Ami Ganatra గారు రామాయణం గురించి podcast లలో మాట్లాడుతుంటే వేలకొద్దీ వీక్షణలు కనిపిస్తున్నాయి. గంట- గంటన్నర వీడియో అయినా ఓపికగా చూస్తున్నారు అంటే, ‘అసలు విషయం ఏమిటి’ అని తెలుసుకోవడానికి మనుష్యులు సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టం. మొన్న ఎప్పుడో ‘ఈమాట ‘ కథ చదివాక వ్రాసుకున్న పోస్టు ఇది. ఇప్పుడు పెడుతున్నాను.
ఓ ‘భారతీయ భాష’ అనేది సామాన్యుడికి దూరం కావాలని పత్రికలు కూడా పనిగట్టుకుని ఇటువంటి కథలు ప్రచురిస్తున్నాయా అనిపించింది ఓ కోణంలో నాకు. Revive అవుతూ ఇప్పుడిప్పుడే పునరుద్ధరించుకుంటున్న సంస్కృతిపై చిగళ్ళు కూడా మొలకెత్తనివ్వకుండా చేస్తున్నారా ?
రామాయణం అనేది భారతీయ సంస్కృతి లో ఓ భాగం
భారత దేశంలో ఏ మూల వెళ్ళినా ఆ ప్రదేశానికి రామాయణంతో లంకె ఉంటుంది. పండితులు లేదా పామరులు అన్న బేధం లేకుండా ప్రతీ వారూ రామునితో తమని తాము identify చేసుకుంటారు. ‘అయ్యో రామ’ అనేది తెలుగు వారి ఊతపదం. సీతారాములవారు లేని తెలుగు వారి పెళ్లిపత్రిక ఉండదు. ఇంట్లో పెద్దవారిని ఏదైనా కలిపించుకుంటే సాధారణంగా అనే మాట ‘ కృష్ణారామా అనుకుంటూ కూర్చోవచ్చు కదా’ . ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా రామాయణం అనేది భారతీయ సంస్కృతి అనేది స్పష్టం.
రాముడే ఎందుకు ?
భక్తి అంటే భగవంతుడుని ఒక రూపంలో గుండెల్లో దాచుకోవడము. ఓ సాధారణ మానవుడికి ఎన్ని లౌకిక విషయాలలో మునిగి తేలుతూ ఉన్నా , ఒక్కసారి ఆ భక్తి భావం అనేది ఏర్పడ్డాక ఎక్కడ చూసినా ఆ రూపమే కనిపిస్తుంది. రాముడు ఒక మానవుడిగా అవతారం ఎత్తి మనుష్యులతో నివసించాడు కాబట్టి, ఆ రూపం అనేది అందరి మనసులకీ దగ్గరయిన భగవద్ రూపం. అందుకే ఆయన భారతీయ సంస్కృతిలో భాగం అయిపోయాడు.
రామాయణం పై తెలుగు సాహిత్యం
రామాయణం వాల్మీకీ మహర్షి రచించిన ఆది కావ్యం. వాల్మీకి మహర్షి ఆ కావ్యంలో ఓ పాత్ర కూడా. రాముడికి సమకాలీనుడు.
1 తెలుగులో వ్రాసిన ముఖ్యమైన రెండు రామాయణములు → భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం.
2 పోతన ‘పలికించెడి వాడు రామభద్రుడు’ అంటూ భాగవతం అనువాదం మొదలుపెట్టాడు.
3 మొల్ల దాదాపు 800 పద్యాలతో రామాయణం రచించింది.
4 అన్నమయ్య, రామదాసు , త్యాగయ్య మొదలయిన వీరందరూ తమ పదసాహిత్యంతో రాముని కీర్తిస్తూ వాగ్గేయకారులయ్యారు. వారికి రామునిపైన ఎనలేని భక్తి. ఆ భక్తిలో మునిగితేలారు వారు. దెబ్బలకు తట్టుకోలేక నిందాస్తుతి చేసిన కంచెర్ల గోపన్న , వెంటనే ‘ అబ్బా తిట్టితిని’ అని కూడా వాపోయాడు.
5 త్యాగరాజు గారు రోజూ వాల్మీకి రామాయణం పారాయణ చేసేవారుట .
‘ అలకలల్లలాడగ’ అనే ఈ కీర్తనలో విశ్వామిత్రుల వారు రాముడ్ని చూసి ఎలా పొంగిపోయారో చాలా వివరంగా చెబుతారు. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుల వారు దశరథుడిని వచ్చి, మారీచ సుబాహుల నుండీ తన యాగం రక్షించడానికి ఒక కొడుకుని పంపమని అడుగుతారు. అది కూడా ఏ కొడుకుని పంపాలో చెబుతూ ‘ఆ ముంగురులు మొహాన పడుతుండే ఆ పెద్ద కొడుకునే’ పంపమని అడుగుతారట.
ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని వ్రాసిన మధ్యమావతి కృతి ఇది. ఇక్కడ అలకలు అంటే ముంగురులు. విశ్వామిత్రుల వారు రాముడ్ని చూసి పొంగిపోయే ఘట్టాలు రెండిటినీ ఈ కృతిలో చూస్తాము
ప. అలకలల్లలాడగ కనియా
రాణ్మునియెటు పొంగెనో
అ. చెలువు మీరగను
మారీచుని మదమణచే వేళ (అ)
చ. ముని కను సైగ తెలిసి శివ
ధనువును విరిచే సమయ-
మున త్యాగరాజ
వినుతుని మోమున రంజిల్లు (అ)
వాల్మీకి రామాయణం చదవటం ఒక ఎత్తు. ఆ భక్తిని ఒక కృతిలో ఇంత అందంగా అక్షరాలని పేర్చడం ఒక ఎత్తు. చాగంటి వారు, వేటూరి వారు త్యాగరాజుల వారి భక్తి గురించి ఈ కృతినే ప్రస్తావించారు. విశ్వామిత్రుడి గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా త్యాగరాజుల వారు ఆయనే విశ్వామిత్రుల వారిని స్వయంగా చూసినట్లు పాడారు .
ఇలా ఈ విధంగా రామాయణంని అనేకమంది కవులు ఎన్నో రకాలుగా ఎంతో అందంగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
సాహిత్యంలో ప్రక్రియలు కవి యొక్క సృజనాత్మకత సూచిస్తాయి. అన్నమయ్య ఒకే విషయం చెప్పినా ఎన్నో రకాలుగా చెబుతాడు. తెలుగులో వ్రాసిన భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం రెండిటిలో అవాల్మీకాలు ఉన్నాయి. ఉడుత కథ లాంటివి. ఓ ఉడుత & దాని పైన ఆ చారలు చూడగానే రాముడు గుర్తు రాకపోవడం అంటూ ఉండదు. ఇటువంటి ప్రక్రియలు సంస్కృతిని పెంపొందించేవే కానీ సంస్కృతిని పునాదులు పెకిలించడం అనేది లేదు. ఆనాటి అన్నమయ్య నుంచీ ఈరోజు శ్యామలరావు గారు లాంటి వారి వరకూ సాహిత్యంలో రాముడి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఆంటే రాముడు ఒక సంస్కృతి అనే మాట చెబుతూనే ఉన్నారు. . సామాన్యుడు రాముడికి దగ్గరయ్యేలా చేస్తూనే ఉన్నారు.
భారతీయ సంస్కృతి పునర్జీవనం (Cultural Revival)
చిన్నప్పుడు ఎప్పుడో 10వ తరగతి వరకూ తెలుగు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుల వల్ల తిరిగి చదివే అవకాశం లేక, ఇప్పుడు తిరిగి తెలుగు చదువుకోవడం మొదలు పెట్టారు. కొందరు ‘సంస్కృతభారతి’ లాంటి బళ్ళలో చేరి సంస్కృతం కూడా చదువుకోవడం మొదలు పెట్టారు. కొందరు సంగీతం నేర్చుకుంటున్నారు. ఈమధ్య సోషల్ మీడియా వల్ల కావచ్చు. covid లో lockdownలో దొరికిన సమయం వల్ల కావచ్చు. ఈ ధోరణి బాగా కనిపిస్తోంది. పైగా అంతర్జాలంలో బోలెడు సమాచారం దొరకడం మూలాన, ఎంతో మంది పైన చెప్పిన విధంగా ఎన్నో విషయాలు సునాయాసంగా తెలుసుకుంటున్నారు.
అయోధ్య తీర్పు వెలువడిన వెంటనే కొన్ని కోట్లమంది భారతీయులు ఆనందంతో సోషల్ మీడియాలో profile picture మార్చుకున్నారు. అది ‘ఇంకొకరిపై గెలిచాము’ అన్న ఆనందం కాదు. ‘రాముడికి గుడి కడతారు’ అన్న ఆనందం. అయోధ్యలో అన్ని వేల దీపాలు వెలిగిస్తే, కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో చూసి తరించారు.
మార్పు ఏ విధంగా చోటు చేసుకుంటోంది అనడానికి , ఈ మధ్య ముఖ పుస్తకంలో వల్లీశ్వర్ గుండు గారు వ్రాసిన వ్యాసం ‘రానున్న ఒక పెను మార్పుకి ఇది సంకేతమా ? అన్నది ఒక ఉదాహరణ.
ఇటువంటి ఈ మార్పుకి కారణం భాజపా పాలన కొంత కారణం అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశ్యంలో → Y2K వలన కూడా భారతదేశం నుండీ పాశ్చాత్యదేశాలకి వెళ్తున్న భారీ వలసలతో అనేక కుటుంబాలకి ఆర్థికబలం పెరగడం ఇంకో కారణం. బొజ్జ నిండా పాలు త్రాగాకే చిన్నారులు నవ్వులు చిందిస్తారు కదా మరి !! అందుకే సంస్కృతి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు . అదే మార్పుకు కారణం అవుతోంది.
ఆధునిక సాహిత్యపు విషవృక్షాలు
‘భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి, అందునా ముఖ్యంగా సాహిత్యాన్ని కాపాడుకోవాలి’ అన్న ఉద్దేశ్యంతో ఈ విధంగా కొందరు పునరుద్ధరణకై పూనుకుంటున్నా, జరగవలసిన నష్టం భారీగానే జరిగిపోయింది. మేధావీ వర్గం, కలం అనే ఆయుధంవాడుకుంటూ & అవార్డులు అంది పుచ్చుకొంటూ కొన్ని తరాలని భారతీయ సంస్కృతికి, భాషకి దూరం చేసేసారు. ఆ కలమే తిరిగి వారి వారసులకు అందించారు. అందిస్తున్నారు ఇంకా…. నేను కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డుల గురించి వ్రాసిన వ్యాసం చూడవచ్చు .
ఈ అవార్డుల సాహిత్యం వివిధ దేశ విదేశీ భాషల్లోకి అనువాదం కావించబడి, ఒక documented literature గా మారిపోతోంది. ఇక పాఠ్యాంశాలలోకి కూడా వెళ్తోందేమో తెలీదు మరి. ఈ కలుపు మొక్కలు, విషవృక్షాలై సాహిత్య ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి.
తెలుగు భాషంటే ఆసక్తి
సృజనాత్మకత అన్న పేరుతో వాల్మీకి వ్రాసిన రామాయణానికి విరుద్ధంగా ఉన్న కథలు వ్రాస్తారు మేధావీ వర్గం. ఇప్పుడిప్పుడే భాష నేర్చుకునే వారికి (పైన చెప్పాను ) మ్రింగుడు పడవు. వారికి తెలుగు సాహిత్యం అనేది ఎటువంటి దృష్టి కోణాన్ని చూపుతుంది ? ‘ నను బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లీ’ అని భజన చేసేవారు, ‘సీతమ్మ మాయమ్మ ‘ అని త్యాగరాజు గుర్తు చేసుకునే వాళ్ళు ఆ కథలను చదివి ఆమోదించగలరా ?సంస్కృతికి విరుద్ధంగా వ్రాసే కథ ‘తెలుగు భాష ‘ కొత్త తరాలకి నేర్చుకుందాం అనే ఆసక్తి కలిగిస్తుందా లేక ఓ త్యాగరాజు కీర్తన ఆసక్తి పెంచుతుందా ?
ఓ పక్క ఎంతో మంది Cultural Revival కోసం పని చేస్తూ ఉంటే , ఇంకా ఇటువంటి కథలు వ్రాయడంలో ఈ రచయితల ఉద్దేశ్యం ఏమిటి ? మనోభావాలు దెబ్బతినడం పక్కన పెడితే, కథాంశమే ‘ఇటువంటి రాముడిని నేను పూజించానా ?’ అన్న ఆత్మనూన్యతకి గురి చేస్తుంది. తమ సంస్కృతినే సందేహించడం మొదలు పెడ్తాడు పాఠకుడు.
’ ‘అటువంటి రామాయణం చదివితే ఎంత చదవకపోతే ఎంత’ అని భాష చదివి పెంపొందించుకోవాలి అన్న ఆసక్తి కూడా చంపేస్తుందేమో అనిపిస్తుంది కూడా.
సాహిత్యం అంటూ బావుంటే ….
ఏదైనా సాహిత్యం లో సృజనాత్మకత అంటూ బావుంటే అది ఏ భాషలో వ్రాసారో అన్నది పాఠకుడికి అనవసరం. దానిని పట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు.
‘శంకరాభరణం’ చిత్రం హీరో, డ్యూయెట్ పాటలు లేకుండా తీసిన సినిమా. ఇన్నేళ్ళు అయినా కొన్ని తరాలు మర్చిపోలేదు. ఇంకొక ఉదాహరణ ‘Harry Potter’. అర్ధరాత్రి లేచి కొట్టు దగ్గర పడిగాపులు కాచి , ఆ పుస్తకం కొన్న పిల్లలు ఉన్నారు. OTT లో ‘మలయాళం ‘ సినిమాలు బావున్నాయి అంటూ subtitles పెట్టుకుని చూస్తున్నవారు ఉన్నారు. చైనాలో బాహుబలి సినిమా చూసిన వారు ఉన్నారు. భాషతో సంబంధం లేదు వారికి . ఆ సాహిత్యం లో ఆ సృజనాత్మకత నచ్చింది అంతే !
ముగింపు
ఏ భాష సాహిత్యం ఆ భాషకి సంబంధించిన సంస్కృతి గురించి చెప్తుంది. మేధావీ వర్గం కథలు భారతీయ సంస్కృతి పైనే విషం చిమ్ముతూ, తమ పూర్వికుల నమ్మకాలనే పరిహసిస్తుంటే ‘భాష నేర్చుకోవాలి’ అనే అనురక్తి భావితరాలకు ఎందుకు ఉంటుంది ?
సృజనాత్మక సాహిత్యం , ఆ సంస్కృతిని కూడా కలుపుకుంటూ అందులోని విషయాలను గొప్పగా చెబుతూ ఉంటే భాష మీద ఆసక్తి కలిగి ఆ భాష విస్తరిస్తుంది. కాబట్టి, రచయితలు భావితరాలని దృష్టిలో పెట్టుకుని → వారి సృజనాత్మకతకి పదును పెడుతూ → మేధావీ వర్గం చేతిలో కలం ఉన్నది అన్న విషయం సామాన్య పాఠకులు మర్చిపోయేలా చేసేలా → అద్భుతమైన రచనలు చేయాలి.
నేను ఇటీవలి కాలం లో చాలా చక్కటి కథలు చదువుతూ ఉన్నాను. ఆ కథల గురించి ముందు ముందు వచ్చే పోస్టులలో వ్రాస్తాను.