మా అమ్మాయిని Middle school లో ఉండగా, బళ్ళో దింపేటపుడు రోజూ ఒక దృశ్యం కనపడేది. బడి దగ్గర సందు చివర ఓ వాకిట్లో, ఒక చేతిలో కాఫీ కప్పు పట్టుకుని, ఇంకో చేతిలో చిన్న కూతురిని ఎత్తుకుని, బడి లోపలికి వెళ్తున్న పెద్ద కూతురిని కళ్ళతో బళ్ళో దింపుతూ ఓ మాతృమూర్తి కనిపించేది. ఆ రెండేళ్లు దాదాపుగా ప్రతి రోజూ ఇదే దృశ్యం !!
నాకు ఒక కొరియన్ స్నేహితురాలు ఉంది. ఈ మధ్య కలిసినపుడు చెప్పింది, వాళ్ళ అమ్మాయికి హై స్కూల్ కెమిస్ట్రీ లో మార్కులు సరిగ్గా రావట్లేదని. ‘ట్యూషన్ పెట్టించక పోయావా’ అంటే, ‘వాళ్ళు ఎంత చెప్పినా నేను చెప్పుకుంటే ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పవచ్చును కదా’ అంది.
నిన్న మా అమ్మాయి బళ్ళో ఒకావిడ ని కలిసాను. PTA కి సంబంధించిన ఒక volunteering service activity కి ఆవిడ coordinator . ఆవిడ పిల్లలిద్దరూ గ్రాడ్యుయేట్ అయిపోయారు. ‘అయినా ఎందుకొస్తున్నాను అంటే ఈ పిల్లలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా తృప్తినిస్తుండడం తో మానలేకపోతున్నాను’ అన్నారు. ఆవిడని కొన్ని ఏళ్ళుగా చూస్తున్నాను. ఆ వినయం, నమ్రత చూస్తుంటే ఎంత బావుంటుందో చెప్పలేను !!
మా బాలవికాస్ గురువు గారి సతీమణి !! మేమందరం ఆవిడని ‘ఆంటీ ‘ అంటాము. ఒక్క మాటలో చెప్పాలంటే డొక్కా సీతమ్మ గారిలాగా అర్ధరాత్రి వారింటికి ఎవరు వెళ్ళినా ఏదో ఒకటి పెట్టనిదే పంపరు.
ఫేస్బుక్ లోకి వచ్చినపుడల్లా సునీతా కృష్ణన్ గారి పేజీ చూడకుండా వెళ్ళలేను. ఇక ఆవిడ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఓ ‘మహిషాసురమర్ధిని’ !!
ఎందుకిలా ఎవరో ఒకరి గురించి పొంతన లేకుండా చెప్తున్నాను అంటారా ? రోజూ లలితా దేవిని స్మరిస్తున్నంతసేపూ ఆ అమ్మవారు ఇన్ని అవతారాలతో నా నిత్య జీవితంలో దర్శనం ఇస్తుంటే, ఆ మహత్యాన్ని ఈ నవరాత్రులలో ఈ విజయదశమి రోజు అందరితో పంచుకోకపోతే ఎలా ?
మా అమ్మమ్మ తన ఐదో ఏట ఉండగా తల్లి పోయింది. తల్లి లేని పిల్ల అని ఉమ్మడి కుటుంబంలో అమితమైన గారాబంతో పెరిగింది. ‘అమ్మమ్మా !! నీ పిల్లల్లో చదువుకున్నా కూడా, ఎవ్వరికీ నీకున్న ఈ అవగాహన & ఓర్పు లేదు.అసలు నీకెలా వచ్చింది కదా ?’ అని మా అమ్మమ్మతో అంటే, ఓ చిన్న నవ్వు నవ్వి, . ‘జీవితంలో తల్లి తోడు లేకపోతే ఎప్పుడూ భయమేనే అమ్మా!! ఆ భయమే జీవితంలో అన్నీ నేర్పించేస్తుంది’ అని చెప్పింది. ఆ ఒక్క మాటలో ఎన్నో విషయాలు దాగున్నాయి కదా అనిపించింది నాకు!!
కిష్కింద కాండలో సీతాదేవి ఆభరణాలను చూపించినపుడు లక్ష్మణుడు వెంటనే గుర్తుపట్టిన ఆభరణాలు ఆవిడ కాలి గజ్జెలు/అందెలు. కాలి ఆభరణాలు మాత్రమే ఎలా గుర్తుపట్టగలిగాడు అంటే, రోజూ ఆవిడ పాదాలకి నమస్కరించేవాడు. ఆ పాదాలే ఆయన మనసులో ఉండటం వలన వెంటనే గుర్తు పట్టగలిగాడు.
వైష్ణవుడు అనేవాడు ప్రతి స్త్రీ లో మాతృమూర్తి ని చూస్తాడు అంటూ ‘పర్ స్త్రీ జేనే మాత్ రే ‘అన్నారు నరసింహ మెహతా!!
ఒక పురుషుడు ప్రతి స్త్రీలో తల్లిని చూడాలి. అదే విధంగా స్త్రీ కూడా ప్రతి పురుషుడు తనని చూసి నమస్కరించే విధంగానే ఉండాలి. అప్పుడే ఇలాంటి పండగలకి సార్థకత అనేది ఉంటుంది.
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు !!