(మొదటి సారి కదా కొంచెం గొప్పలు ఎక్కువ చెప్పుకుంటున్నాను )👇👇👇👇👇👇👇👇
సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానం, అనుభవము చాలా తక్కువ. నన్ను నేను ఓ సామాన్య పాఠకురాలిగా భావించుకుంటాను. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండీ MA రెండవ సంవత్సరం చదువుతూ సాహిత్యంలో ఇప్పుడిప్పుడే అ ఆ లు దిద్దుతున్నాను. కాబట్టి నా ప్రసంగంలో తప్పులేవైనా ఉంటే మన్నింప ప్రార్థన.
నా గురించి నేను చెప్పాలి అంటే ఒక విషయం తప్పక చెప్పాలి .
నా యొక్క ఈ అస్థిత్వం అంటే భారతీయ/సనాతన/హిందువు/బ్రాహ్మణ /తెలుగు/ వీటిల్లో ఏ భావంతో నన్ను చూసినా, ఈ అస్తిత్వం ఇలా ఉండటానికి కారణం → ఎన్నో ప్రయాసలకు లోనైనా సరే , దానిని నిలబెట్టుకున్న నా పూర్వీకుల నిర్ణయం వల్లనే అని నూటికి నూరుపాళ్ళు నమ్ముతాను.
ఈనాడు నేను మాట్లాడ బోయే అంశము 👇👇👇👇
సాహిత్యము లో సమకాలీన చరిత్ర, సామాజిక పరిస్థితులు మరియు చరిత్ర యొక్క ఆవశ్యకత
సాహిత్యము అనేది ఒక మనిషి జీవన విధానంలో తెలియకుండానే చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అవి పురాణేతిహాసాలు కావచ్చు. నాటకాలు కావచ్చు. జానపద సాహిత్యం కావచ్చు.
సాహిత్యము అనేది ఒక కధను నాటకీయంగా చెబుతూనే ఇంకో కోణంలో అప్పటి సమకాలీన చరిత్ర మరియు సామాజిక పరిస్థితులు కూడా చెప్తుంది.
ఒక ఉదాహరణ : 👇👇👇👇
పోతన గారి భాగవతంలో శివుడు హాలాహలం భక్షణం చేసినపుడు పార్వతీ దేవి గురించి ఈ పద్యం చెప్తాడు :
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!”
అంటే ఇక్కడ ఆనాడు తెలుగు వారి ఆచారాలలో మాంగళ్య ధారణ ఉండేదని, అది చాలా ముఖ్యమైనదనీ స్పష్టమవుతుంది. ఇక పోతన గారి భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు చదువుతుంటే తెలుగువారి జీవన విధానం కళ్ళముందుంటుంది కానీ ఎక్కడో ఉత్తరభారతాన ఉన్న మధురలోని బృందావనం గుర్తు రాదు మనకి. ‘అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు’ అంటే భయపడే తెలుగు శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు.
వీటిని బట్టి ఆనాటి సామజిక పరిస్థితులు కనిపిస్తాయి.
ఈ విధంగా సాహిత్యంలో ఆనాటి పరిస్థితులు గత చరిత్రలో ఒక అస్థిత్వాన్ని మనకి తెలియజేస్తాయి . అంటే ‘ఓహో తెలుగు వారు ఇలా ఉండేవారు కాబోలు ’ అని.
చరిత్ర యొక్క ఆవశ్యకత 👇👇👇👇
అయితే చరిత్ర అనేది ఎందుకు తెలుసుకోవాలి ? గతం గతః అని వదిలివేయచ్చు కదా? అయిపోయిందేదో అయిపొయింది. చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అంటే , ఒక అస్థిత్వాన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా జాతి మీద జరిగిన అకృత్యాలు, మారణహోమాలు జరిగి ఉంటే , అటువంటివి పునరావృత్తం కాకుండా ఏమి చర్యలు తీసుకోవాలో, తెలుసుకోవడానికి చరిత్ర తెలుసుకోవాలి.
ఆ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి అంటే మొదట ఆ జాతిమీద జరిగిన దారుణాలు గుర్తింపబడాలి. తరువాత కొత్త చట్టాలు రూపొందించడం, ఆ చట్టాలు అమలు పరచడం ద్వారా ఆ అస్థిత్వాన్ని కాపాడ గలుగుతాము. అంతే కాదు తరువాతి తరాలు కలిసిమెలిసి ఉండేలా చేయాలి అంటే ఈ ఇద్దరి జాతుల మధ్య సయోధ్య కుదరాలి. అంటే reconciliation . ఇందులో సాహిత్యం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.
అందుకు ఉదాహరణలు:👇👇👇👇
ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులపైన జరిగిన మారణహోమం. ఈ అంశం పైన ఎంతో సాహిత్యం వచ్చింది. యూదులపై అటువంటి చరిత్ర పునరావృత్తం కాకుండా ఎన్నో చట్టాలు వచ్చాయి.
ఇంకొకటి ఆఫ్రికా జాతుల వారి మీద జరిగిన అకృత్యాలు. . వారిని బానిసలు గా అమ్మివేయబడటం, వారి పైన మారణకాండ, దాష్టీకాలు ఎన్నో జరిగాయి. . అలాగే వారి అస్తిత్వం కాపాడటం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. ఈ అకృత్యాల మీద సాహిత్యంలో ఉదాహరణలు Roots నవల, To Kill a Mockingbird నవల.
ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ సాహిత్యం పాఠ్యాంశాలుగా బళ్ళలో పిల్లలకి బోధిస్తున్నారు..అమెరికాలో పిల్లలు 8వ తరగతిలోనే To Kill a Mockingbird పాఠ్యాంశంగా చదివుతారు.
సాహిత్యం ఈ విధంగా ఒక అవగాహన కల్పించి ఈ అకృత్యాలని ప్రపంచం గుర్తించేలా చేస్తుంది . అందుకే ఇందులో సాహిత్యం పోషించే పాత్ర చాలా ఎక్కువ.
భారతభూమిపై జరిగిన అకృత్యాలు 👇👇👇👇
ఇవి దాదాపుగా వరుసగా వెయ్యేళ్ళ పాటు కొనసాగాయి. . మతం పేరుతో ఎన్నో మారణహోమాలు, ఆడవారి పైన మాన భంగాలు, వారిని బానిసలని చేసి అమ్మడం వంటి అకృత్యాలు ఎన్నో జరిగాయి..
భారతీయులు పవిత్రంగా భావించే పుణ్య క్షేత్రాలలోని గుళ్ళ మీద 7 వ శతాబ్దం మొదలు కొని 17 వ శతాబ్దం వరకూ ఎన్నో దాడులు జరిగాయి. ఆనాటి భారతీయులు ప్రాణాలకు తెగించి గుడిని కాపాడుకున్నారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాచీన గుళ్ళు చూసినపుడు తలలు తెగి పడిన విగ్రహాలు, సమాధులతో నిర్మాణాలు కనిపిస్తాయి అంటే ఆ దాడులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించవచ్చు.
ఈ దేవతా మూర్తులని కాపాడుకునేవాళ్ళు. మళ్ళీ దాడి జరిగేది.
ఒక ఉదాహరణ : దక్షిణ భారతదేశంలో శ్రీరంగం దేవాలయం మీద రెండు సార్లు దాడి జరిగింది. ఒకటి ఖిల్జీ గవర్నర్ అయిన మల్లిక్ కఫుర్ చేసిన దాడి . తరువాత తుగ్లక్ సైన్యం చేసిన దాడి . రెండవ సారి దాడి జరిగినపుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని ముందు కేరళ , తరువాత తిరుమల తరలించారు. అదే ఈనాడు మనం తిరుమలలో చూసే రంగమండపం. ఇలాగ భారతదేశం నలుమూలల జరిగిన అకృత్యాల గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.
ఇవి ‘రాజుల మధ్యలో యుద్ధాలుగా పరిగణించవచ్చు కదా ‘అంటారేమో. కానీ ఇవి ‘మతదురహంకారంతో జరిగిన అకృత్యాలు’ అని పురావస్తు పరిశోధనల వలన, చరిత్రకారుల పరిశోధనల వలన నిర్ధారణ అయ్యింది. మరి ప్రపంచం భారతజాతి మీద జరిగిన అకృత్యాలు గుర్తించిందా ? గుర్తించలేదు. ఆనాడు ఈ రెండు జాతుల మధ్య సయోధ్య లేదు అనటానికి సాక్ష్యం భారతదేశం మూడు భాగాలయ్యింది.
అందుకే ఇటువంటివి పునరావృత్తం కాకుండా ఇటువంటి అకృత్యాలపైన చట్టాలు రావాలి. అంటే, ఈ అకృత్యాలపైనా విరివిగా సాహిత్యం రావాలి . పిల్లలకి పాఠ్యాంశాలుగా బోధింపబడాలి.
ఈ అంశాలపైన తెలుగు సాహిత్యం 👇👇👇👇👇👇
** 1350-1440 మధ్యలో స్కాందపురాణం నుండీ కాశీ మహత్యాన్ని వివరిస్తూ కవిసార్వభౌముడు శ్రీనాథుడు వ్రాసిన కావ్యం ‘కాశీ ఖండం’. అంతకుముందు 1170లలో శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన ‘నైషధం’ కావ్యంలో దమయంతీ స్వయంవరంలో కాశీపట్టణ వైభవం గురించి వివరిస్తాడు. ఈ సాహిత్యం ప్రాచుర్యంలో ఉన్నది కానీ చరిత్రకారులు చెప్పే, ఢిల్లీ సుల్తానుల ఆదేశం ప్రకారం, 1190 ల నుండీ 1670 దాకా ఎన్నో సార్లు నేలమట్టమైన కాశీ గురించి సాహిత్యంలో ఎక్కడైనా ఉటంకించారా అన్నది ఒక ప్రశ్న.
** దుర్భాక రాజశేఖర కవి 1888 లో రాణా ప్రతాపుని చరిత్రను వస్తువుగా తీసుకుని ‘రాణా ప్రతాప చరిత్ర’ అనే ఐదు ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.
** 1897లో గడియారము వేంకట శేష శాస్త్రి శివాజీ చరిత్రను వస్తువుగా తీసుకుని ‘శివభారతము’ అనే ఎనిమిది ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.
**రజాకార్ల యొక్క అరాచకాల మీద దాశరధి రంగాచార్య గారు వ్రాసిన ‘మోదుగుపూలు ‘ లాంటి నవల ఉన్నది.
**‘బండెనుక బండికట్టి’ అనే జానపద గేయం ఆనాటి చరిత్రని స్పష్టంగా చెప్తుంది.
**సంచిక పత్రిక లో కస్తూరి మురళీకృష్ణ గారు అనువదిస్తున్న జోనరాజ ద్వితీయ రాజతరంగిణి కాశ్మీరు లో అరాచక చరిత్ర వివరిస్తుంది.
**తెలుగులో ఈ అరాచకాలని గురించి స్పష్టంగా చెబుతూ ఉన్న శతకాలు రెండు ఉన్నాయి. ఆ శతక కర్తలు అరాచక చరిత్రకి ప్రత్యక్ష సాక్ష్యులు.
1 తిరుమల గుడి పైన 1700లో గోల్కొండ నవాబులు చేసిన దాడి గురించి వేంకటాచల విహార శతకకర్త ‘నల్లకాల్వ వరకవి సీతాపతి’ ఆ శతకము లో చాలా విశదంగా వివరించారు. ఒక సీస పద్యం చూద్దాం.(see the picture)
2 ఇదేవిధంగా 1750లో సింహాచలం ఆలయం పైన దాడి జరగబోతోందని గోగులనాటి కూర్మనాథ కవి నిందాస్తుతి రూపంలో సింహాద్రి నారసింహశతకము అని నరసింహుడిని వేడుకుంటూ రచించారు 70 పద్యాల దాకా చెప్పగానే ఒక తుమ్మెదల గుంపు వచ్చినా కొండని ఆక్రమించిందని, ఆ సైన్యాన్ని తరిమికొట్టిందని చరిత్ర.
అందులో ఒకటి
సీ. పాశ్చాత్యుల నమాజుపై బుద్ధిపుట్టెనో
మౌనుల జపముపై మనసు రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో
విప్రయజ్ఞములపై విసువు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో
దేవతాప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో
భక్తనిత్యోత్సవపరత మాని
గీ. వాండ్రు దుర్మార్గు లయ్యయో వ్రతము చెడ్డ
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరఁగఁదోలు
పారసీకాధిపతులఁ బటాపంచలుగను
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!
ఆధునిక తెలుగు సాహిత్యం కోణం 👇👇👇👇👇👇
ఒక వైపు తెలుగు ప్రాచీన సాహిత్యం ధర్మం తప్పకుండా ఎలా నడవాలి అని చెప్తూ , ఈ పుణ్యక్షేత్రాలు & ఆ వైభవాన్ని ఎంతో గొప్పగా చెప్తే, ఇంకొకవైపు ఈ సనాతనధర్మం , గుళ్ళలో మూర్తిపూజ అనేది ఒక మూఢనమ్మకం లాగా చెప్పిన ఆధునిక తెలుగు సాహిత్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనే చెప్పాలి. ఇటువంటి ఈ ఆధునిక సాహిత్యం ఎంత ప్రచారం లో వచ్చింది అంటే ఎక్కడైనా ఎప్పుడైనా రామాయణం, రాముడు గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా సామాన్యుల చర్చల్లో కూడా ఉండే విషయాలు
సీత అగ్నిప్రవేశం,
వాలిని చంపడం,
సీతని అడవుల్లో వదిలేయడం.
అంతే కాదు. రావణాసురుడు ద్రావిడ జాతికి చెందినవాడు. రాముడు ఆర్యుడనీ చెప్పే కథలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
అందుకు ఉదాహరణ ఇటీవలి కాలంలో వచ్చిన ‘విముక్త’ కథలు. ఆ కథలు చదివాక ఇది నాకు అనిపించిన భావము. రామాయణంలోని స్త్రీల గురించిన నేపథ్యంలో వచ్చిన కథలు. సీతాదేవి, అహల్య, రేణుకా దేవి, ఊర్మిళ ఇలా అందరిని పీడితుల్లాగా చూపించి పీడకుడు పీడితుడు అనే భావజాలంలోకి తెచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి. అంటే భర్త పీడకుడు. భార్య పీడితురాలు. ఇక్కడ సమస్య పరిష్కారం ఏమిటంటే స్త్రీ కి భర్త నుంచి విముక్తి . అంటే నేను ఇక్కడ బాధలు పడే స్త్రీలని కించపరచడం లేదు. నేను చెప్పేది ఏంటంటే రామాయణం అంటేనే భారతీయులకి ఎంతో స్ఫూర్తి. రామాయణంలో స్త్రీ పాత్రలు ఎంతో స్ఫూర్తి. అటువంటి స్త్రీ పాత్రలను ఇలా భావజాలపు చట్రంలో ఇరికించడమూ, రాముడు ‘ఆర్యుడ’ని అని చెప్పడం అనేది చాలా బాధాకరం.
ఈ విధంగా ప్రాచుర్యంలో వచ్చిన ఆధునిక సాహిత్యం వలన ఏమి జరిగింది మనకి?👇👇👇👇👇👇
భారతజాతిపై జరిగిన అన్యాయాలు & అకృత్యాలు ప్రపంచానికి తెలియనందువలన, ఎంతో మంది ప్రాణాలు వదిలేసిన ఆ జాతికి తీరని అన్యాయం జరిగింది అని చెప్పాలి. అంతే కాదు . భారత సంతతి తమ పూర్వీకులను తామే అసహ్యించుకునేలా చేసింది.
ముగింపు 👇👇👇👇👇👇
ఏ జాతి పైన అకృత్యాలు జరిగాయో , ఎప్పుడైనా సరే ఆ జాతే ఆ అకృత్యాల గురించి ధైర్యంగా మాట్లాడాలి.
భారతీయులుగా భారత సాహిత్యంలో భారత చరిత్ర చెప్పనంత కాలం ప్రపంచానికి 1200 ఏళ్ళపాటు భారత జాతి మీద జరిగిన అకృత్యాలు ఏనాటికి తెలియవు.
**********************************************************
ఈ సదవకాశం నాకిచ్చిన వంగూరి వారికీ & సిలికానాంధ్ర వారికి అనేకానేక ధన్యవాదములు 🙏 🙏 🙏
ఈ ప్రసంగంలో పంచుకున్న అభిప్రాయాలన్నీ నావే అని గమనించవలసిందిగా ప్రార్థన.🙏 🙏 .
References:👇👇👇👇👇👇
వేంకటాచల విహారశతకం – నల్లకాల్వ వరకవి సీతాపతి
సింహాద్రి నారసింహ శతకము-గోగులపాటి కూర్మనాధ కవి
చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర by డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి
Flight of Deities – Dr.Meenakshi Jain
Anveshi-An Explorer’s Journey,
‘విముక్త’ కథలు – ఓల్గా