రాధా మండువ గారు ఒక కథ చెప్పి, పిల్లలకి చెబుతారా అని వ్రాసారు. అది చదివాక నాకు ఒక కథ గుర్తొచ్చింది.
ఈ టపా వివేకానందుడు చెప్పిన బాట లో… చదివినవారికి డాక్టర్ బాలు గారు జ్ఞాపకం ఉండాలి. టపాలో చెప్పాను కదా, డాక్టర్ బాలు గారు వచ్చినపుడు మా పిల్లలకి బోలెడు కబుర్లు చెప్పేవారని. అలా చెప్పిన కథే ఇది!!
వారు MBBS పూర్తి చేయగానే గిరిజనులకి సేవ చేయాలి అని అత్యంత ఉత్సాహంతో ఉన్నారట. ఆ గిరిజనుల ఉండే ప్రదేశాల దగ్గరికి వెళ్లారు. వాళ్ళు వీరిని స్వాగతించడానికే చాలా కాలం పట్టిందట. అవకాశం ఎప్పుడు వస్తుందా వారికీ వైద్యం ఎప్పుడు చేయాలా అని వేచి ఉన్నారు.
అలా చూస్తుండగా ఒక రోజు ఒక అవకాశం రానే వచ్చింది. ఒక పదునాలుగేళ్ళ (అవును మీరు చూసింది నిజమే 14 ఏళ్ళు ) అమ్మాయికి పురిటి నొప్పులు వస్తున్నాయని ఈయనకి కబురొచ్చిందట. సాయంత్రం ఆరుగంటలకి. ఆ అమ్మాయి ఉండే ఇంటికి రోడ్డు లాంటిది ఏమి లేదు. ఈయన తన మెడికల్ కిట్ పట్టుకుని వెళ్లి, ఆ అమ్మాయి తండ్రి అనుమతితో పరీక్షించారు. ఇంకో 12-15 గంటలు పడుతుంది అని చెప్పి, ఆ అడవిలో పాముపుట్ర ఉంటాయని భయం వేసి ( అలవాటు లేదుగా మళ్ళీ భయమే 🙂 ) వెనక్కి వచ్చారు. మరుసటి ఉదయం బయలుదేరుతుంటే ‘ఇంత పొద్దున్నే ఎక్కడికి ‘ ఒకావిడ పలుకరించింది. ‘ఫలానా చోటికి వెళుతున్నాను’ అంటే, ‘నువ్వెళ్ళి ఏం చేస్తావు. ప్రసవం అయిపోయింది కదా’ అన్నది. వచ్చిన అవకాశం చేజారిపోయినందుకు చాలా బాధ వేసింది బాలు గారికి!! అయినా సరే పుట్టిన బిడ్డ కళ్ళల్లో డ్రాప్స్ అయినా వేద్దాంలే అనుకుని వెళ్లారు.
వెళ్ళేసరికి బాలింత, చంటిబిడ్డ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అనుమతి లేనిదే లోపలి వెళ్ళకూడదు!! అందుకని ఈయన బయటికి వచ్చి ఆ చంటిబిడ్డను తనకు చూపించమని, బిడ్డను పరీక్ష చేసి మందు వేస్తానని చెప్పారు. ఆ అమ్మాయి తాను రానని, చూపించనని చెప్పింది. అయినా కొంచెం సేపు వేచియున్నారు. ఇంక ఓర్పు నశించిపోయి , ‘డాక్టర్ అంటే మీకు అస్సలు నమ్మకం లేదు. నేనే లోపలికి వచ్చి చూస్తాను’ అని కోపంగా అరిచారు. అప్పుడు లోపలి నుంచీ గట్టిన ఏడుస్తూ ‘ నాకున్న ఒక్క చీర రాత్రి పురిటి సమయంలో తడిసిపోయింది. అది ఉతికి ఇప్పుడు గుడిసెపైన ఆరేసారు . ఎండ పడ్డాక ఆరితే కట్టుకుందామని వేచి ఉన్నాను. దయ చేసి లోపలి రావద్దు ’ అంటూ సమాధానం వచ్చింది. అది విన్న బాలు గారు ఒక్కసారిగా స్థంభించి పోయారు. ‘ఎంత సేపు నేను డాక్టర్ని అని గొప్ప చెప్పుకుంటున్నానే కానీ వీరికి నిత్యావసరాలు కూడా లేవు అన్న సంగతి నేనెందుకు గ్రహించుకోలేకపోయాను’ అనుకున్నారు. ఈ కథ ఆయన నోటి వెంట విన్నపుడు మా పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా స్థబ్దులమైపోయాం.
ఈ కథ ఎప్పటిదో కాదు. 1988 ప్రాంతంలో అనుకుంటాను. అంటే అప్పటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 40 ఏళ్ళు !!
గొప్ప విషయం ఏంటంటే ఆ చిన్న వయసులో డాక్టర్ బాలు గారు ఒక సంకల్పం పెట్టుకోవడమే కాదు. నా ఒక్కడి వలన ఏమవుతుందిలే వెనుకకి తిరుగకుండా దానిని కొనసాగించారు కూడా !!ఈ రోజున SVYM ఎన్నో జీవితాల్లో వెలుగు నింపింది. జీవితానికి పరమార్థం అంటే అదే కదా !!