13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు – నా ప్రసంగం

(మొదటి సారి కదా కొంచెం గొప్పలు ఎక్కువ చెప్పుకుంటున్నాను )👇👇👇👇👇👇👇👇

సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానం, అనుభవము చాలా తక్కువ. నన్ను నేను ఓ సామాన్య పాఠకురాలిగా భావించుకుంటాను. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండీ MA రెండవ సంవత్సరం చదువుతూ సాహిత్యంలో ఇప్పుడిప్పుడే అ ఆ లు దిద్దుతున్నాను. కాబట్టి నా ప్రసంగంలో తప్పులేవైనా ఉంటే మన్నింప ప్రార్థన.

నా గురించి నేను చెప్పాలి అంటే ఒక విషయం తప్పక చెప్పాలి .
నా యొక్క ఈ అస్థిత్వం అంటే భారతీయ/సనాతన/హిందువు/బ్రాహ్మణ /తెలుగు/ వీటిల్లో ఏ భావంతో నన్ను చూసినా, ఈ అస్తిత్వం ఇలా ఉండటానికి కారణం → ఎన్నో ప్రయాసలకు లోనైనా సరే , దానిని నిలబెట్టుకున్న నా పూర్వీకుల నిర్ణయం వల్లనే అని నూటికి నూరుపాళ్ళు నమ్ముతాను.

ఈనాడు నేను మాట్లాడ బోయే అంశము 👇👇👇👇
సాహిత్యము లో సమకాలీన చరిత్ర, సామాజిక పరిస్థితులు మరియు చరిత్ర యొక్క ఆవశ్యకత

సాహిత్యము అనేది ఒక మనిషి జీవన విధానంలో తెలియకుండానే చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అవి పురాణేతిహాసాలు కావచ్చు. నాటకాలు కావచ్చు. జానపద సాహిత్యం కావచ్చు.

సాహిత్యము అనేది ఒక కధను నాటకీయంగా చెబుతూనే ఇంకో కోణంలో అప్పటి సమకాలీన చరిత్ర మరియు సామాజిక పరిస్థితులు కూడా చెప్తుంది.

ఒక ఉదాహరణ : 👇👇👇👇

పోతన గారి భాగవతంలో శివుడు హాలాహలం భక్షణం చేసినపుడు పార్వతీ దేవి గురించి ఈ పద్యం చెప్తాడు :
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!”

అంటే ఇక్కడ ఆనాడు తెలుగు వారి ఆచారాలలో మాంగళ్య ధారణ ఉండేదని, అది చాలా ముఖ్యమైనదనీ స్పష్టమవుతుంది. ఇక పోతన గారి భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు చదువుతుంటే తెలుగువారి జీవన విధానం కళ్ళముందుంటుంది కానీ ఎక్కడో ఉత్తరభారతాన ఉన్న మధురలోని బృందావనం గుర్తు రాదు మనకి. ‘అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు’ అంటే భయపడే తెలుగు శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు.

వీటిని బట్టి ఆనాటి సామజిక పరిస్థితులు కనిపిస్తాయి.
ఈ విధంగా సాహిత్యంలో ఆనాటి పరిస్థితులు గత చరిత్రలో ఒక అస్థిత్వాన్ని మనకి తెలియజేస్తాయి . అంటే ‘ఓహో తెలుగు వారు ఇలా ఉండేవారు కాబోలు ’ అని.

చరిత్ర యొక్క ఆవశ్యకత 👇👇👇👇
అయితే చరిత్ర అనేది ఎందుకు తెలుసుకోవాలి ? గతం గతః అని వదిలివేయచ్చు కదా? అయిపోయిందేదో అయిపొయింది. చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అంటే , ఒక అస్థిత్వాన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా జాతి మీద జరిగిన అకృత్యాలు, మారణహోమాలు జరిగి ఉంటే , అటువంటివి పునరావృత్తం కాకుండా ఏమి చర్యలు తీసుకోవాలో, తెలుసుకోవడానికి చరిత్ర తెలుసుకోవాలి.

ఆ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి అంటే మొదట ఆ జాతిమీద జరిగిన దారుణాలు గుర్తింపబడాలి. తరువాత కొత్త చట్టాలు రూపొందించడం, ఆ చట్టాలు అమలు పరచడం ద్వారా ఆ అస్థిత్వాన్ని కాపాడ గలుగుతాము. అంతే కాదు తరువాతి తరాలు కలిసిమెలిసి ఉండేలా చేయాలి అంటే ఈ ఇద్దరి జాతుల మధ్య సయోధ్య కుదరాలి. అంటే reconciliation . ఇందులో సాహిత్యం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.

అందుకు ఉదాహరణలు:👇👇👇👇
ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులపైన జరిగిన మారణహోమం. ఈ అంశం పైన ఎంతో సాహిత్యం వచ్చింది. యూదులపై అటువంటి చరిత్ర పునరావృత్తం కాకుండా ఎన్నో చట్టాలు వచ్చాయి.

ఇంకొకటి ఆఫ్రికా జాతుల వారి మీద జరిగిన అకృత్యాలు. . వారిని బానిసలు గా అమ్మివేయబడటం, వారి పైన మారణకాండ, దాష్టీకాలు ఎన్నో జరిగాయి. . అలాగే వారి అస్తిత్వం కాపాడటం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. ఈ అకృత్యాల మీద సాహిత్యంలో ఉదాహరణలు Roots నవల, To Kill a Mockingbird నవల.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ సాహిత్యం పాఠ్యాంశాలుగా బళ్ళలో పిల్లలకి బోధిస్తున్నారు..అమెరికాలో పిల్లలు 8వ తరగతిలోనే To Kill a Mockingbird పాఠ్యాంశంగా చదివుతారు.

సాహిత్యం ఈ విధంగా ఒక అవగాహన కల్పించి ఈ అకృత్యాలని ప్రపంచం గుర్తించేలా చేస్తుంది . అందుకే ఇందులో సాహిత్యం పోషించే పాత్ర చాలా ఎక్కువ.

భారతభూమిపై జరిగిన అకృత్యాలు 👇👇👇👇
ఇవి దాదాపుగా వరుసగా వెయ్యేళ్ళ పాటు కొనసాగాయి. . మతం పేరుతో ఎన్నో మారణహోమాలు, ఆడవారి పైన మాన భంగాలు, వారిని బానిసలని చేసి అమ్మడం వంటి అకృత్యాలు ఎన్నో జరిగాయి..
భారతీయులు పవిత్రంగా భావించే పుణ్య క్షేత్రాలలోని గుళ్ళ మీద 7 వ శతాబ్దం మొదలు కొని 17 వ శతాబ్దం వరకూ ఎన్నో దాడులు జరిగాయి. ఆనాటి భారతీయులు ప్రాణాలకు తెగించి గుడిని కాపాడుకున్నారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాచీన గుళ్ళు చూసినపుడు తలలు తెగి పడిన విగ్రహాలు, సమాధులతో నిర్మాణాలు కనిపిస్తాయి అంటే ఆ దాడులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించవచ్చు.
ఈ దేవతా మూర్తులని కాపాడుకునేవాళ్ళు. మళ్ళీ దాడి జరిగేది.
ఒక ఉదాహరణ : దక్షిణ భారతదేశంలో శ్రీరంగం దేవాలయం మీద రెండు సార్లు దాడి జరిగింది. ఒకటి ఖిల్జీ గవర్నర్ అయిన మల్లిక్ కఫుర్ చేసిన దాడి . తరువాత తుగ్లక్ సైన్యం చేసిన దాడి . రెండవ సారి దాడి జరిగినపుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని ముందు కేరళ , తరువాత తిరుమల తరలించారు. అదే ఈనాడు మనం తిరుమలలో చూసే రంగమండపం. ఇలాగ భారతదేశం నలుమూలల జరిగిన అకృత్యాల గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.

ఇవి ‘రాజుల మధ్యలో యుద్ధాలుగా పరిగణించవచ్చు కదా ‘అంటారేమో. కానీ ఇవి ‘మతదురహంకారంతో జరిగిన అకృత్యాలు’ అని పురావస్తు పరిశోధనల వలన, చరిత్రకారుల పరిశోధనల వలన నిర్ధారణ అయ్యింది. మరి ప్రపంచం భారతజాతి మీద జరిగిన అకృత్యాలు గుర్తించిందా ? గుర్తించలేదు. ఆనాడు ఈ రెండు జాతుల మధ్య సయోధ్య లేదు అనటానికి సాక్ష్యం భారతదేశం మూడు భాగాలయ్యింది.

అందుకే ఇటువంటివి పునరావృత్తం కాకుండా ఇటువంటి అకృత్యాలపైన చట్టాలు రావాలి. అంటే, ఈ అకృత్యాలపైనా విరివిగా సాహిత్యం రావాలి . పిల్లలకి పాఠ్యాంశాలుగా బోధింపబడాలి.

ఈ అంశాలపైన తెలుగు సాహిత్యం 👇👇👇👇👇👇
** 1350-1440 మధ్యలో స్కాందపురాణం నుండీ కాశీ మహత్యాన్ని వివరిస్తూ కవిసార్వభౌముడు శ్రీనాథుడు వ్రాసిన కావ్యం ‘కాశీ ఖండం’. అంతకుముందు 1170లలో శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన ‘నైషధం’ కావ్యంలో దమయంతీ స్వయంవరంలో కాశీపట్టణ వైభవం గురించి వివరిస్తాడు. ఈ సాహిత్యం ప్రాచుర్యంలో ఉన్నది కానీ చరిత్రకారులు చెప్పే, ఢిల్లీ సుల్తానుల ఆదేశం ప్రకారం, 1190 ల నుండీ 1670 దాకా ఎన్నో సార్లు నేలమట్టమైన కాశీ గురించి సాహిత్యంలో ఎక్కడైనా ఉటంకించారా అన్నది ఒక ప్రశ్న.

** దుర్భాక రాజశేఖర కవి 1888 లో రాణా ప్రతాపుని చరిత్రను వస్తువుగా తీసుకుని ‘రాణా ప్రతాప చరిత్ర’ అనే ఐదు ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.

** 1897లో గడియారము వేంకట శేష శాస్త్రి శివాజీ చరిత్రను వస్తువుగా తీసుకుని ‘శివభారతము’ అనే ఎనిమిది ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.

**రజాకార్ల యొక్క అరాచకాల మీద దాశరధి రంగాచార్య గారు వ్రాసిన ‘మోదుగుపూలు ‘ లాంటి నవల ఉన్నది.

**‘బండెనుక బండికట్టి’ అనే జానపద గేయం ఆనాటి చరిత్రని స్పష్టంగా చెప్తుంది.

**సంచిక పత్రిక లో కస్తూరి మురళీకృష్ణ గారు అనువదిస్తున్న జోనరాజ ద్వితీయ రాజతరంగిణి కాశ్మీరు లో అరాచక చరిత్ర వివరిస్తుంది.

**తెలుగులో ఈ అరాచకాలని గురించి స్పష్టంగా చెబుతూ ఉన్న శతకాలు రెండు ఉన్నాయి. ఆ శతక కర్తలు అరాచక చరిత్రకి ప్రత్యక్ష సాక్ష్యులు.

1 తిరుమల గుడి పైన 1700లో గోల్కొండ నవాబులు చేసిన దాడి గురించి వేంకటాచల విహార శతకకర్త ‘నల్లకాల్వ వరకవి సీతాపతి’ ఆ శతకము లో చాలా విశదంగా వివరించారు. ఒక సీస పద్యం చూద్దాం.(see the picture)

2 ఇదేవిధంగా 1750లో సింహాచలం ఆలయం పైన దాడి జరగబోతోందని గోగులనాటి కూర్మనాథ కవి నిందాస్తుతి రూపంలో సింహాద్రి నారసింహశతకము అని నరసింహుడిని వేడుకుంటూ రచించారు 70 పద్యాల దాకా చెప్పగానే ఒక తుమ్మెదల గుంపు వచ్చినా కొండని ఆక్రమించిందని, ఆ సైన్యాన్ని తరిమికొట్టిందని చరిత్ర.

అందులో ఒకటి


సీ. పాశ్చాత్యుల నమాజుపై బుద్ధిపుట్టెనో
మౌనుల జపముపై మనసు రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో
విప్రయజ్ఞములపై విసువు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో
దేవతాప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో
భక్తనిత్యోత్సవపరత మాని
గీ. వాండ్రు దుర్మార్గు లయ్యయో వ్రతము చెడ్డ
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరఁగఁదోలు
పారసీకాధిపతులఁ బటాపంచలుగను
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!

ఆధునిక తెలుగు సాహిత్యం కోణం 👇👇👇👇👇👇
ఒక వైపు తెలుగు ప్రాచీన సాహిత్యం ధర్మం తప్పకుండా ఎలా నడవాలి అని చెప్తూ , ఈ పుణ్యక్షేత్రాలు & ఆ వైభవాన్ని ఎంతో గొప్పగా చెప్తే, ఇంకొకవైపు ఈ సనాతనధర్మం , గుళ్ళలో మూర్తిపూజ అనేది ఒక మూఢనమ్మకం లాగా చెప్పిన ఆధునిక తెలుగు సాహిత్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనే చెప్పాలి. ఇటువంటి ఈ ఆధునిక సాహిత్యం ఎంత ప్రచారం లో వచ్చింది అంటే ఎక్కడైనా ఎప్పుడైనా రామాయణం, రాముడు గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా సామాన్యుల చర్చల్లో కూడా ఉండే విషయాలు
సీత అగ్నిప్రవేశం,
వాలిని చంపడం,
సీతని అడవుల్లో వదిలేయడం.
అంతే కాదు. రావణాసురుడు ద్రావిడ జాతికి చెందినవాడు. రాముడు ఆర్యుడనీ చెప్పే కథలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

అందుకు ఉదాహరణ ఇటీవలి కాలంలో వచ్చిన ‘విముక్త’ కథలు. ఆ కథలు చదివాక ఇది నాకు అనిపించిన భావము. రామాయణంలోని స్త్రీల గురించిన నేపథ్యంలో వచ్చిన కథలు. సీతాదేవి, అహల్య, రేణుకా దేవి, ఊర్మిళ ఇలా అందరిని పీడితుల్లాగా చూపించి పీడకుడు పీడితుడు అనే భావజాలంలోకి తెచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి. అంటే భర్త పీడకుడు. భార్య పీడితురాలు. ఇక్కడ సమస్య పరిష్కారం ఏమిటంటే స్త్రీ కి భర్త నుంచి విముక్తి . అంటే నేను ఇక్కడ బాధలు పడే స్త్రీలని కించపరచడం లేదు. నేను చెప్పేది ఏంటంటే రామాయణం అంటేనే భారతీయులకి ఎంతో స్ఫూర్తి. రామాయణంలో స్త్రీ పాత్రలు ఎంతో స్ఫూర్తి. అటువంటి స్త్రీ పాత్రలను ఇలా భావజాలపు చట్రంలో ఇరికించడమూ, రాముడు ‘ఆర్యుడ’ని అని చెప్పడం అనేది చాలా బాధాకరం.

ఈ విధంగా ప్రాచుర్యంలో వచ్చిన ఆధునిక సాహిత్యం వలన ఏమి జరిగింది మనకి?👇👇👇👇👇👇
భారతజాతిపై జరిగిన అన్యాయాలు & అకృత్యాలు ప్రపంచానికి తెలియనందువలన, ఎంతో మంది ప్రాణాలు వదిలేసిన ఆ జాతికి తీరని అన్యాయం జరిగింది అని చెప్పాలి. అంతే కాదు . భారత సంతతి తమ పూర్వీకులను తామే అసహ్యించుకునేలా చేసింది.

ముగింపు 👇👇👇👇👇👇
ఏ జాతి పైన అకృత్యాలు జరిగాయో , ఎప్పుడైనా సరే ఆ జాతే ఆ అకృత్యాల గురించి ధైర్యంగా మాట్లాడాలి.

భారతీయులుగా భారత సాహిత్యంలో భారత చరిత్ర చెప్పనంత కాలం ప్రపంచానికి 1200 ఏళ్ళపాటు భారత జాతి మీద జరిగిన అకృత్యాలు ఏనాటికి తెలియవు.

**********************************************************
ఈ సదవకాశం నాకిచ్చిన వంగూరి వారికీ & సిలికానాంధ్ర వారికి అనేకానేక ధన్యవాదములు 🙏 🙏 🙏

ఈ ప్రసంగంలో పంచుకున్న అభిప్రాయాలన్నీ నావే అని గమనించవలసిందిగా ప్రార్థన.🙏 🙏 .

References:👇👇👇👇👇👇
వేంకటాచల విహారశతకం – నల్లకాల్వ వరకవి సీతాపతి
సింహాద్రి నారసింహ శతకము-గోగులపాటి కూర్మనాధ కవి
చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర by డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి
Flight of Deities – Dr.Meenakshi Jain
Anveshi-An Explorer’s Journey,

‘విముక్త’ కథలు – ఓల్గా

 మీకు భారత్ తో ఏం పని?

అందరూ నా పోస్టులు చదివి మెచ్చుకుంటున్నా ‘అమెరికా వలస వెళ్ళాక  మీకు భారత్ తో  ఏం  పని? అమెరికాలో కూర్చుని ఇక్కడ  కబుర్లు ఎందుకు చెప్తారు’ అనే మాట కొంచెం బాధ కలిగిస్తోంది.  ఈ మాట మొన్న మార్చి లో భారత్ వచ్చినపుడు కొందరు నాతో అన్నారు కూడా. 

సప్త సముద్రాలు దాటాక ఏ పూజ చేసినా ఫలితం ఉండదు అంటారు.  పూజలు, క్రతువులు ఏవైనా చేసే విషయంలో మేము అర్హత కోల్పోయి ఉండవచ్చు కూడా.  కాదని నేను చెప్పను. భారతీయ శాస్త్రాలలో ఏముందో నాకు తెలీదు. 

కానీ ఇక్కడ ఇంకో కోణం ఉంది. వలస వచ్చిన మాకు cultural  identity  అనేది  భారతదేశంతోటే ముడిపడి ఉంటుంది. మా దేశంలో నా  identity  నా భాష పరంగానో, నేను ఏ దేశం నుండీ వచ్చానో ఆ దేశ పరంగానో, నా మతపరంగానో ఉంటుంది. ఇంద్ర ధనుస్సులో  రంగులు వేరయినా ఎలా కలిసి ఇంద్ర ధనుస్సుని అందంగా మారుస్తాయో  అలా అందరూ కలిసిపోవడమే →  అమెరికా సంస్కృతి.  అంటే అర్ధం?  నేనేమీ  నా identity  కోల్పోకుండా  ఉండే స్వేచ్ఛ నాకుంది ఇక్కడ.  

కాబట్టి పొలిటికల్ గా చూస్తే భారత్ అనేది ఓ దేశం.  కానీ నా సంస్కృతి కూడా ! రెండు దేశాల మధ్య రాజకీయ పరంగా మాట్లాడే అర్హత కూడా నాకు లేకపోవచ్చు. కానీ ఇంకా నేను ఆ సంస్కృతినే  కొనసాగిస్తున్నాను కాబట్టి దాని  గురించి మాట్లాడటంలో తప్పు లేదు.  భారతదేశపు  రాజకీయ కోణం లో  కూడా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని నా సంస్కృతిని హేళన, demonize  చేయడం చేస్తున్నారు.  ఎలా చూస్తూ ఊరుకుంటాము? 

అమెరికాలో బళ్లలో హిందూ సంస్కృతిని  misrepresent చేస్తున్న  పాఠ్య ప్రణాళికని మార్చమని Education Dept  వారికి లేఖలు పంపాను.  బంగ్లాదేశ్ లో సనాతనుల మీద దౌర్జన్యాలు జరిగితే నిరసన తెలియజేశాను.  పాకిస్తాన్ లో దైవనింద చేసారు అంటూ  హిందువులకి  మరణశిక్షలు విధిస్తే వారికీ క్షమాభిక్ష పెట్టించమని వేడుకున్నాను.  అమెరికాలో కూర్చుని ‘డబ్బు పంచుతున్నాం కదా’ అని  భారతీయుల్ని & వారి జీవనాన్ని హేళన చేసేవారిని,  వారిని కులాల పరంగా, మతాల పరంగా  విడదీసే వారిని ఖండించాను & ఖండిస్తాను. 

‘నా సంస్కృతి యే  గొప్ప, కాబట్టి అదే అందరూ follow అవ్వాలి’ అని  కూడా నేను ఎప్పుడూ అనను.   కానీ అధర్మం అనిపించినపుడు  మాట్లాడకపోతే  నా గురువులు చెప్పినట్లు  నేను మూగదాని క్రింద లెక్క. 

ఇది Global వరల్డ్.  ‘నా  సంగతి నేను చూసుకుంటా . మీ సంగతి మీరు చూసుకోండి ‘ అంటే ఎలా కుదురుతుంది?.  ఒకరికొకకరం అండగా నిల్చోకపోతే కాలిఫోర్నియాలో SB 403 మార్పులు వచ్చేస్తాయి , Leicester, UK లో జరిగిన గొడవలు ఎవరికీ తెలియవు. పాకిస్తాన్ లో హిందూ అమ్మాయిల బలవంతపు వివాహాలు తెలియవు 

ఎన్నో వేల  ఏళ్ళ  తరువాత కూడా తమ దేశాన్ని, సంస్కృతిని, భాషనీ కాపాడుకోవడానికి కలిసికట్టుగా పని చేసే యూదులని ఉదాహరణగా తీసుకుని భారతీయ  సంస్కృతిని  కాపాడుకోవాలి.  

‘నేను అమెరికాలో ఉన్నాను’ అంటే గొప్ప కాకపోవచ్చు.  కానీ రెండు దేశాలలో నివసించిన అనుభవం ఉన్నది. అంటే  నా అవగాహన ఒక దేశంలో నివసించేవారికంటే ఎక్కువ అన్నట్టే కదా . 

ఆ అవగాహనతోటే వ్రాస్తున్న వ్రాతలే కానీ గర్వంతో వ్రాస్తున్నవి కాదు. 

ఔరంగజీబుని బతికిస్తున్నారు

ఓ పోస్టు వ్రాయడానికి ఆ మధ్య మొఘల్ రాజుల ( కాదూ కాదూ దొంగలు) చరిత్ర చదివాను. అందులో భాగంగా ఓ పాకిస్తాన్ చరిత్రకారుడి మాటలు విన్నాను. ఓ భారతీయ చరిత్రకారుడు మాటలూ విన్నాను. ఒకరు కుడి . ఒకరు ఎడమ. చరిత్ర కదా ఇద్దరూ ఒకటే మాటలు చెప్పారు.

జహంగీర్ (అనార్కలి – సలీం) కొడుకుని గుడ్డి వాడ్ని చేసి చిత్ర హింసలు పెడతాడు.

జహంగీర్ గారి భార్య నూర్జహాను సింహాసనం అధిష్టించేందుకు తన కూతుర్ని సవతి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది.

ఈ గుడ్డి వాడ్ని, ఆ అల్లుడిని చంపుతాడు మన తాజ్ మహల్ నిర్మాణ కర్త.

ఈయనకి నలుగురు కొడుకులు. కుమారుడు ఈయనని ఖైదులో పెట్టిన విషయం అందరికీ తెల్సిందే. ఆ రోజుల్లో టర్కీలకు ఉండే ఓ వింత ఆచారం గురించి చెప్పారు ఇద్దరు చరిత్రకారులు. దేశాన్ని పరిపాలించే రాజుకి, ఒకరి కంటే ఎక్కువ కొడుకులు ఉన్నపుడు , ఆయన తదనంతరం ఎవరైతే సింహాసనం కావాలనుకుంటారో వారు వారి అన్నదమ్ములతో యుద్ధం చేయాలి. Throne or coffin అనే పద్ధతి. గెలిస్తే సింహాసనం లేదా సమాధి అని అర్ధం అట. అందుకే ఔరంగజేబు తన అన్నదమ్ముల్ని చంపాడట. సింహాసనం ఎక్కాడట. గుళ్ళో మూర్తులని ధ్వంసం చేయలేకపోతే గర్భగుళ్ళో మాంసం పడేసి రావడం ఈయన వంశస్థుల ఆచారంట . అందుకు ఈయన గుళ్ళు ధ్వంసం చేయడం ఆయనకో హాబీలా పెట్టుకున్నాడు. .

వావివరుస లేదు. దయాదాక్షిణ్యం లేదు. నా బళ్ళో పాఠ్యపుస్తకాలు ఈ దొంగల్ని ‘చక్రవర్తులు’ అని పరిచయం చేయడం, అది నేను చదవడం, మార్కులు తెచ్చుకోవడం. ఏ జన్మలో పాపం చేసుకున్నామా అనిపించక మానదు.

భారతదేశం అంటే రాముడు జన్మించిన భూమి. కృష్ణుడు గీతని బోధించిన భూమి.

అన్నయ్య ‘నేను తండ్రి మాట నిలబెడతాను. రాజ్యం పరిపాలన చేయను’ అంటే, ‘నీ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుంటా ‘అంటూ అన్నయ్య పాదుకలు తలమీద పెట్టుకుని తపస్సు చేసుకున్నాడు ఆ తమ్ముడు. దుషశిక్షణ అంటూ కన్న తండ్రిని చెరసాలలో బంధించిన రాక్షసుడిని అష్టమ సంతానంగా వచ్చి వధించిన వాడు భగవానుడు. నరకాసురుడిని చంపి 16000 వేల మంది స్త్రీలకి జీవితాన్ని ప్రసాదించాడు మహానుభావుడు.

ఎవరు రాక్షసులు ఎవరు దేవుళ్ళు విడమర్చి చెప్పక్కర్లేదేమో.

‘జై శ్రీరామ్’ అనే భారతీయుడు = ఒక బత్తాయి & భాజపా ని వెనకేసుకొచ్చేవాడు. అంతే అర్ధమయినవాడు మొదట ‘తాను భారతీయుడిని’ అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి.

‘వాడు నా వాడు’ అని చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సింది పోయి ఔరంగజేబుని కొంతమంది జేబులో పెట్టుకుని ఆరాధిస్తున్నారట. ప్రపంచంలో ఎక్కడైనా తన వారిని హింసించిన వారిని పూజించే వారు ఉంటారా ? ఇదేనా భారతీయత ? 🤔🤔 ?

కన్యాకుమారి

యావత్ భారతదేశం గురించి చెప్పేటప్పుడు తరచుగా మాట్లాడే మాట ‘ కాశ్మీరు నుండీ కన్యాకుమారి ‘ వరకూ అని. కన్యాకుమారి అనే ప్రదేశం భారతదేశానికి ఓ సరిహద్దు మాత్రమే కాదు. అమ్మవారు నివసించే ఓ పుణ్యక్షేత్రం కూడా. కన్యాకుమారి అమ్మవారు శివుని కోసం ఈనాడు అనబడే వివేకానంద rock మెమోరియల్ మీద తపస్సు చేసినది అని పురాణం. అమ్మవారి పాదాలు కూడా అక్కడ ఉంటాయి.

అమ్మవారు పెళ్ళి చేసుకోకుండా కన్యలాగా ఉండిపోవడానికి ఓ స్థల పురాణం/కథ ఉంది. బకంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, కన్యాకుమారి అందరూ అక్కాచెల్లెళ్లు. వాళ్ళని పెళ్లిళ్లు చేసుకున్నాక శివుడు ఈవిడని పెళ్లి చేసుకుంటానంటాడు. ఆ చెప్పిన సమయానికి రాకపోవడం, ముహూర్త సమయం మించి పోవడంతో ఈవిడకి కోపం వచ్చి పెళ్ళి చేసుకోకుండా కన్యలా ఉండిపోతుంది. అంతేకాక ఆ పెళ్ళి మండపంలో ఉన్న వస్తువులని చూసి శపిస్తుంది. అందుకే అక్కడ ఇసుక రకరకాల రంగుల్లో కనిపిస్తుందని చెప్తారు.

2016 లో మేము కన్యాకుమారి వెళ్ళాము. ఆ అమ్మవారిని చూసాక గుడిలో ఏదో విగ్రహమా ఆ తల్లే అలా మనకి దర్శనం ఇస్తోందా అనేది ఆవిడని స్వయంగా దర్శనం చేసుకుంటేనే అర్ధమవుతుంది. అసలు అక్కడ నుంచీ కదలబుద్ధి కాదు. అంత అద్భుతం!!. ఈవిడ ముక్కు పుడక ఎంత మెరిసిపోతుంది అంటే నావికులకి దిక్సూచి లాగా ఉండేదిట. ఇక వివేకానంద rock మెమోరియల్. సముద్రం మధ్యలో ఉంటుంది. ఆయన ఆ సముద్రంలో ఈత కొడుతూ ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడే మూడు రోజుల పాటు ధ్యానంలో ఉండి పోయారు. అక్కడే వారికి జ్ఞానోదయం కలిగింది.

మేము వెళ్ళినపుడు హోటల్ సముద్రానికి ఎదురుగా తీసుకున్నాము. రూమ్ లో నుంచి గుడి, వివేకానంద rock మెమోరియల్, సూర్యోదయం అన్నీ కనిపిస్తాయి. పక్కనే ఓ చర్చినో ఏదో ఉంది. రాత్రి కాసేపు అయ్యేసరికి భక్తి గీతాలు మొదలు పెట్టారు. అర్ధరాత్రి వరకూ అదే తంతు. పుణ్యక్షేత్రానికి వచ్చామా ఇది వినడానికి వచ్చామా అనిపించింది. ఇదే అనుభవం కావాలంటే అమెరికాలోనే దొరుకుతుంది కదా. అక్కడిదాకా మేము ఎందుకు వెళ్లడం చెప్పండి? ఇది వేరే మతాన్ని దూషించడం కాదు. అమ్మవారి గుడి పక్కనే చర్చి ఏమిటి ? ఆ పాటలు ఏంటి ? భారత దేశంలో చర్చి అనేది కొత్తగా వచ్చింది. గుడి అంతకుముందే ఉండినదే కదా. ఇక్కడ ఇంకో మతాన్ని గౌరవించాలి అన్న ఇంగితం లేనిది ఎవరికి?

అంతకుముందు మధురలో కృష్ణుడుని చూద్దాం అని వెళ్తే ఇదే అనుభవం. పక్కన మసీదులో మైకులో ప్రార్థనలు.

ఇతర మతాల పుణ్యక్షేత్రాలలో వేరే మతాల వారు ఉంటారా ? హిందూ మతంలో పుణ్యక్షేత్రాలు అంటే భారతదేశంలోనే చూడాలి. ప్రపంచంలో ఇంకో చోట లేవు. మరి ఇంక పవిత్రత అనేది ఏముంటుంది? ఈ మాట అడిగితే ‘అన్నీ మతాలు ఒకటే. హిందువులకే ఈ మధ్య పిచ్చి పట్టి మతోన్మాదం ఎక్కువయింది’ అంటారు. ఒక పుణ్యక్షేత్రంలో ఆ దేవీదేవుళ్ళ తాలూకు ఆనవాళ్ళు మాయం అయి ఇంకేవో కనిపిస్తుంటే ఆ సంస్కృతి ఉన్నట్టా ? పోయినట్టా?

‘Rakalokam’ ఛానల్ లో కన్యాకుమారి మీద వారి వీడియో చూడండి. నా బాధ ఏంటో అర్ధమవుతుంది.

అమ్మపెట్టదు..అడుక్కోనివ్వదు..

మొన్న నాకు FB లో ఓ పోస్టు కనిపించింది. ఇస్కాన్ వారి ‘అక్షయ పాత్ర’ సంస్థ మీద.

భారతదేశం లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్ర కి కాంట్రాక్టు ఇచ్చారు. అక్షయ పాత్ర సంస్థ వారు పొద్దున్నే వేడి వేడి గా వారి అత్యాధునికమైన వారి వంటశాలలలో శుభ్రంగా వండి సమయానికి పిల్లలకి పెడతాము అని చెప్తారు. కావాల్సిన పోషకాలు, రుచి వాటికీ ప్రమాణాలు ఉన్నాయి అని చెప్తారు. ఆయా వీడియోలు కూడా వారి వెబ్సైటు లో ఉంటాయి. చూడచ్చు ఎవరైనా. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా ఇన్ఫోసిస్ వీళ్ళకి విరాళం ఇస్తుంటుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకి అదనంగా వారి వంటశాలలకి, రవాణాకు ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ విరాళాలు ఆ అదనపు ఖర్చుకు వాడతాము అని చెప్తారు వారు. నేను విరాళం ఇద్దామని ఫోన్ చేస్తే ‘ ముందు వచ్చి మేము చేసే పని చూడండి. పొద్దున్నే రండి’ అని చెప్పారు. అంటే వారు చేసే పనిమీద వారికి నమ్మకం ఉన్నట్లే కదా!! నేను ఇస్కాన్ భక్తురాలిని కాదు. అన్నదానం చేస్తే మంచిది అన్న సదుద్దేశ్యమే. అన్నీ సంస్థల్లాగే అందులో కూడా లోపాలు ఉండవచ్చు.కాదని చెప్పను. వాదించను.

ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పెట్టేసాం అంటే చాలదు కదా!! ఎన్నో విషయాలు చూసుకోవాలి. ఎవరు వండుతారు, ఎలా వండుతారు, నాణ్యత ..ఇలా చాలా చూడాలి. నాకు తెలిసి బళ్ళలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టినపుడు, అది టీచర్లకి పెద్ద ప్రహసనం. దాని మీద కూడా చాలా కార్టూన్లు కూడా వచ్చేవి టీచర్లు వండుతున్నట్లు, లెక్కలు చూసుకుంటున్నట్లు. ఇదంతా తలనొప్పి అని కొన్నిసార్లు టీచర్లు మాకు మధ్యాహ్న భోజన పథకం వద్దు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వద్దు అంటే ఎలా? కొంత మంది పిల్లలు కేవలం ఆ తిండి కోసమే బడికి వస్తారు. మాకు తెలిసిన ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా ఉండేవారు హైద్రాబాద్ లో. ఆవిడ చెప్పేవారు, కొన్ని సార్లు పిల్లలు, ముఖ్యం గా 10 వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నప్పుడు ఆకలికి తట్టుకోలేక పోయేవారని. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం అంటూ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవారు. ఇలాంటి పిల్లలకోసం ప్రభుత్వం funds ఇస్తుంటే, ఆ డబ్బు నొక్కేయడం కోసం కాచుకుని కూర్చుని ఉంటారు కొందరు. కొన్ని సార్లు పదార్థాలు సరిగ్గా వండక , food poisoning తో పిల్లలు చనిపోయిన వార్తలు కూడా చూసాము. మరి ఈ అడ్డంకులన్నీ దాటుకుంటూ శుభ్రంగా, వేడి వేడిగా, పోషకాలతో తిండి అందిస్తాం అంటూ ఈ సంస్థ ముందుకి వచ్చింది. నాకు తప్పేమీ కనిపించలేదు అందులో!!

ఈ సంస్థ గురించి FB లో ఆ పోస్టు వ్రాసినావిడ బాధ ఏంటో కొన్ని ముక్కల్లో చెప్తాను. ఎవరో ఏంటో చెప్పను. ఆవిడకి అంత కీర్తి రావడం కూడా నాకు ఇష్టం లేదు. పోస్టులో పిల్లలకి భోజనాన్ని సరి అయిన సమయానికి వేడి వేడిగా అందిస్తున్నారా లేదా, నిధులు దుర్వినియోగం చేస్తున్నారా , పాచిపోయినవి పెడుతున్నారా వంటి విషయాలు ఏమీ లేవు. గుడ్డు అనేది మెనూ లోపెట్టకుండా, ఉల్లివెల్లుల్లి లేకుండా చప్పటి శాఖాహారం మాత్రమే పెడుతున్నారూ .నచ్చక పిల్లలు పడేస్తున్నారు.బ్రాహ్మణ భోజనం పెట్టడం అవసరమా ? వచ్చేపిల్లలు కూలీల పిల్లలు. వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉల్లి, వెల్లుల్లి వేసుకుని తింటారు. అటువంటప్పుడు ఇలా చప్పటి తిండి ఎలా తింటారు? అన్నం తినేటపుడు ‘హరే కృష్ణ ‘ మంత్రం పిల్లలతో తప్పనిసరిగా చెప్పిస్తున్నారు. వేరే మతాల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటోంది. దళితులు వండుతుంటే పిల్లలు తినట్లేదని ప్రభుత్వాలు ‘అక్షయపాత్ర’ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారట.

ఆవిడ మాట్లాడిన మాటల్లో రెండే విషయాలు చెప్తాను..‘గుడ్డు’ ని మెనూలో పెట్టకపోవడం. ఇతర మతాల పిల్లలు కృష్ణ మంత్రం జపించడం. మాంసాహారం తినేవాడికోసం గుడ్డు పెడితే శాఖాహారం తినేవాడు ఆ రోజు ఏమి చేస్తాడు? ఇతర మతాల వాళ్ళు ఒకరో ఇద్దరో కృష్ణ మంత్రం జపిస్తే వచ్చేసిన బాధ, శాఖాహారం తినేవాడు మాంసాహారం తినలేకపోతే రాదేం? అవసరం ఉన్నచోట మైనారిటీ, అనవసరమైతే మెజారిటీనా?

రుచి నచ్చక పిల్లలు పడేస్తుంటే ఇంతపెద్ద పోస్టు వ్రాసే బదులు ‘అక్షయపాత్ర’ వారికే చెప్పచ్చు కదా?

ఈ పోస్టు చూడగానే అర్ధమయ్యింది ఏంటంటే ఈవిడది ఏదో ‘వాదం’ లేదా ‘ఇజం’ . ఏదైనా వాదించుకోవచ్చు ఏదైనా మాట్లాడచ్చు.తప్పులేదు. కానీ ఒకరు నిర్వహిస్తున్నబాధ్యతని వేలు ఎత్తి చూపించి మాట్లాడటం ఎప్పుడు చేయవచ్చు? వాడికి అప్పగించిన బాధ్యత వాడు అస్సలు సరిగ్గా చేయకపోయినా, వాడి కంటే మనం బాగా చేయగలిగినా తప్పకుండా మాట్లాడవచ్చు. ఎక్కడ హిందూ మతం అని ఉంటే అక్కడ ఈ ‘ఇజం’ మాట్లాడేవాళ్ళకి అన్నీబాధ లొచ్చేస్తాయి. అది కూడా హిందువులకే!! వీళ్ళ బాధ ఏంటో ఎన్నటికీ అర్ధం కాదు నాకు!! ఇండియా లాంటి దేశాలు ఎప్పటికీ ‘Developing’’ దేశం గా ఉండిపోవడానికి కారణం చిన్నచిన్న విషయాలు కూడా అధిగమించకపోవడమే !! నాకు తెలిసి ఇండియా ‘Malnutrition in Children’ దేశాలలో పై స్థానాలలో ఉంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు తలవంచుకోవలసిన విషయం కదూ!!

నాకు ఈమధ్య సమయం చిక్కక పోస్టులు కూడా పెట్టడం లేదు. అటువంటిది ఇటువంటి వాటిని చదివి నాకెందుకులే అని ఊరుకోలేకపోయాను. వీళ్ళు ఎంత సంఘ సేవ చేస్తారో కానీ, చిన్నపిల్లలకి కాస్తో కూస్తో మంచి భోజనం అందజేస్తున్నారు అనుకోకుండా ఏమంత్రం చదివారు అంటూ మాట్లాడుతుంటే ఇంతకంటే మనుష్యులు ఎదగలేరా అని రోత పుడుతోంది.

కావలసినప్పుడే స్త్రీ వాదం

మూడు సార్లు విడాకుల మంత్రం జపిస్తే  శిక్ష అని, ఈ మధ్యనే చాలా చోట్ల వార్తలు వచ్చాయి. అటువంటి  స్త్రీ వాదులం , స్త్రీ హక్కుల కోసం పోరాడతాం అని చెప్పుకునే బాజా వాయించుకునే వారి  గోడల మీద ‘ఆ విషయం’ తప్ప అన్నీ ఉంటాయి. ఒకసారి ఈ చర్చ వచ్చినపుడు ఒక స్త్రీ వాదిని అడిగాను ‘ వారి చట్టం ప్రకారం రెండు పెళ్ళిళ్ళు  సమ్మతమే కదా !! అది ఒక స్త్రీకి అన్యాయం జరుగుతున్నట్లు కాదా ‘ అని. అందుకు సమాధానం ‘ హిందువులలో కూడా బోలెడు మంది రెండో పెళ్ళిళ్ళు  చేసుకుంటున్నారు.’ నేను అడిగిన దానికి సమాధానం వచ్చినట్లా రానట్లా మీరే అర్ధం చేసుకోవాలి. ఎక్కడో, ఎప్పుడో స్త్రీ కి అన్యాయం జరిగి ఉన్నప్పుడు ఆ మతంలో ఇటువంటివి నియమాలు  పెట్టారేమో తెలీదు నాకు. అటువంటప్పుడు ఆ మతాన్ని తిట్టడం , స్త్రీకి హక్కులే కలిపించలేదు అనడం ఎంతవరకూ సమంజసం ? అసలు తెలిసీ తెలియని దాని గురించి మాట్లాడే హక్కు నాకు ఉంటుందా?

ఇలాంటి వారి స్త్రీ వాదుల  లాజిక్కులు విని & చూసి కొంత మంది ఆడవాళ్లు చాలా తెలివితేటలతో , ఉన్న స్వేచ్ఛ సరిపోనట్లు  ,‘‘ఆడవాళ్లు వేదాలు నేర్చుకోవచ్చా? పురుష సూక్తం చదవచ్చా ? రుద్రం చదవచ్చా ? పితృకార్యం చేయచ్చా? తలకొరివి పెట్టచ్చా ‘ అని అనే ప్రశ్నలు వేయటం మొదలు పెట్టారు. నిజంగా, కొన్ని ప్రశ్నలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారినే అడగటం చూసాను. ప్రశ్నలు అడగండీ అంటే వీరికి దొరికిందే ఛాన్సు!! ఎవరిని ఏ ప్రశ్నలు వేయాలో అర్ధం కాదు వీళ్ళకి అనిపించింది.  కొన్ని పనులు ఆడవారు, కొన్ని పనులు మగవారు చేయాలనీ చెబుతారు. చెప్పినపని చేయకుండా వద్దన్న పని చేయాలనుకోవడం వితండ వాదన కాకపోతే ఏంటి ?

ఇప్పుడు శబరిమల గురించి స్త్రీలు పెద్ద విజయం సాధించినట్లా ? దేశంలో ఉన్న గుడులు చూడటానికి సమయం లేదు.  శబరిమల ఒక్కటీ చూసి జన్మ సాఫల్యం చేసుకుంటారు కాబోలు పాపం!! అయ్యప్ప స్వామిని నమ్మే స్త్రీలు, ఆయన కథని కూడా నమ్ముతారు. ఆ కథని  నమ్మేవారు సుప్రీంకోర్టు కాదు కదా ఎవరు దిగి వచ్చి చెప్పినా ఆ ఆలయంలోకి అడుగుపెట్టరు.

అయ్యప్ప గుళ్లో స్త్రీలకి అనుమతి గురించి పోరాడే వాళ్ళని చూస్తే ఎంత  హాస్యాస్పదం గా అనిపిస్తుందంటే సగం మంది ‘నాస్తికులం’ అంటారు !! మరి ఏ దేవుడికి ఏం చేస్తే వీళ్ళకెందుకు ?? పురాణాలని ఆధారం చేసుకుని స్త్రీలని భారత దేశంలో హింసించారుట !! అందుకని వీళ్ళకి చాలా బాధ పాపం!! పదేళ్ళ  క్రితం ఏం జరిగిందో తెలీదు, గుర్తుండదు. వేలఏళ్ళక్రితం జరిగిన విషయాలు మాత్రం కళ్ళకి కట్టినట్లే చెప్తారు. మరి టైం మెషిన్ ఉందేమో వాళ్ళ దగ్గర 🙂

సనాతనధర్మంలో అసలు ఆడవారు  మోక్షాన్ని పొందటానికి మార్గమే సూచించలేదని, వివక్ష చూపించటానికి ఈ మధ్య ఒకచోట వాదన – ముఖ్యంగా విధవరాలైన స్త్రీలకి, పెళ్లిళ్లు కానీ స్త్రీలకి  !! ‘ధర్మం అనేది ఎప్పుడూ మారుతుంది దేశకాలాలతో’ అని అర్ధం చేసుకునేవారికి ఏ ధర్మం & శాస్త్రం బోధించనక్కరలేదన్నసంగతి ఎంత కాలానికి బోధపడుతుందో నాకైతే అర్ధం కాదు. ఉదాహరణ చెప్తాను. భర్త చనిపోతే, కొడుకులు లేనందున అల్లుడిని మావగారికి తలకొరివి పెట్టమని అడిగిందట ఓ మహా ఇల్లాలు. ఆ అల్లుడు తలకొరివి పెట్టి, పెట్టినందుకుగాను ఉంటున్న ఇల్లు కూడా ఖాళీ చేసి మొత్తం ఆస్థి నా పేరుమీద వ్రాస్తావా లేదా అని అత్తగారి నెత్తిన  కూర్చున్నాడట. అలాంటప్పుడు శాస్త్రం చెప్పినది ఆచరించక్కర్లేదు అంటాను నేనైతే!! ఆవిడే భర్తకి తల కొరివి పెట్టవల్సిందేమో అనుకున్నాను కూడా !!

నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంత మంది వ్యక్తులు పని కట్టుకుని సమాజాన్ని, ఎప్పుడూ  ఏదో విధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం ,వాదోపవాదనలు చేయడం, తెలిసీ తెలియని మనుష్యుల మనస్సుల లో విషపు బీజాలు నాటడం  చేస్తున్నారు. దాని వలన ఇటువంటి ఫలితాలు!! అంత క్రితం ఒకసారి చెప్పాను కదా , ఒకాయన స్త్రీవాదాన్ని ప్రోత్సహిస్తూనే రావణాసురుడు తప్పేమి చేయలేదు అన్నట్లు మాట్లాడారు.   శ్రీరామ నవమి రోజు రాముడిని తిట్టడం సరిపోతుంది వీళ్ళకి. వినాయక చవితి రోజు మాత్రమే నీళ్ల కాలుష్యం, శబ్ద కాలుష్యం గుర్తొస్తుంది వీళ్ళకి. దీపావళి కి సరేసరి !! పొగ కాలుష్యం ఉండనే ఉంది !! ఆ మధ్య గోవు మాంసం నిషేధం జరిగినపుడు కొంతమంది ఏకంగా కథలే వ్రాసేసారు. ఇంత కథలు వ్రాసినవారు , ప్రతి పండగకి  ఏదో ఒకటి పోస్టు చేసేవారు, అన్యమతానికి వచ్చేసరికి నోరు మెదపరు. మరి భయమా ? గౌరవమా ? వేరేమతాలని ఆగౌరవపర్చాలి, అవమానించాలి అని నేను అనడం లేదు. ఏ మతంలో పద్ధతి ఆ పద్ధతి ఉంటుంది. ఆ నమ్మకాలని గౌరవించాలి. మనం కోరుకున్న మార్పు చట్టాలతో వస్తోందా ? . ఒక మనిషి ఇంకొక మనిషి మీద గౌరవ మర్యాదలు ఇవ్వటానికి చట్టాలు ఎంత వరకూ పనిచేస్తాయి ?  ‘sensitivity’ అనేది ఒకటి ఉంటుంది. అది లేకపోతే ఏ చట్టము ఏమీ చేయలేదు.

‘సీత శీలాన్ని అనుమానించడం, నిండు గర్భిణిని అడవులకు తోలడం …ఇవి మన పిల్లలకు నేర్పిద్దామా? ‘

ఈ మధ్య వచ్చిన  ‘కాలా’ చలనచిత్రం గురించిన ఒక వాదనలో,  రావణుడుని సమర్థిస్తూ ‘రావణుడు తప్పు చేసాడు. అయినా పీడిత జనుల కోసం పోట్లాడాడు’ అన్నారు ఒకరు.  ‘అయితే రావణాసురుడి గురించి పిల్లలకి నేర్పుదామా ‘ అన్న నా ప్రశ్న కి సమాధానంగా ఇంకో ప్రశ్న వేశారు. ఇది వారికే కాదు. సామాన్య మానవులకి కూడా వచ్చే సందేహం.

ఈ పోస్ట్ రామాయణం మీద వితండవాదన చేసేవారికి మాత్రం కాదు. రామాయణం ఎంత సహృదయం తో  విన్నా, వితండవాదన చేసేవారి వాదనలు విని సామాన్యులకి సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ సామాన్యుల కోసమే ఈ టపా. ఎవర్నీ  నమ్మించాలన్న ఆతృత నాకేమాత్రం లేదు. నమ్మితే నమ్మచ్చు లేకపోతే లేదు. వితండవాదన కోసం వ్యాఖ్యలు చేస్తే అవి ప్రచురించను. రాముడి మీద వాదోపవాదాలు చేయడానికి ఎంతటి వారం మనం ?

ఇవన్నీ నా ఆలోచనలు మాత్రమే. రామాయణంని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటే నన్ను క్షమించండి _/\_

దశరథుడు రాముడిని పిలిచి ‘పొద్దుటే నీ పట్టాభిషేకం’ అన్నాడు. అలా చెప్పిన  కాసేపటికే ‘మీ నాన్నగారు నాకు మాటిచ్చారు నువ్వు అడవులకి వెళ్ళాలి ’ అని కైకేయి చెప్పింది.  రాముడు తనకి పట్టాభిషేకం చేస్తానన్నపుడు ఒకేలా ఉన్నాడు. రాజ్యం నీకు కాదు అన్నపుడు ఒకేలా ఉన్నాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన విషయం. రామాయణం ఏదో  కథగా వింటూ రాముడు దేవుడు అనుకుంటే పెద్ద ప్రభావం ఉండదు మనకి. మన నిజజీవితంలో ఆ విధంగా ఉండటం అంత సులభమేం కాదు. ఈ చిన్న ఉదాహరణ ఆయనకి రాజ్యకాంక్ష లేదు అని చెప్తోంది. అంత రాజ్యకాంక్ష ఉన్నవాడైతే ఆ రోజే తండ్రిగారి మీద తిరగబడి లాక్కునే వాడే కదా ?

మరి వనవాసం నుంచీ వచ్చాక పట్టాభిషేకం చేసుకున్నాడు!! ఎందుకు ?

రాముడు వనవాసంలో ఉండగా   భరతుడు వచ్చాడు. రాముడి పాదుకలు పట్టుకెళ్ళి , తాను నందిగ్రామంలో ఉన్నాడు. తనకి రాజ్యం వద్దు గాక వద్దు అన్నాడు.

యుద్ధం ముగిసాక , సీతాదేవిని అందరి ముందర పిలిచి చెప్పాడు.అప్పుడే సీతాదేవి ఎన్ని అడగాలో అన్నీ అడిగిందట ఆయనని.  అగ్నిప్రవేశం చేయమని రాముడు అడగలేదు. కానీ ఆవిడ అగ్నిప్రవేశం చేస్తుంటే అడ్డుకొనలేదు కూడా. ఎందుకలా ??

భరతుడు రాజ్యం తీసుకోడు. ప్రజలందరూ రాముడికే  ఓటు వేశారు. కాబట్టి ఆయనే రాజు అవుతాడు. రాముడు అయోధ్య చేరిన వెంటనే పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన  ఏకపత్నీ వ్రతుడు. కాబట్టి సీతాదేవి పక్కన ఉండాలి. కాబోయే పట్టపురాణిని ఒక్కరు కూడా పల్లెత్తు మాట అనకూడదు అనేది ఆయన  ఉద్దేశ్యం. అది avoid చేయడానికి లంకలోనే ఈ తంతు జరిగింది.

ఇంత చేసాడు కదా మరి ఎందుకు పరిత్యజించాడు ? ఒక్కరెవరో అన్నమాటకే  అలా వదిలిపెట్టేయాలా ? (అసలు ఈ ఘట్టం వాల్మీకి రామాయణంలోని లేదు. ‘లవకుశ’ సినిమా చూసి అందరం మాట్లాడేవారమే !!)

ఈ రోజుల్లో మంత్రులకి గెలవాలి, ఆకుర్చీలో కూర్చోవాలి అన్న తపనే కానీ, 100 మందిలో 90 మంది ఓటు  వేస్తే 10 మందికి ఓటు ఎందుకు వేయలేదు అన్న సంగతి ఆలోచించరు . ఆ పది మంది గురించి ఆలోచించేవాడే రాముడు. 100% perfect  గా ఉండాలి ఆయనకి. అందుకే అది రామరాజ్యం అయింది.

విముక్త కథలలో అనుకుంటాను. రచయిత్రి ‘రాముడు ఆర్యుడు . రాజ్యదాహం అందుకే’ అని వ్రాసారు. ఒక ఆర్మీ ఆఫీసర్, fire  fighter , పోలీస్ ఆఫీసర్ మా కుటుంబాలే మాకు ముఖ్యం అనుకుంటే ఆ ఉద్యోగాలు ఎవరు చేస్తారు? అలాగే ఒక రాజుకి భార్య ముఖ్యమా? రాజ్యం  ముఖ్యమా ? భార్య కోసం రాజ్యం వదులుకుంటే ఆ రాజుని ఈ రోజుకి కూడా ఎందుకు గుర్తుంచుకుంటాము?

రాజు కదా ఆ విధంగా సీతని అన్నవాడిని  శిక్షించచ్చు . Sadhguru గారు ఈ మధ్య కవిత గారి ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పారు. ప్రతి నేరానికి శిక్షలు, చట్టాలు అంటూ పోతే అవేమి ఆడదానికి సహాయం చేయవు. మనుష్యులలో  ‘Sensitivity’ ని develop చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అని. రాముడు ఇక్కడ చేసింది అదే!!

రాముడు సీత అనుమానించడం, అవమానించడం ఏమీ  చేయలేదు. రంధ్రాన్వేషణ చేసేది మనము. ‘మోడీ భార్య ఏం  చేస్తోంది ? ట్రంప్ గారికి ఎంత మంది భార్యలు? ఒబామా గారి భార్య వేసుకున్న బట్టలేంటి ? లేడీ డయానా గారు భర్తని వదిలేసి ఎవరితో కారులో వెళుతున్నారు ?వెంటబడి పీక్కుతిందామా ? చిరంజీవి కూతురు రెండో పెళ్లి బాగా జరిగిందా ?రేణు దేశాయ్ గారు ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నారు? ’  ఇలాంటివి మనకి కావాలి. ఆ లేకితనాన్ని ఖండించలేక, చేతగాక రాముడిని నిందిస్తున్నాము.

అసలు ఇవన్నీ కాదు. రాముడు విప్లవాత్మకంగా ఆలోచించి అవన్నీ  పట్టించుకోకూడదు అంటారా ? రాముడు మామూలు మానవుడిగా బ్రతికుదామని అనుకున్నాడు. అది గుర్తుంచుకోవాలి.  ‘అవతల వాళ్ళు ఏమి అన్నా పట్టించుకోకూడదు’ అనుకుంటాము. అది అంత సులభమా ? మనం పట్టించుకోకపోయినా పట్టించుకునేలా చేస్తుంది సమాజం. రాముడు ఏవి పట్టించుకోకుండా ఉండలేడు. ఎందుకంటే సీతాదేవి మీద ఉన్న అనురాగం అటువంటిది.

రాముడికి వచ్చింది పెద్ద ధర్మ సంకటం. ఆరోజుకి  ఏది ధర్మమో అదే చేసాడు ఆయన . రాముడు ధర్మం తప్పితే ఆయన  గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

కాబట్టి రాముడిని తప్పు పట్టడం మానేసి సీతని నింద  చేసిన వాడి గురించి పిల్లలకి నేర్పించి ఆలోచింపజేయండి. వాడికీ  మనకీ తేడా ఉండాలి కదా ??

ఇంకో జన్మా ? మోక్షమా ? పాపం- పుణ్యం !! అసలు దేవుడే లేడు. అంతా సైన్స్!!

నిన్నటికి మొన్న,  144 మంది ప్రయాణీస్తున్న విమానం. ఆకాశంలోకి  ఎగరగానే ఒక్క సారిగా engine failure. ఎంతో నైపుణ్యంతో ఏ మాత్రం తొణకకుండా  ఆ పైలట్ 143 మందిని యమలోకం నుండి భూలోకానికి చేర్చింది. కిటికీ అద్దం విరిగి, తోటి ప్రయాణీకురాలు  శరీరం సగం విమానం బయటికి వెళ్ళిపోతే, ఆవిడ ప్రాణాలు కాపాడాలని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా లోపలి లాగారు cowboy  టోపీ పెట్టుకున్న ఒక హీరో. ఇంకో ఇద్దరు ఆవిడకి ఊపిరిపోసి ప్రాణం కాపాడదాం అనుకున్నారు. ‘అంత నైపుణ్యంగల పైలట్ ఉన్న విమానంలో  ఉండటం వలన బ్రతికాం, లేకపోతే మా ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిన రోజు కదా ‘ అనుకుంటున్నారు 143 మంది. ఊపిరిపోసినా ప్రాణాలు నిలువలేదు 144-143 =1 ఒకరికి.  ఎలా జరిగింది అంటే చెప్పగలమేమో కానీ ఎందుకు జరిగింది అన్న ప్రశ్న కి సమాధానం ఎవరు చెబుతారు?

జీవకోటి నీచేతి..తోలుబొమ్మలే..నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే’ నిజం కాదా ? కాదనే వారున్నారు 🙂

అటువంటి వారి కోసమే ఎప్పుడో ఉగాది తర్వాత  వ్రాసుకున్న ఒక టపా ఇప్పుడు పోస్టు చేస్తున్నాను:

‘ఇంకో జన్మా ? మోక్షమా ? పాపం- పుణ్యం !! అసలు దేవుడే లేడు. అంతా సైన్స్!!’అంటూ  ఈ మధ్య  హేతువాదుల  గోల ఎక్కువయింది. పుస్తకాలు, ఫేస్బుక్  గోడలు, జాతకాల గురించి, పూజల గురించి ఎడ తెరపి లేకుండా అన్నీ సైన్స్ తోటే సాధ్యం అంటూ టీవిలో వాదనలు!! పండగల రోజుల్లో కూడా పొద్దున్నే టీవీల్లో ప్రత్యక్షమవుతున్నారట !! ఈ మధ్య జనాలకి  డబ్బులు ఎక్కువయ్యి పూజలు, మూఢభక్తి హెచ్చి వేలంవెర్రి ఎక్కువయ్యింది అని ఒప్పుకుంటాను. మూఢ నమ్మకాల గురించి తెలియజెప్పడం మంచిదే అంటాను. కానీ మూఢనమ్మకాలు తీసివేయడం దేవుడెరుగు 🙂 వెర్రిమొర్రి  వితండవాదన చేసి జనాల్లో ఉన్న కాస్త పాపభీతి అనేది కూడా లేకుండా చేస్తూ, సర్వమంగళం పాడిస్తున్నారు ఈ హేతువాదులు. కొండ నాలుకకు మందువేస్తే, ఉన్న నాలుక ఊడిందట!! వాళ్ళు చెప్పిందే అందరూ నమ్మి హేతువాదుల్లాగా మారిపోవాలనుకుంతున్నారో ఏంటో మరి!!  మొత్తానికి మతమార్పిడి చేసే గురువుల కంటే చాలా విసిగిస్తున్నారు అనిపిస్తోంది. ఎవరి నమ్మకాలు వారివి. ఎదుటివారి నమ్మకాన్ని గౌరవించినంతకాలం ఎవరు ఏ సంప్రదాయాన్ని నమ్మినా తప్పులేదు. కానీ ఇంకొకరి నమ్మకాన్ని హేళన చేయటం, ‘నాన్సెన్స్’ అనే మాట  అనటమూ చూసాక ఓ టపా వ్రాయాలి అనిపించింది.

‘దేవుడనే వాడే లేడు. ఎవ్వరూ  చూడలేదు. ఉంటే చూపించండీ ‘ 

‘పూర్వజన్మలు , పాపాలు , పుణ్యాలు, మోక్షము  ఇవన్నీ చెత్త మాటలు. మనిషిని ఆకర్షించడానికి ఇవన్నీ చెప్పి పిచ్చి వాళ్ళని చేస్తారు’

ఈ రోజుల్లో టీవీలు, అంతర్జాలం, ముఖపుస్తకం , వాట్సాప్ వచ్చేసి అందరం  అన్నీ బోధిస్తూ మాట్లాడేస్తున్నాం కానీ, పూర్వం ఇవేమి ఉండేవి కాదు కదా !! మరి ఒక సామాన్యుడికి మంచేదో చెడేదో బోధిస్తూ వాడికి ఎటువంటి విపత్తు వచ్చినా  దాన్ని ఎదుర్కొని మనోధైర్యాన్ని ఇచ్చి, తిరిగి సమాజంలో జీవించేలా చేయడానికి ఏమిటి మార్గం ? ఈ రోజుల్లోలాగా వాడికి కౌన్సిలింగ్ అంటూ గంటకి $150 అంటే వారి పరిస్థితి ఏమయిపోవాలి?  

వేరే మతాల గురించి నాకు తెలీదు. వాటి గురించి మాట్లాడను. నాకు తెలిసినదే మాట్లాడతాను.  

సనాతనధర్మం /వేదాంతం/తత్వబోధ/ హిందూమతం  తీసుకుంటే, సమాజం లో ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పరిస్థితిని ఆలోచించి ఎన్ని తత్వబోధలు చేసారో వింటుంటే ఆశ్చర్యం అన్పిస్తుంది. ఒక కౌన్సిలర్ కూడా అన్ని విషయాలు చెబుతాడా అనేది సందేహమే !! ఈ concept  చూస్తే → ఈ శరీరం శాశ్వతం కాదు. చేసిన పాపపుణ్యాల బట్టి మోక్షప్రాప్తి లేకపోతే ఇంకో జన్మ. హేతువాదులు చెప్పినట్లు ఇది అబద్ధమే ట్రాష్ అనుకున్నా, తెలుసుకోవలసిన ఒక్క నిజం ఖచ్చితంగా చెప్తుంది శాస్త్రం.  ఒక మనిషికి ఆయుష్షు నూరేళ్ళు.అంటే ఆ నూరేళ్నూ బ్రతకడు కదా? ఓ ఎనభై ఏళ్ళు. ఆ ఎనభై తర్వాత తాను సున్నా అనుకోడు. కానీ తానెప్పుడూ భూమి మీద ఉండేవాడినే అనుకుంటూ ఉంటాడు. అందుకే నువ్వెప్పుడూ temporary వాడివేరా అని గుర్తుచేస్తుంటుంది  వేదాంతం. ఇవి వినీ వినీ ఒక మనిషికి తన శరీరం శాశ్వతం కాదు అనే వైరాగ్యం వస్తే చాలు, మంచి పనులు తప్ప చెడు పనులు చేయడానికి మనసు ఊరుకోదు. అలా కొంత కాకపోతే కొంతైనా introspection మొదలవుతుంది. ఫలానా పాపం చేస్తే వచ్చే జన్మ లో పిల్లిలానో/ బల్లిలానో  పుడతావు అంటే ఒక సామాన్యుడు నమ్మి ఉండవచ్చు. ఆ భయం ఉండేది కాబట్టి ఎప్పుడూ నిజాయితీ/ సద్బుద్ధి/నీతి/నియమాల తో ఉండేవాడు. పాపాలు అంటే ఉదాహరణలు చూస్తే : తల్లితండ్రుల మాట వినకపోతే పాపం, పెద్దలని గౌరవించకపోతే పాపం, హత్య చేస్తే పాపం, ఆత్మహత్య మహాపాపం, మాటలతో హింసిస్తే పాపం, చీమని చంపినా పాపం, చివరికి అసురసంధ్య వేళ  చెట్టుని ముట్టుకున్నా పాపం. బ్రతికి ఉన్నన్నాళ్ళూ మంచి పనులే చేయి అని చెప్పడం ఈ ముఖ్య ఉద్దేశ్యం. అలా కొద్దో గొప్పో పాపభీతి ఉన్నమనిషికి రొజూ టీవిలో యాంకర్ పక్కన కూర్చుని ‘ పాపం లేదు పుణ్యం లేదు. అంతా నాన్సెన్స్ ‘ చెబుతుంటే అంటే ఏమవుతుంది?

ఇక  ‘పూర్వజన్మ సుకృతం’ – ఈ మాట అంటే హేతువాదులకి ఎంత కోపమో  🙂

జబ్బు వలనో, ప్రమాదం వలనో , ఇంక దేని వలన కానీ  మృత్యువు సంభవించి కుటుంబసభ్యులని కోల్పోయిన వారికి ఏ కౌన్సిలింగ్ ఇస్తే వారి బాధ మాయమవుతుంది?  వారిని రోజు వేధించే ప్రశ్న ఒకటి ఉంటుంది. ‘నాకే ఎందుకు ఈ బాధ ?’ ‘why only me ?’. ఈ మధ్యఎవరైనా చనిపోతే  తరచుగా చూసే వ్యాఖ్య – ‘RIP. I Pray God to give enough strength to their family members’. నిజమే. అందరూ ప్రార్థిస్తారు  వారి కోసం. కానీ ‘దేవుడు’ అనే నమ్మకం కూడా కోల్పోయిన పరిస్థితి లో ఉంటారు వారి కుటుంబ సభ్యులు. అప్పుడు ఏమి చెప్పగలము? అటువంటి విపత్కర పరిస్థితులు  ఎదురైన వారికి, ‘అందరికీ అన్నీ ఉన్నాయి. నేను మాత్రమే చాలా కోల్పోయాను’ అన్న భావన తో విరక్తి కలిగి, సమాజం అంటే ఒక రకమైన ఏవగింపు, తెలియని కసి మొదలవుతుంది. ఆ ప్రభావం ఎప్పుడో ఎక్కడో  చూపించడం మొదలవుతుంది. అది సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అటువంటి పరిస్థితులకే ‘ఏదో జన్మ లో పాపం. ఈ జన్మ లో వారి నుదుటి వ్రాత ’ అన్న కర్మసిద్ధాంతము & జన్మజన్మల వృత్తాంతాల కథలు, గాధలు  వచ్చాయి అనిపిస్తుంది. ఆ మాట నిజంగా పాపం చేసారనా ?? ఎంత మాత్రం కాదు. కేవలం అంత బాధ లో ఉన్న మనిషి డిప్రెషన్ లో కొనసాగకుండా, ’పోయిన జన్మలో ఏదో పాపం వలన ఇలా అయింది. పోనీ ఈ జన్మ లో అయినా దాన్ని రూపుమాపేలా చేసుకుందాం’ అనే నిర్ధారణ కి వచ్చి తిరిగి సర్దుకుని సమాజజీవనంలోకి ప్రవేశించేందుకు ఈ అస్త్రం!!  ఏ సిద్ధాంతాలయినా బ్రతికి ఉన్న మనిషికే కానీ చనిపోయిన వారికి కాదు అన్న సంగతి అందరికీ తెలుసు ఒక్క ఈ హేతువాదులకి తప్ప 🙂

దేవుడి పూజ చేస్తే పాపాలు పోతాయా ? రావణాసురుడు వేదం చదువుకున్నాడు. ప్రొద్దున్నే లేచి పూజలు కూడా ‘ శాస్త్రోక్తముగా  వేకువనే విధులన్నీ యొనర్చెను’ అని చెప్పారు. పూజ చేసాడుగా రావణాసురుడు? మరి పాపాలన్నీ హరించుకుపోవాలి కదా ?  పూజ చేసుకుంటున్నంత సేపు  ‘మదోత్కటుడై మదనతాపమున మరిమరి సీతను మదిలో నెంచెను’ అని కూడా చెప్పారు. !!

ఏది పుణ్యం? ఏది పాపం ?  మనం చేసే ప్రతి పనిని పరీక్షించుకోవడమే పాపపుణ్యాలు  !! just an introspective!! చిత్తశుద్ధి తో చేసే పని తో స్వర్గం కనిపిస్తుంది !! చిత్తశుద్ధి లేకపోతే అనుక్షణం నరకమే కనిపిస్తుంది  !!

‘దేవుడు ఉంటే  కనిపిస్తాడు గా. లేనే లేడు . physical గా కనిపించనిదే  ఎలా నమ్ముతాం?’ . తన జీవితంలో రోజులు గడిచిపోతుంటే కాళికాదేవి కనిపించట్లేదని రామకృష్ణ పరమహంస  పొర్లి పొర్లి ఏడ్చారట. దేవుడు అంత సులభంగా కనిపిస్తాడా అందరికీ ? ఏమో చెప్పలేము హేతువాదులకి కనిపించినా కనిపించచ్చు కూడా . ప్రహ్లాదుడు పుట్టినప్పటినుండీ ఆయననే తలచుకున్నా, ఆయనకి  కనిపించని వాడు హిరణ్యకశిపుడు అడగగానే ఒక్క ‘దెబ్బ’ కి కనిపించాడుగా !!

హేతువాదులూ , మీరు పూజలు చేయనక్కర్లలేదు. దేవుడిని నమ్మనక్కర్లలేదు.  దేవుడు లేడని నమ్మించనక్కర్లేదు. చెట్టు కొమ్మకి చీడ పట్టిందని చెట్టుని వేర్లతో మాత్రం  పీకేయకండి బాబు!!

Science gives knowledge, but not wisdom!!!

పురాణాలూ – వక్ర భాష్యాలు

ఈ టపా పురాణాల్ని గురించి  వక్రం గా మాట్లాడేవారికి మాత్రమే 🙂

ఈ రోజు ముఖపుస్తకం లో ఒక పోస్టు నా ఖర్మ కాలి  నా కళ్ళబడ్డది ‘రాముడికి మగపిల్లలు, కృష్ణుడికి మగపిల్లలు  శివుడికి మగపిల్లలే ఉన్నారు. అంతా పితృస్వామ్యం , పురుషాధిక్యత’. మొన్న ఎక్కడో ఇంకోటి ‘కృష్ణుడు దేవుడు కాబట్టి తప్పు చేసినా ఒప్పే అని చూపించేస్తారు భారతం లో ’ .  నా ఖర్మో ఏంటో మరి నాకే కన్పిస్తాయో తలా తోకా లేని పోస్టులు. శ్రీరామ నవమి రోజు కన్పించిన పోస్టులు ఇదిగో ఇలాంటివి    – ‘రాముడు బక్కగా ఉండేవాడు, ఇప్పుడు క్రూరం గా ఉన్నాడు’ .’శూర్పణఖ ముక్కు కోసారు’ . ‘భార్యని అడవుల పాలు చేసాడు’ ‘అగ్ని లో దూకమన్నాడు ‘. ‘బ్రాహ్మణుడి కోసం శంభూకుడి ని చంపాడు’ .ఈ రోజుల్లో ఎంత మందికి సంస్కృతం అర్ధం చేసుకోవడం వచ్చు? పోనీ కనీసం ఓ తెలుగు పద్యం చదవగానే తడుముకోకుండా  అర్ధం చెప్పగలరా? అంతెందుకు ఒక త్యాగరాజ కీర్తన అర్ధం చేసుకోలేరు కొంతమంది. అసలు, అత్యంత  సులువుగా ఉండే తెలుగు కథలనే చదవటం ఆపేస్తున్నరోజులు మొదలయ్యాయి. అటువంటిది ఏం తెలుసు అని  ఒక గ్రంధం గురించి మాట్లాడుతారు?  ఏం  తెలుసు అని ఒక సంస్కృతిని దుమ్మెత్తి పోస్తారు?

ఊర్మిళ నిద్ర వృత్తాంతం, రాముడు సీతని అడవులలో వదిలిపెట్టడం  అసలు వాల్మీకి రామాయణం లో  లేనే లేవని ఎంతమందికి తెలుసు? సీతని అడవులకి పంపడం అనేది ఉత్తరకాండ లో  ఉన్నది. ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదు అంటారు. ఋషిప్రోక్తం అంటారు.  చాగంటి గారు కూడా ప్రవచనం చేసేటప్పుడు శ్రీరామ పట్టాభిషేకంతో ఆపేసారు. అసలు ఒక ‘చాకలి’ అన్న మాట కూడా లేదంటారు. ఈ మాట నేను గరికపాటి వారి నోటి వెంట విన్నాను. 

తిరుమల తిరుపతి దేవస్థానం వారు పబ్లిష్ చేసిన ఆంధ్రమహాభారతం లో ఒక్క ద్రోణపర్వం మాత్రమే 840 పేజీలు ఉంది.(ఈ ద్రోణపర్వం లో ఎన్ని పేజీలు చదవటం  సులభమో  తెలీదు కానీ ద్రోణుడిని విమర్శించడం చాలా తేలిక కొంత మందికి.) ఇక ఈ లెక్కన మొత్తం భారతం ఎన్ని పేజీలుంటుందో ఆలోచించండి. ఆఫీసులో పని చేసి, ఇంట్లో పనులని , పిల్లల బాధ్యతలు  చూసుకుంటూ  ఉండే నావంటి ఒక సగటు వ్యక్తి ద్రోణపర్వం వంటి పుస్తకాలు  ఎన్ని చదవగలడు/దు ? రామాయణం, మహాభారతం , భాగవతం క్షుణ్ణంగా చదవటానికి  ఒక జీవితకాలం సరిపోదు.  అవునా ?  మరి దేనిని ఆధారంగా చేసుకుని మాట్లాడతారు ? ఓ మూడు గంటల సినిమా చూసి, ఓ లెఫ్టిస్ట్  వ్రాసిన పుస్తకం చదివో  అర్ధం పర్ధం లేని థియరీలు అల్లేయటం మర్యాదస్తులకి మంచిపద్ధతేనా !!  తందానా అంటూ వీరికి వేలిముద్రలు, వ్యాఖ్యలు చేసేవారుంటారు. ఇంకో ‘very sophisticated’ పిచ్చి జాడ్యం ఏంటంటే పురాణాలూ ఇంగ్లీష్ లో చదివి పిచ్చి ప్రేలాపనలు చేయడం!!. వీరితో అత్యంతప్రమాదం అసలు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ  నిజాలే మాట్లాడుతున్నారు అనుకుంటారు అవతలవారు  కూడా.

పురాణాలన్నా, ప్రవచనాలన్నా  చదివి/విని తీరాలి & తప్పదు  అన్న నియమం ఏది లేదు. (డెమోక్రసీ అన్న పదం వేరే మతాల్లో ఉందో  లేదో నాకు  తెలీదు కానీ ఆ రోజుల్లో సనాతన ధర్మానికి మాత్రం ఉండేది అని ఖచ్చితంగా చెప్పచ్చు). చదవక/వినక పోయినావలన నష్టం ఎవరికీ లేదు. కానీ –  ఒక సంస్కృతి గురించి  ఒక  పుస్తకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడేటపుడు  original చదివి విమర్శించండి. పూర్తిగా తెలియని వాటి గురించి  మాట్లాడే హక్కు ఏ మాత్రం లేదు. వ్యాసుల వారు, వాల్మీకి  వారు వారి పుస్తకాల మీద కాపీ రైట్స్ అందరికి ఇచ్చి వెళ్ళింది వాటిల్లో మంచిని చూడమని . అంతే కానీ వక్రభాష్యం చెప్పమని మాత్రం  కాదండీ !!