నేను బ్లాగు టపా వ్రాయటం అంటే ముందు బిట్రగుంట, రామాయణభారతాలు నిల్చుంటున్నాయి. అందుకే మా బిట్రగుంట విశేషాలతో మళ్ళీ …..
బిట్రగుంటలో మా అమ్మమ్మగారింట్లో ఉయ్యాల బల్ల ఉండేది. పెద్దలకీ, పిల్లలకీ అది పెద్ద ఆకర్షణ. మధ్య హాలులో పెద్ద ఇనుప గొలుసులతో దూలాలకి వేసి ఉండేది . ఆ పక్కనే మా తాతయ్య పెద్ద పడకుర్చీ ఉండేది. ఆ హాలులోనే ఓ సోఫా, టీవీ( తర్వాత రోజుల్లో ), ఇనప్పెట్టె, ఓ చెక్క కుర్చీ, అక్కడే అల్మరా లో పెద్ద బుష్ రేడియా ఉండేవి. ఉయ్యాల బల్ల ఎంత పెద్దది అంటే ఒకేసారి పదిమంది పిల్లలు కూర్చోవచ్చు దాని మీద. అంత పెద్ద బల్ల. ఈ ఉయ్యాల మీద ఊగాలని, మా అమ్మ పెళ్లయిన క్రొత్తల్లో ఆవిడ పుట్టింటికి వచ్చినపుడల్లా, ‘వదినతో వెళ్తా ‘ అంటూ మా బాబాయి (మా నాన్నగారి తమ్ముడు) కూడా వచ్చేసేవాడట.
ఎవరు ఇంటికి వచ్చినా ముందు ఉయ్యాల మీద కూర్చునేవారు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మమ్మల్ని లేచి వెళ్లి బయటకి వెళ్ళి ఆడుకోమని వారు. మేము చాలా సీరియస్ గా ఉయ్యాల మీద ఆట ఆడేటప్పుడు ఎవరైనా వస్తే మాకు చాలా కోపం వచ్చేది. కానీ తాతయ్యకి భయపడి వెళ్లిపోయేవాళ్ళం.
పొద్దున్నే లేచిలేవగానే కాసేపు ఉయ్యాల మీద కూర్చొనే వాళ్ళం. పళ్ళుతోముకోగానే అమ్మమ్మ ఇచ్చిన viva అక్కడే తాగేవాళ్ళం. మాతో పాటే తాతయ్య పడకుర్చీలో కూర్చుని కాఫీ తాగేవాళ్ళు. ఓ చిన్న సైజు మీటింగ్ ఉండేది. ఆ సమయంలో విజయవాడ స్టేషన్ నుంచి వచ్చే భక్తి రంజని పాటలు వినేవాళ్ళమేమో. ఇప్పటికీ కొన్ని పాటలు వినగానే తెలియకుండానే పాడేస్తూ ఉంటాను.
మధ్యాహ్నం పూట ఎండ ఎంత తీక్షణంగా ఉన్నా, అది మా ఆటలకి ఏ మాత్రం ఆటంకం గా అనిపించేది కాదు. నా బెస్టు ఫ్రెండ్స్ ఎవరంటే ఆవరణలో నివాసం ఉండే వాసుదేవరావు గారి అబ్బాయి శ్రీను, శారదాంబగారమ్మాయి గాయత్రీ, కామకోటిగారమ్మాయి వరలక్ష్మి. మేమందరం ఆవరణ లో రోజుకొకరింట్లో వరండాలో, ముఖ్యం గా రమాదేవి గారి వరండా లో బుడ్లతో ఆటలు ఆడుతూనే ఉండేవాళ్ళం. రమాదేవి గారి భర్త రామచంద్రరావు గారు రైల్వే స్కూల్ టీచర్. వాళ్ళు ఎండాకాలం సెలవలు రాగానే విజయవాడ వెళ్ళిపోయేవారు. అందుకే వాళ్ళ వరండా ఎప్పుడూ ఖాళీగానే ఉండేది. మేము వాళ్ళని చూసింది చాలా తక్కువ. స్నేహితులందరిలోకి గాయత్రి బుద్ధిమంతురాలు. మధ్యాహ్నం అవ్వగానే ‘ఎండగా ఉందే’ అని పెద్దవాళ్ళు పిలవకుండానే ఇంటికి వెళ్ళేది. నేను, వరలక్ష్మి, శ్రీను ఆట continue చేసేవాళ్ళం పెద్దవాళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టి పిలుచుకెళ్లేదాకా!! మా చివరాఖరి పిన్ని, మావయ్య ఇద్దరూ డిగ్రీ చదువుతుండేవాళ్లు. వాళ్ళే మా Care takers, మా అమ్మమ్మ కి పెద్ద helpers. ఎవరైతే ఎండలో ఆడుతున్నారో వాళ్ళని, వడదెబ్బ తగులుతుందని చెప్పి ఇంట్లోకి పట్టుకెళ్ళేవాళ్ళు. మావయ్య నన్ను బాగా గారాబం చేసేవాడు. తన మాట అస్సలు వినేదాన్ని కాదు. అదే పిన్ని అయితే హడల్ !! అందుకే పిన్ని వచ్చేది నన్ను తీసుకెళ్లడానికి. తిట్టుకుంటూ వెళ్లేదాన్ని.
లోపలి వెళ్లేసరికి హాల్ లో అన్నీ దిండ్లు కిందవేసి, తలుపులన్నీ బిడాయించి ఉండేవి. అమ్మమ్మ ‘ ఎండసెగ తగులుతుంది ఆటలు ఆపి పడుకోండర్రా’ అనేది. ఇక్కడ మొదలయ్యేది అసలు కథ!! మా పిన్ని ఉయ్యాల బల్ల మధ్యలో కూర్చొని పెద్ద పిన్ని పిల్లలని, మమ్మల్ని అటు ఇద్దరినీ, ఇటు ఇద్దరినీ పడుకోబెట్టి పెద్ద ఊపులు ఊపి రెండు నిమిషాల్లో నలుగురు పిల్లల్ని నిద్రపుచ్చేసేది. అలా ఒక రెండు బ్యాచీలన్నా ఉండేవి. ఆ తరువాత మా మావయ్య పనేంటంటే ఇలా పడుకున్న వాళ్ళని నెమ్మదిగా ఎత్తుకుని disturb కాకుండా కింద నేలమీద పడుకోబెట్టడం. మా పెద్ద పిన్ని కొడుకు చాలా అల్లరి వాడు. వాడు ఓ పట్టాన నిద్రపోయేవాడు కాదు. వాడికి రెండు సార్లు ఉయ్యాల treatment ఉండేది. మా మావయ్య ఎత్తుకుని తీసుకొచ్చి పడుకోబెట్టగానే, కళ్ళు మూసుకున్నట్లు నటించేవాడు. నెమ్మదిగా లేచి, దేవుడింట్లోకి వెళ్లి కజ్జికాయల అల్మరా తెరిచి, ఏవో ఒకటి తినేసేవాడు!!.
ఈ నిద్ర కార్యక్రమం అయ్యాక పెద్దలకి కాఫీలు, పిల్లలకి కజ్జికాయలు/ అరిసెలు వంటి తాయిలాలు ఉండేవి. లేకపోతే ముంజెలు. సాయంత్రం నాలుగు అవ్వగానే సముద్రం గాలి పెరట్లో తాకేది. మల్లెపూల అబ్బాయి వచ్చి మాలలు ఇచ్చి వెళ్ళేవాడు. మా తాతయ్య డ్యూటీ కి వెళ్లకుండా ఇంట్లో ఉంటే, పడకుర్చీ తీసుకెళ్లి పెరట్లో వేసుకునే వారు. అక్కడ వేసుకుని కూర్చుని కాఫీ తాగేవారు. సాయంత్రం అయ్యాక పెరట్లోనించి వాకిట్లో అరుగు దగ్గరకి చేరేది కుర్చీ. అది పడకుర్చీ అంటే ‘పడక’ కుర్చీనే !! కాళ్ళు జాపుకుని పడుకోవచ్చు. చాలా పెద్దది. హల్లో పడకుర్చీ లేకపోతే మాకు ఉయ్యాలని పెద్ద ఊపులు ఊపడానికి బోలెడు స్థలం ఉంటుంది కదా. అందుకని చాలా సంబరపడిపోయేవాళ్ళం.
ఇక సాయంకాలం స్నానాలు అవ్వగానే మా పిన్ని, కామకోటిగారి పెద్దమ్మాయి సుమతి కలిసి పిల్లలందరినీ తీసుకుని రాములవారి గుడికి తీసుకెళ్లేవారు. గుడినుంచి వచ్చాక అన్నాలు పెట్టడానికి కొంచెం సమయం ఉండేది. ఆ సమయంలో మా activity అంతా ఉయ్యాల దగ్గరే. ఒక్కోసారి మా పిన్ని అందర్నీ ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపుతూ పాటలు పాడేది.అలా మా అందరికీ ‘హిమగిరి తనయే’ నోటికి వచ్చేసింది. ఒక్కోసారి మా మావయ్య పిల్లలందరినీ లైన్ లో నిల్చోబెట్టి ఒక్కొక్కరినీ ఉయ్యాలని ఎక్కించి , గట్టిగా పట్టుకోమని, ఉయ్యాలని పైన దూలం వరకూ పట్టుకెళ్ళేవాడు. మాకు అదేదో roller coaster rideలాగా ఉండేది. ‘ఇంకోసారి ఇంకోసారి’ అంటూ లైన్ లో నిల్చునే వాళ్ళం. పిన్నీ, మావయ్య లేకపోతే ఇక రైలాట మొదలు పెట్టేవాళ్ళం. ఈ ఆట ఆడినవాళ్ళు ప్రపంచంలో బిట్రగుంట పిల్లలు తప్ప ఎవరూ ఉండరనే అనుకుంటాను
రైలాట :
అంటే ఉయ్యాల ఒక రైలు అన్న మాట. బిట్రగుంట కదండీ మరీ !!. చెప్పా కదా మా ఊరి స్పెషల్ !! ఉయ్యాల ఊపేవాళ్లు డ్రైవర్లు. పక్కన కూర్చునే వాళ్ళు ప్యాసెంజర్లు. ఆవరణలోని పిల్లలు చాలా మంది చేరేవాళ్ళు ఆటలో. ఎప్పుడూ ట్రైన్ విజయవాడ నుంచి నెల్లూరు వెళ్ళేది. అందరికీ నిద్రలో లేపినా తెల్సిన స్టేషన్లు అవే కదా మరి. ట్రైన్ నంబర్లు, పేర్లు, ఏ స్టేషన్లో ఆగుతాయి అంతా క్షుణ్ణంగా తెలుసు అందరికీ. అందుకే ఎప్పుడూ విజయవాడ – నెల్లూరు సెక్షన్లోనే నడిచేది బండి. ఏ GT express, Tamilnadu Express, Gangakaveri express, Jayanthi Janatha express అనో పేరు పెట్టుకునేవాళ్ళం. ఇటువంటి super fast అయితే ఎక్కడా ఆగవు కాబట్టి ఆటకి అంత బావుండలేదని ఒక్కోసారి కృష్ణా ఎక్సప్రెస్ పేరు కూడా పెట్టుకునేవాళ్ళం. ఆటలో రైలులోని పాసెంజర్లు నీళ్లు నింపుకోడానికి ట్రైన్ దిగేవాళ్ళు. వాళ్ళ సీటు ఇంకొకరు కొట్టేసేవాళ్ళు. దెబ్బలాట !! స్టేషన్ లో నీళ్ల పంపు అంటే ఇనప్పెట్టె హ్యాండిల్స్. వెయిటింగ్ రూమ్ ఏంటంటే సోఫా, చెక్క కుర్చీ!! స్టేషన్ లో కాఫీ, టీ అమ్మేవారు ఉండేవారు. తెనాలి స్టేషన్ లో పాలకోవా అమ్మేవారు కూడా ఉండేవారు. ఇలా సాగేది మా ఆట.
ఎండాకాలం సెలవలు అయిపోయి తిరిగి ప్రయాణం అవుతుంటే ‘అయ్యో ఉయ్యాల వదిలేసి వెళ్ళిపోవాలి’ అని బాధ కలిగేది. ఈ రోజుల్లో పరిభాషలో చెప్పాలంటే ‘We’ll miss you’ అనుకునేవాళ్లం.
ఆ ఉయ్యాల ఇప్పటికీ అమ్మమ్మ వాళ్ళు నెల్లూరులో ఉన్న అపార్టుమెంటులో కూడా ఉంది. మా పిల్లలు కూడా ఎక్కారు. మా అమ్మమ్మకి వాళ్ళు పెట్టిన పేరు ‘swing తాతమ్మ’. మా చిన్నదయితే ఆ ఉయ్యాల వదలదు. అమెరికాలో మా ఇంట్లో కూడా అటువంటి ఉయ్యాల పెట్టుకోవాలని నా కోరిక. ఎప్పటికి తీరేనో మరి !!
అదండీ మా ఉయ్యాల కథ ….