మొన్న ఒకరు ఇరవై డాలర్లకి చిల్లర ఉందా అని అడిగారు. అసలు చేతిలో డబ్బే లేదన్నాను. ఒక రెండు వారాలయిందేమో డబ్బు నగదు రూపం లో లేకపోవడం. ఇండియాలో అందరూ లైన్లలో నుంచుని నగదు తెచ్చుకుంటూ ఉంటే నేను ఇలా ఎలా ఉండగలుగుతున్నాను అన్పించింది.గుడి హుండీ లోను, గుడి భోజనశాల లో తినడానికి (వాళ్ళు కూడా ఇప్పుడు క్రెడిట్ కార్డులే తీసుకుంటున్నారు), పిల్లల బడులలో చిన్న చిన్న ఫండ్ రైజింగ్ లకి తప్ప నగదు తో పెద్ద అవసరం ఉండదు. కొంత మంది ఇంట్లో పని చేసి వెళ్లే మెయిడ్ కి, గడ్డి కోసే వారికీ నగదు ఇస్తుంటారు. అమెరికా కి వచ్చిన కొత్తల్లో ఇండియన్ కొట్ల లో నగదు అడిగేవారు. ఇప్పుడు వారు సైతం చిన్న మొత్తానికి కూడా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు. ఖరీదైనవి బంగారం,వెండి నాణేల రూపం లో కాయిన్ ఎక్స్చేంజి లాంటి వాటిల్లో కొంటే, వాళ్ళు నగదు పుచ్చుకుంటారు. చెక్ కూడా పుచ్చుకుంటారు. నాకు తెల్సి నంత వరకు చెక్ ఇచ్చిన పక్షం లో వారి అకౌంట్ లో కి డబ్బు వచ్చాకే నాణెం చేతిలో పెడతారు(ట). ఇంకొకటి ఏంటంటే కొనుగోలుదారు పుట్టు పూర్వోత్తరాలు మొత్తం అన్నీ వ్రాయించుకున్నాకే వస్తువు చేతుల్లోకి పెడతారు (ట). ఇంక నగదు రూపం ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది ఈ దేశం లో ?
ఈ దేశం కి వలస వచ్చిన వారు పని చేయడం మొదలు పెట్టకముందే చేయవలసిన పని సోషల్ సెక్యూరిటీ నెంబర్ దరఖాస్తు పెట్టుకోవడం. ఇక డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అన్నీ దానికే ముడి వేస్తారు. నెమ్మదిగా మన జుట్టు వారి చేతిలో పెట్టినట్లే లెక్క. దీనితో తుమ్మినా దగ్గినా అన్నీ తెల్సి పోతాయి. 10 సెంట్లు బాకీ ఉన్నా ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. ఎవరికైనా రుణపడి ఎగ్గొట్టి, ఏదైనా లోన్ అప్లై చేశామా అంతే. మన పుట్టుపూర్వత్రాలు అన్నీ లెక్క కట్టి చెప్పి వడ్డీ రేటు పెంచేస్తారు అప్పు ఇచ్చేవారు. దానితో సక్రమం గా జీవితం గడపాలి అనుకునేవాడి జీవితం ఎప్పుడూ సాఫీ గానే గడిచిపోతుంది. చిన్న తప్పు జరిగిందా అంతే!! చిత్రగుప్తుడు పాపాల చిట్టా విప్పినట్లు మన విషయాలు అన్నీ మనకే చదివేస్తారు.
నేను 2013 లో భారత దేశం వెళ్ళినపుడు నాకు స్మార్ట్ ఫోన్ లేదు. ఉన్న ఫోన్ కి టెక్సటింగ్ లేదు. దాంతో SMS లు ఎలా ఇస్తారో కూడా నాకు అసలు ఆలోచనే లేదు అని చెప్పాలి. నాకు స్మార్ట్ ఫోన్ లేదు అని చెప్తే చాలా మంది ఒక వెర్రి దాన్ని చూసినట్లు చూసారు. అమెరికా నుంచి ఏదైనా కావాలా అంటే ‘ఇక్కడ దొరకని వస్తువ’ అంటూ ఏమి లేదు అమెరికా గొప్పేంటి అన్నట్లు సమాధానాలు కూడా వచ్చాయి. 2016 లో మళ్ళీ భారతదేశం వెళ్ళాను. ఈ సారి, 2015 లో కొన్న iphone 5S తో వెళ్ళాను. ఈసారి ఇంకా చాలా మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఇంక వాట్సాప్ లేని వారంటూ అతి తక్కువ గా కన్పించారు. వెళ్లిన ప్రతి ఇంట్లో Wifi . వెంటనే చాలా వేగం తో కనెక్ట్ అయిపోయేది అది కూడా. హైదరాబాద్, నెల్లూరు , రామేశ్వరం ఎక్కడ అని అడగొద్దు. అన్ని చోట్ల !! Ola, Uber cabs వచ్చాయి. మన చిరునామా చెప్పకుండానే మనం నిల్చున్న చోటికి వచ్చి టాక్సీ వాడు తీసుకెళ్లడం నాకు , చెప్పద్దూ . నిజం గా ఆశ్చర్యం వేసింది భారత దేశంలోనేనా ఉంది నేను అని . మా నాన్న గారూ పాల బిల్లు క్రెడిట్ కార్డు తో చెల్లించటం ఇంకొంచం ఆశ్చర్యం వేసింది. ఈ మధ్య ఇంకొక స్నేహితురాలు ప్రతిదానికి ఆధార్ అడుగుతున్నారు అని ఆధార్ కార్డు అప్లై చేయడం కోసం ఇండియా వెళ్తున్నట్లు చెప్పింది. ఇవన్నీ విని ఇండియా డిజిటల్ ఇండియా అయిపోయిందని నిర్ధారించుకున్నా !!
మోడీ గారు వచ్చి నోట్లు రద్దు చేయటం, అందరూ ఒక తుగ్లక్ పని చేశాడంటూ తిట్టడం, పేద వారికీ ఇబ్బంది కలగింది అని చెప్తుండటం చూసాక పైపై మెరుగులు చూసి డిజిటల్ ఇండియా అయిపోయింది అనుకోవడం నేను పప్పులో కాలేసేసానని అర్ధమయింది.
మోడీ గారు చేద్దామనుకున్న డిజిటల్ ఇండియా ఒకటి. కానీ పాపం దేశ జనాభా డిజిటల్ ఇండియా అంటే – online pizza order చేయడం, flip cart, amazon ల లో కొనుక్కోవడం, whatsapp లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాలు పంపడం, కరపత్రాలు పంచడం, dubmash లు తయారుచేయటం, ముఖపుస్తకం లో రచ్చబండ లు నిర్వహించడం – అనుకున్నారేమో 🙂
ముఖ పుస్తకం ,బ్లాగులు, వాట్సాప్ ఏ విధమైన సోషల్ మీడియా చూసినా నగదు గురించే గోల. ATM లైన్లు బారులు తీరి ఉన్నాయి అని. చిన్న వ్యాపారులకే ఇబ్బంది కలిగింది అని చెప్తున్నారు. నిజమే. ఇబ్బంది పడేది తోపుడు బండి వ్యాపారాలు, చిన్న దుకాణాల వారు, చిరు వ్యాపారాల వారు. వారి దగ్గర క్రెడిట్ కార్డు మెషిన్ లు ఉండవు. ఇక్కడ నాకు అర్ధం కానిది ఏంటంటే మోడీ వచ్చిన తరువాత జన్ ధన్ పథకం క్రింద ఈ చిరు వ్యాపారాల వారు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు కదా…… మొబైల్ లో ప్రతి దానికి వాట్సాప్ ని చాలా తెలివి గా వాడే వారు డబ్బులు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చిరు వ్యాపారాల వారి ఖాతాలలో వేయటం మొదలు పెట్టచ్చు కదా ? సగం బాధలు తగ్గుతాయి కదా ?
వెంటనే అవగతం అయింది. భారత దేశం లో ప్రతి సమస్య అంత సులభం గా ఎందుకు పరిష్కారం అవుతుంది:) అవ్వదు కాక అవ్వదు. .
ఎందుకంటే :
- చాలా మంది కి ఆధార్ కార్డు ఉండి ఉండదు. ఎందుకు ? ఆధార్ కి కావాల్సింది ఓటర్ రిజిస్ట్రేషన్ & చిరునామా. అవి లేవు అంటారు. ఓటర్ రిజిస్ట్రేషన్ ఉండకపోతే ఓట్లు ఎలా వేసి ఉంటారు ? అది తెలీదు.
- ఆధార్ కార్డు ఉన్నా, బ్యాంకు లో ఖాతా ఉండి ఉండదు. ఎందుకు? అది తెలీదు
- ఖాతా ఉన్నా అందులో వేయడం ఇష్టం ఉండదు . ఎందుకు ? ఎందుకంటే సంపాదన ఎంతో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. తెలిస్తే ఏమవుతుంది ? పన్ను కట్టాల్సి వచ్చినా రావచ్చు. ఎందుకు పన్నుకట్టరు ? ఎవ్వరూ పన్ను కట్టరు నేనెందుకు కట్టాలి?
అందరికీ భారత దేశం చైనా లాగానో , అమెరికా లాగానో మారిపోవాలి . కానీ అమెరికా లో వారానికి 40 గంటలు ఖచ్చితం గా పని చేయాలన్న తపన అక్కర్లేదు. చైనా వాళ్ళ లాగా గొడ్డుల్లా కష్టపడటం అంత కంటే ఇష్టం ఉండదు. అన్నీ ఉచితం గా ఇచ్చేయాలి.
అసలు సోషల్ మీడియా లో చిల్లర ఇబ్బంది గా ఉంది అని చెప్పేవారు, ఎంత మంది చదువు రాని వారితో ఆధార్ దరఖాస్తు చేయించారు ? ఎంత మంది చిన్న వ్యాపారాల వారితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు? దేశ సేవ అంటే ఇటువంటి చిన్న చిన్న పనులే. కాలేజీలలో చదివే పిల్లలతో ఇటువంటి వాలంటీర్ పనులు చేయించవచ్చు నేమో .
డిజిటల్ ఇండియా అంటే ఒక చిరు చేనేత కార్మికుడు అమెరికా లో ఉన్న మాలాంటి వారితో online వ్యాపారం చేయటం, సైకిల్ మీద తిరిగి పూలు అమ్ముకునే ఒక పూల వ్యాపారి mobile banking వాడటం వంటివి, అంతే కానీ pizza hut లో online pizza order మాత్రం కాదు. నగదు తో ముడి పెట్టే పనులు ఎంత నివారిస్తే అంత మంచిది.