చిన్నప్పుడు ఏకలవ్యుడి కథ చదువుకున్నపుడు ద్రోణాచార్యులవారు చాలా అన్యాయం చేసినట్లు అనిపిస్తుంది. ఒక అవగాహన అంటూ వచ్చాక ఎందుకలా చేసారు అని కుతూహలంతో కూడిన ప్రశ్న ఒకటి వస్తుంది.
మొదట వచ్చే ప్రశ్న : ద్రోణుడు ఏకలవ్యుడిని శిష్యుడిగా ఎందుకు ఆమోదించలేదు ? ద్రోణుడు ఏకలవ్యుడిని క్షత్రియుడు కానందున శిష్యుడుగా ఆమోదించలేదు. అది ఆ రోజున ఆయన పాటించవలసిన ధర్మం. ఆ రోజు ఆమోదించబడ్డ ధర్మాన్ని, ఎవరైనా ఈ రోజున పాటిస్తే అది illegal అవుతుంది & అధర్మం క్రిందకి వస్తుంది. అది అన్యాయం కదా నేను ఆ రోజులలో జీవించి ఉండలేదు. కాబట్టి నాకు సమాధానం తెలియదు అనే చెప్తాను. ఈ రోజున దానిని అన్యాయం అని తీసుకున్నారు కాబట్టే ధర్మాలు మారాయి. దానికి అనుగుణంగా చట్టాలు వచ్చాయి. ఆనాడు నేరంగా పరిగణించబడినది ఈనాడు నేరం కాదు & vice-versa. అమెరికాలో ఆడవారికి ఓటు హక్కు 1920 వచ్చింది. మరి 1920 ముందు, నాలాంటి వారు హక్కు లేకుండా ఓటు వేయటం నేరమేగా ? కాబట్టి ద్రోణాచార్యుల వారు చేసింది నేరం/ అధర్మం కాదు.
ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడుని శిష్యుడిగా ఆమోదించకపోయినా, ఏకలవ్యుడు ఆయన విగ్రహం పెట్టి విద్య నేర్చుకున్నాడు. చాలా గొప్పగా చెప్పవలసిన విషయమే.
దీని తరువాత వచ్చే ప్రశ్న : ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే పక్షపాతం. కాబట్టి ద్రోణుడు అర్జునుడి కోసం బొటన వేలు గురుదక్షిణగా ఇవ్వమన్నాడు..
ద్రోణుడు కేవలం అర్జునుడి కోసం బొటన వేలు ఇవ్వమని అడగలేదు. అందులో చాలా ధర్మం దాగి ఉంది. చాగంటి గారు ఆయన ప్రవచనంలో దానిని విశదీకరించిన విధానం నాకు బాగా నచ్చింది. తనని చంపుతాడు అని తెలిసిన ద్రుష్టద్యుమ్నుడికే విద్య నేర్పగా లేనిది, ఏకలవ్యుడి విషయం లో ఎలా ధర్మం తప్పుతాడు? అస్త్రాలు, శస్త్రాలు తెలియాలంటే కావల్సినది విద్యా నైపుణ్యం ఒకటే కాదు, వాటిని ఉపయోగించేటపుడు పాటించవలసిన విచక్షణ & ధర్మం. శిష్యుడు ఎవరిమీద పడితే వారి మీద ప్రయోగించడు , కేవలం ధర్మానికే ప్రయోగిస్తాడు అన్న నమ్మకం కలిగినప్పుడే అవి గురువు శిష్యుడికి ధార పోస్తాడు. ఒక కుక్క మొరిగిందని, తనకి ఏకాగ్రత చెదిరిందని కుక్క పై ఏడు బాణాలతో బాణప్రయోగం చేసేవాడు, మునుముందు ఏదైనా చేయవచ్చు. ఆయన ధర్మం తప్పే వాడే అయితే , ఆ అస్త్రాలు తనని అవమానించిన ద్రుపదుడి మీదనే ప్రయోగించవచ్చు కదా. పోనీ కొడుకైన అశ్వద్ధామ కి నేర్పవచ్చును కదా. ఆర్మీ లో, నేవీ లో పని చేసేవారు ఎంతో క్రమశిక్షణ తో ఉంటారు. ఏ మాత్రం అదుపు తప్పినా శిక్షలు ఉండవా? ప్రమోషన్ నుంచి డిమోషన్ కి తెస్తారు. పైగా అటువంటి సంస్థలలో పెద్ద పదవులలో ఉండేవారిపై నిఘా ఉంటుందని కూడా అంటుంటారు. సరిగ్గా ఆలోచిస్తే ద్రోణాచార్యులవారు ఏకలవ్యుడిని గురుదక్షిణ ఇవ్వటం కూడా అంతే.
చాగంటి వారు చెప్పినదే కాక, నాకు ఇంకో అంశం కూడా కనిపించింది ఇక్కడ. ఏకలవ్యుడు గురువు ఆమోదం లేకుండా అన్నీ విద్యలు నేర్చుకున్నాడు. మరి ఆ గురువు ఆమోదం లేకుండానే వాటిని ప్రయోగించడన్న నమ్మకం ఏంటి? బహుశా ద్రోణాచార్యులవారికీ ఇక్కడ అతడిపై నమ్మకం పోయిందేమో!! అమెరికాలో కాలేజిలకి దరఖాస్తు పెట్టుకోవాలంటే, టీచర్ recommendation ఇవ్వాలి. ఆ విద్యార్థి వినయవిధేయతలతో & క్రమశిక్షణతో ఉంటేనే టీచర్ recommend చేస్తారు. ఏ మాత్రం క్రమశిక్షణ లేకపోయినా ఇవ్వరు.
ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే పక్షపాతం అంటారు. ఒక గురువు స్థానంలో నిలబడి ఆలోచిస్తే అర్ధం అవుతుంది ఆ పక్షపాతం ఏంటో.
- అందుకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఉదాహరణ – పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు మరియు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. పారుపల్లి వారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు మరి మనకి బాగా తెలిసన వారు మంగళంపల్లి వారే !! ఎందుకు ? పారుపల్లి వారు బాలమురళి గారికి ఒక్కరికే సంగీతం నేర్పించారా ? లేదే !! అందరికీ ఒకే పాఠం చెప్పుంటారు గా !!
- ఇంకొక ఉదాహరణ. అమెరికాలో బడులలో ‘No child left behind’ అన్న చట్టం ఉంది. అందరికి సమానమైన విద్య అని వారి ఉద్దేశ్యం. మన భారతదేశ సంతతి పిల్లల గురించి అతిశయోక్తి గా చెప్పడం అని కాదు కానీ, ఏకసంతాగ్రాహులు అనవచ్చు. చాలా మటుకు ఈ ‘No child left behind’ కోవలోకి రారు. దానితో తరగతిలో టీచర్ కొంచం advanced గానే చెప్పాల్సి వస్తుంది. వీరికి ఛాలెంజ్ ఇవ్వకపోతే, అల్లరి చేసి టీచర్ని విసిగిస్తారు.
అర్జునుడికి విద్య ఉన్న శ్రద్ధకి, అందులోను అతడికి ఉన్న వినయవిధేయతలకి మరి ద్రోణాచార్యులవారు ప్రియశిష్యుడు అవ్వటం లో సందేహం లేదుగా మరి ?