నవరాత్రులు మొదలయ్యాయి. మాములుగా అయితే దసరా ప్రతిరోజూ లలిత చదువుకుంటాను. ఈ సారి నాకు అమ్మవార్లయిన వాళ్లందరినీ తలుచుకుంటూ ఒక్కొక్కరి గురించి వ్రాద్దామని అమ్మవారిని తలచుకుందాం అన్న ఆలోచన ఒకటి వచ్చింది. అందుకే ఇలా ….
కొంచెం personal గానే ఉంటాయేమో పోస్టులు
ముందు అమ్మమ్మ గురించి మొదలు పెడతాను.
అమ్మమ్మ & ఆవిడ జీవితం గురించి వ్రాయాలంటే ఒక్క టపా సరిపోదు. కానీ కొంచెం క్లుప్తంగానే వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
అమ్మమ్మ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగింది. తనకి సొంత తోబుట్టువులు అంటే అన్నయ్య ఒక్కడే కానీ, పెదతండ్రి, మేనత్త పిల్లల్ని కలుపుకుంటే బోలెడు బలగం అమ్మమ్మకి. అమ్మమ్మకి ఇద్దరు పెదతండ్రులు. ఇద్దరు మేనత్తలు. అమ్మమ్మ ఐదో ఏట ఉండగా తల్లి పోయింది. అన్నయ్య వచ్చి ‘అమ్మని నా చేతులతో పంపేసానమ్మా ‘ అని ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నాడో కూడా అర్ధం కాలేదుట అమ్మమ్మకి. అమ్మమ్మ తల్లి చనిపోయెనాటికే పెదతండ్రులిద్దరి భార్యలు కూడా చనిపోయారట . ముగ్గురు అన్నదమ్ములు కూడా సవతితల్లులు వస్తే తమ పిల్లల్ని సరిగ్గా చూడరేమోనని రెండో పెళ్లి చేసుకోలేదట. ఈ పిల్లలందరినీ విధవరాలైన ఒక మేనత్త చూసుకునేది. ఆవిడే అమ్మమ్మకి పురాణాలూ చెప్పేదిట. అమ్మమ్మ అందరిలోకి చిన్నది కావడంతో ఏదైనా తాయిలం తెస్తే ముందు అమ్మమ్మకి పెట్టి తరువాత అందరూ తినేవారు. అలా తల్లి లేని పిల్ల అని అమితమైన గారాబంతో పెరిగింది అమ్మమ్మ.
పదకొండేళ్ళు నిండగానే మా తాతయ్యతో వివాహం అయ్యింది. అప్పుడు ఆయనకి పదమూడేళ్ళు. తన పదహారో ఏట కాపురానికి వచ్చింది. అమ్మమ్మకి కొన్ని ఏళ్ళ వరకు పిల్లలు కలుగలేదు. అటువంటప్పుడు ఆ రోజుల్లో కొందరు ద్వితీయ వివాహం చేసుకునేవారు. తాతయ్య తాను ఒక్కడే కొడుకయినా అటువంటి ఆలోచనలు రానివ్వలేదు. వారి ఇరువురికి ఐదుగురు సంతానం, మనవళ్ళు & మనవరాళ్లు , ముని మనవరాళ్ళు & ముని మనవలు .. చాగంటి గారు చెప్పినట్లు తామర తంపర 🙂 .
ఇంట్లో ఏ కూర చేయాలి అన్న దగ్గర నుంచీ ఆవిడ అత్తగారు, అంటే మా ముత్తవ్వ గారిదే decision making . మా ముత్తవ్వ గారి చివరికోరిక మా అమ్మ పెళ్లి చూడాలి అని. అందుకు అమ్మని కాలేజీకి పంపకుండా పెళ్లి చేయమని అడిగేదిట ఆవిడ. దేనికి అడ్డు చెప్పని అమ్మమ్మ అప్పుడు మాత్రం అమ్మని కాలేజీకి పంపాల్సిందే అని పట్టుబట్టింది. సాధారణంగా ఆడవారిలో ఎప్పుడో ఒకప్పుడు ‘ఈ చీర ఇలా ఉండాలి, ఈ నగ ఇలా వేసుకోవాలి’ అంటూ ఒక కోరిక ఉంటుంది. అమ్మమ్మ ఎప్పడూ ఏదో ఒక విధంగా ఇంకొకరికి సహాయం చేయడమే చూసాను కానీ నోటి నుంచీ ‘ఇది నా కోరిక’ అని ఎప్పుడూ వినలేదు.
మా అమ్మ & పిన్నులు, చిన్నప్పుడు ఎండాకాలం సెలవలు వస్తే వెళ్లడానికి వాళ్ళకి అమ్మమ్మగారిల్లు లేదని ఏడ్చేవారట. అది దృష్టిలో పెట్టుకుని అమ్మమ్మ మా అందరికీ ‘అమ్మమ్మ వాళ్ళ ఇల్లు’ అనే చెరిగిపోని తరిగిపోని జ్ఞాపకాన్ని అందించింది (అందులో మా తాతయ్య పాత్ర కూడా ఎక్కడా తీసిపోదు). ఎండాకాలం సెలవలు వస్తే చాలు, దాదాపు ఓ ఇరవై నుంచీ పాతిక మందిమి అయ్యే వాళ్ళం. పొద్దున్నే కాఫీలు, పిల్లలకి వీవాలు, చద్దన్నాలు, భోజనాలు,తలంట్లు, మంచి నీళ్ళు మోసుకొచ్చుకోడాలు,మధ్యలో బాలింతరాళ్ల & చంటిపిల్లల స్నానాలు, వాళ్ళకి సాంబ్రాణి పొగలు, మడి & మహానైవేద్యాలు. ఆవకాయలు, మధ్యాహ్నం తాయిలాల తయారీ, పూల జడలు. . మధ్యలో ఊర్లో వారి చంటిపిల్లలకు స్నానాలు అలా ఒకటేమిటి ఇన్ని పనుల్లో తలమునకలైపోతున్నా ‘అమ్మలూ!! నాన్నా !!’ అంటూ మా అందర్నీ అమితమైన గారాబం చేసేది. ఎవర్నీ విసుక్కోవటం నాకు గుర్తు లేదు. బహుశా అలా అందరం రావడం చాలా ఆనందం గా ఉండేదేమో ఆవిడకి. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ మేనల్లుళ్ళు (అంటే ఆడపడుచు పిల్లలు) ఈ రోజుకి కూడా ఎంతో ప్రేమగా & ఆప్యాయంగా ఉంటారు. మా ముత్తవ్వగారు చివరి రోజుల్లో మంచాన పడితే ఆవిడకి సేవ చేసింది. అమ్మమ్మ చేసిన సేవకి, ఆవిడ ఏడ్చేదిట.
ఎంత ఓపిక లేకపోయినా కూడా అత్తగారి & మామ గారి తద్దినాలకి అమ్మమ్మే స్వయంగా వంట చేసి బ్రాహ్మలకి వడ్డించేది. మా అమ్మ ‘భారతదేశంలో అన్ని చోట్లా తర్పణాలు, పిండాలు పెట్టారు కదా. ఎందుకంత చాదస్తం‘ అంటే కూడా వినకుండా ఓపికగా చేసేది.
ఆవరణలో ఆడవారందరూ ఈవిడ ప్రోత్సాహంతో దేవి భాగవతం లాంటివి పారాయణ చేసుకునే వారు. కొంచెం తీరిక దొరికితే చాలు బుట్టలు అల్లడం, craft చేయడం లాంటివి చేస్తూ ఉండేది.
ఏ విషయాన్నయినా positive గానే చూస్తుంది ఆవిడ. అందుకే ఈ రోజుకి కూడా ‘పట్టు విడుపు ఉండాలమ్మా ‘ అంటూ మాకు ఏది ఎలా handle చేయాలో చెబుతుంది.
‘అమ్మమ్మా !! నీ పిల్లల్లో చదువుకున్నా కూడా, ఎవరికీ నీకున్న ఈ అవగాహన & ఓర్పు లేదు.అసలు నీకెలా వచ్చింది?’ అని అడిగాను. ‘జీవితంలో తల్లి తోడు లేకపోతే ఎప్పుడూ భయమేనే అమ్మా!! ఆ భయమే జీవితంలో అన్నీ నేర్పించేస్తుంది’ అని చెప్పింది. ఆ ఒక్క మాటలో ఎన్నో విషయాలు అర్ధమయ్యాయి నాకు.
తాతయ్య సేవకే ఆవిడ పుట్టిందా అన్నట్లు, ఆయన పోయిన పన్నెండో రోజు ఆవిడ కళ్ళు పూర్తిగా కనిపించడం మానేశాయి (అప్పటికే గ్లూకోమా వచ్చింది). ఎప్పుడూ ఏదో ఒక ప్రవచనం వింటూ గడుపుతోంది. ఇప్పటికైనా ఆవిడకి సేవ చేసుకుని తరించమని మా అందరికీ భగవంతుడు వరం ఇచ్చాడేమో!! ఆ వరం ఇచ్చినా అందుకోలేని దురదృష్టవంతురాలిని నేను !! ఫోన్ కూడా చేయలేనంత తీరికతో ఉంటాను. ఈ టపా అయ్యాక చేసి మాట్లాడాలి.
ఈ టపా మరీ నా వ్యక్తిగతంగా అనిపించచ్చు. ఏ బడికి వెళ్లకుండా కేవలం పురాణాగాథలు విని ఇంత జీవిత పాఠం నేర్పించిన అమ్మమ్మలు మనలో చాలా మందికే ఉంటారు. అందుకే కేవలం నా మాటలలో ఉండిపోకుండా నా కుటుంబంలో తరువాతి తరం కూడా వారు కూడా తెలుసుకోవాలనే ఈ టపా !!