ఈ టపా పురాణాల్ని గురించి వక్రం గా మాట్లాడేవారికి మాత్రమే 🙂
ఈ రోజు ముఖపుస్తకం లో ఒక పోస్టు నా ఖర్మ కాలి నా కళ్ళబడ్డది ‘రాముడికి మగపిల్లలు, కృష్ణుడికి మగపిల్లలు శివుడికి మగపిల్లలే ఉన్నారు. అంతా పితృస్వామ్యం , పురుషాధిక్యత’. మొన్న ఎక్కడో ఇంకోటి ‘కృష్ణుడు దేవుడు కాబట్టి తప్పు చేసినా ఒప్పే అని చూపించేస్తారు భారతం లో ’ . నా ఖర్మో ఏంటో మరి నాకే కన్పిస్తాయో తలా తోకా లేని పోస్టులు. శ్రీరామ నవమి రోజు కన్పించిన పోస్టులు ఇదిగో ఇలాంటివి – ‘రాముడు బక్కగా ఉండేవాడు, ఇప్పుడు క్రూరం గా ఉన్నాడు’ .’శూర్పణఖ ముక్కు కోసారు’ . ‘భార్యని అడవుల పాలు చేసాడు’ ‘అగ్ని లో దూకమన్నాడు ‘. ‘బ్రాహ్మణుడి కోసం శంభూకుడి ని చంపాడు’ .ఈ రోజుల్లో ఎంత మందికి సంస్కృతం అర్ధం చేసుకోవడం వచ్చు? పోనీ కనీసం ఓ తెలుగు పద్యం చదవగానే తడుముకోకుండా అర్ధం చెప్పగలరా? అంతెందుకు ఒక త్యాగరాజ కీర్తన అర్ధం చేసుకోలేరు కొంతమంది. అసలు, అత్యంత సులువుగా ఉండే తెలుగు కథలనే చదవటం ఆపేస్తున్నరోజులు మొదలయ్యాయి. అటువంటిది ఏం తెలుసు అని ఒక గ్రంధం గురించి మాట్లాడుతారు? ఏం తెలుసు అని ఒక సంస్కృతిని దుమ్మెత్తి పోస్తారు?
ఊర్మిళ నిద్ర వృత్తాంతం, రాముడు సీతని అడవులలో వదిలిపెట్టడం అసలు వాల్మీకి రామాయణం లో లేనే లేవని ఎంతమందికి తెలుసు? సీతని అడవులకి పంపడం అనేది ఉత్తరకాండ లో ఉన్నది. ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదు అంటారు. ఋషిప్రోక్తం అంటారు. చాగంటి గారు కూడా ప్రవచనం చేసేటప్పుడు శ్రీరామ పట్టాభిషేకంతో ఆపేసారు. అసలు ఒక ‘చాకలి’ అన్న మాట కూడా లేదంటారు. ఈ మాట నేను గరికపాటి వారి నోటి వెంట విన్నాను.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు పబ్లిష్ చేసిన ఆంధ్రమహాభారతం లో ఒక్క ద్రోణపర్వం మాత్రమే 840 పేజీలు ఉంది.(ఈ ద్రోణపర్వం లో ఎన్ని పేజీలు చదవటం సులభమో తెలీదు కానీ ద్రోణుడిని విమర్శించడం చాలా తేలిక కొంత మందికి.) ఇక ఈ లెక్కన మొత్తం భారతం ఎన్ని పేజీలుంటుందో ఆలోచించండి. ఆఫీసులో పని చేసి, ఇంట్లో పనులని , పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఉండే నావంటి ఒక సగటు వ్యక్తి ద్రోణపర్వం వంటి పుస్తకాలు ఎన్ని చదవగలడు/దు ? రామాయణం, మహాభారతం , భాగవతం క్షుణ్ణంగా చదవటానికి ఒక జీవితకాలం సరిపోదు. అవునా ? మరి దేనిని ఆధారంగా చేసుకుని మాట్లాడతారు ? ఓ మూడు గంటల సినిమా చూసి, ఓ లెఫ్టిస్ట్ వ్రాసిన పుస్తకం చదివో అర్ధం పర్ధం లేని థియరీలు అల్లేయటం మర్యాదస్తులకి మంచిపద్ధతేనా !! తందానా అంటూ వీరికి వేలిముద్రలు, వ్యాఖ్యలు చేసేవారుంటారు. ఇంకో ‘very sophisticated’ పిచ్చి జాడ్యం ఏంటంటే పురాణాలూ ఇంగ్లీష్ లో చదివి పిచ్చి ప్రేలాపనలు చేయడం!!. వీరితో అత్యంతప్రమాదం అసలు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ నిజాలే మాట్లాడుతున్నారు అనుకుంటారు అవతలవారు కూడా.
పురాణాలన్నా, ప్రవచనాలన్నా చదివి/విని తీరాలి & తప్పదు అన్న నియమం ఏది లేదు. (డెమోక్రసీ అన్న పదం వేరే మతాల్లో ఉందో లేదో నాకు తెలీదు కానీ ఆ రోజుల్లో సనాతన ధర్మానికి మాత్రం ఉండేది అని ఖచ్చితంగా చెప్పచ్చు). చదవక/వినక పోయినావలన నష్టం ఎవరికీ లేదు. కానీ – ఒక సంస్కృతి గురించి ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడేటపుడు original చదివి విమర్శించండి. పూర్తిగా తెలియని వాటి గురించి మాట్లాడే హక్కు ఏ మాత్రం లేదు. వ్యాసుల వారు, వాల్మీకి వారు వారి పుస్తకాల మీద కాపీ రైట్స్ అందరికి ఇచ్చి వెళ్ళింది వాటిల్లో మంచిని చూడమని . అంతే కానీ వక్రభాష్యం చెప్పమని మాత్రం కాదండీ !!