాకపోవచ్చునేమో మరి నాకు తెలియదు. కానీ మాట్లాడే ఆ రంపపు కోతల్లాంటి మాటలే అహంకారానికి కొలమానం కాదా??
ఒక విశ్వవిద్యాలయంలో పని చేసే గురువు తన ధర్మం మరచి, కులాలని దూషిస్తూ & విభజిస్తూ పుస్తకాలూ వ్రాస్తూ, విద్యార్థుల మనసులు విషతుల్యం చేస్తుంటే చూసీచూడనట్లు ఊరుకోవచ్చంటారా ? ఆయన వ్రాయటం ఒక ఎత్తు & ఆ మహానుభావుడిని మద్దతు తెలిపేవారు ఉండటం ఇంకో ఎత్తు . పుస్తకాలు వ్రాయటం చట్టప్రకారం తప్పు కాకపోవచ్చునేమో. కానీ ఇటువంటివి పాఠ్యాంశాలుగా బోధింపబడుతున్నాయిట. మరి అదే నిజమయితే …???? క్రికెట్ చూసి పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది అనుకుంటే టీవీనో, స్మార్ట్ ఫోనో చేతికి ఇవ్వనక్కర లేకుండా సరిపోతుంది. సినిమాలు పిల్లల మనసుల్ని విషతుల్యం చేస్తున్నాయి అంటే, పంపించకుండానో డబ్బులివ్వకుండానో ఉంటే సరిపోతుంది. కానీ ఒక గురువే వీటిని విద్యార్థులకి బోధిస్తూ, వారి మనసుల్ని విషతుల్యం చేస్తుంటే ………. ఒప్పుకోవాల్సిన విషయం మాత్రం కాదేమో ఆలోచించండి!!
ఏది ఏమైనా చెప్పదల్చుకున్నది ఒక్కటే – మన కులం కాదు ‘అగ్రస్థానం’ లో ఉండాల్సింది. మన బుద్ధి !! దానిని బట్టే ‘అగ్రపూజలు’ అందుకోనువచ్చు !! ‘అధః పాతాళం’ లోనూ ఉండవచ్చు !! Its always a choice !!
మీ సుధీర్ఘ బ్రాహ్మణ వ్యాసంలో వ్యాసుడి ప్రస్థావన రాలేదు. ఆయన చేసిన నిర్వాకం వల్లనే బ్రాహ్మణులను విమర్శించవలసి వస్తోంది. కులాన్ని అగ్రస్థానం నిలబెట్టింది ఆయనే…బుద్ధిని అగ్రస్థానంలో నిలిపినట్లైతే బ్రాహ్మణులతో పాటు మిగతావారికీ ఏ గొడవా ఉండదు. ఇప్పటికైనా పోయినదేమీ లేదు. భగవద్గీతలో నాలుగు వర్ణాల విభజన గురించిన శ్లోకాలను తీసివేసి ప్రచురించగలరా ? పుస్తకాలు కొత్తగా వ్రాయటం లేదు. పురాణాల కాలం నుండీ వ్రాయబడుతూ ఉన్నవి. అసలు సామాజిక స్మగ్లరు రచయతలే !
మెచ్చుకోండిమెచ్చుకోండి
నా సుదీర్ఘ వ్యాసాన్ని చదివినందుకు ధన్యవాదాలు _/\_
మెచ్చుకోండిమెచ్చుకోండి
వైధవ్యం Who wrote this story?
మెచ్చుకోండిమెచ్చుకోండి
కథ కాదు. వ్యాసం. బ్లాగు పేరు గుర్తు లేదు. మాలిక లో చదివాను
మెచ్చుకోండిమెచ్చుకోండి
http://maagodavari.blogspot.com/2017/09/blog-post.html
మెచ్చుకోండిమెచ్చుకోండి
‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ మొదట చెప్పిన వ్యక్తి కూడా బ్రాహ్మణుడు కాదండి 🙂.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అవునండీ విష్ణు సహస్రనామం చెప్పింది కూడా బ్రాహ్మణుడు కాదు. నేను అన్నది వేరే context lo 🙂 అంత సులభమైన నామాలు కూడా కష్టం అయిపోయి పుస్తకాలూ ముందుపెట్టుకుని చదువుతున్నాము. అటువంటిది పుస్తకం లేకుండా వేల సంవత్సరాల నుంది కేవలం ఒకరి నుంచీ ఇంకొకరికి, నోటిద్వారా ( oral ) గా చెప్తారు వేదం. ఆ వేదం చెప్పే మనుష్యులు మన కళ్లెదుట కనిపిస్తుంటే ఆ విలువ మనకేం తెలుస్తుంది? ఏ డిస్కవరీ లేదా PBS ఛానల్ వాళ్ళు చూపిస్తేనో, ఒక మ్యూజియం వారు చూపిస్తే ప్రపంచఅద్భుతాలు అంటూ కళ్లప్పగించి చూస్తాము !! విశ్వనాధ్ గారు స్వర్ణకమలం సినిమా లో సరిగ్గా చూపించారుగా !!
మెచ్చుకోండిమెచ్చుకోండి
“మన కులం కాదు ‘అగ్రస్థానం’ లో ఉండాల్సింది. మన బుద్ధి !! దానిని బట్టే ‘అగ్రపూజలు’ అందుకోనువచ్చు !! ‘అధః పాతాళం’ లోనూ ఉండవచ్చు !! ”
చక్కటిమాట చెప్పారు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలండీ
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఒక చిన్న సవరణ. మౌర్య సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తి పేరు బింబిసారుడు. మీ వ్యాసంలో అడిగిన ప్రశ్నలన్నీ సహేతుకమే. బుద్ది సవ్యంగా ఉంచుకొని ఆలోచిస్తే ఎవరు దేనికి సూత్రధారులో తెలుసుకోవడం అంత కష్టం కాదు. ఏమి అన్నా ఏమి చేయరు కాబట్టి, ఏదైనా అనేయచ్చు అన్న ధోరణి బాగా ఎక్కువైంది. తెగేదాకా తీసుకువెళ్తే ఏమి జరుగుతుందో ఈ ఆరోపణలు చేసే వాళ్ళు గుర్తించట్లేదు. ఆ పరిస్థితే వస్తే, ధర్మ బోధ, జాతికి మార్గనిర్దేశం చేసేవాళ్ళు మిగలరు. అటువంటి నష్టానికి బ్రాహ్మణులు బాద్యులు కారు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
సరిజేశానండీ 🙂 ‘ఆ పరిస్థితే వస్తే, ధర్మ బోధ, జాతికి మార్గనిర్దేశం చేసేవాళ్ళు మిగలరు. ‘ – సరిగ్గా చెప్పారు. ఒక పక్క, నా కులాన్ని అంటున్నారు అనే స్వార్థంతో కూడిన బాధ నాలాంటివారికి . ఇంకో పక్క సమాజంలో అధర్మానికే పీట వేసి ఆహ్వానిస్తున్నట్లే అన్న బాధ !!
మెచ్చుకోండిమెచ్చుకోండి
చాలా విషయాలను కవర్ చేస్తూ వ్రాశారండి. బాగుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
ధన్యవాదాలు లక్ష్మీదేవి గారు
మెచ్చుకోండిమెచ్చుకోండి