మధుర శ్రీకృష్ణజన్మభూమి పోరాటం వెనక వాస్తవాలు

ముఖపుస్తకం లో మిత్రులు Chadalavada Bharadwaj గారుమధుర పైన వ్రాసిన సమగ్రమైన వ్యాసం

బుద్ధుడు పుట్టటానికి 2500 సంవత్సరాలకు ముందు నుండే అపురూపమైన ఆధ్యాత్మిక శోభ తో అలరారుతూ..సనాతన జ్ఞాన దీపమై వెలుగులీనుతూవుండేది మధుర

కాశీ అయోధ్య తదితర హిందూ క్షేత్రాలలానే మధుర శ్రీకృష్ణ జన్మభూమి పై పలుసార్లు విధ్వంసక దాడులు జరిగాయి. భక్త జనులు ధన మాన ప్రాణాలను ఎదురొడ్డి తురుష్కుల చేసిన దాడులను తిప్పికొట్టారు.

శ్రీకృష్ణ జన్మ భూమి ప్రాంతంలో మొట్టమొదటగా శ్రీ కృష్ణ ని మనవుడు అనిరుధ్దుని కొడుకు వజ్రనాభుడు ఆలయ సముదాయం నిర్మించినట్లు క్షేత్ర పురాణం తెలియ చేస్తోంది.శ్రీకృష్ణ జన్మస్థానంగా చెబుతోన్న కత్రా కేశవ్‌ దేవ్ ఆలయాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారం చుట్టూ నిర్మించినట్లు క చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని తల్లిదండ్రులను అక్కడ కంసుడు బందీలుగా ఉంచాడు

ఈ స్థలంలో భారత పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల లో క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది కి ముందే శ్రీకృష్ణ ఆలయం వున్నట్లు పలు సాక్ష్యాలు లభ్యమైనాయి

ఈ తవ్వకాలలో లభ్యమైన వస్తువులు మధుర ప్రభుత్వపురావస్తుప్రదర్శనశాలలో నేటికీ భద్రంగా ఉన్నాయి.

తవ్వకాల లో లభించిన పలువస్తువులు క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే ముందునుండి ఆలయం వుందిఅని అనటానికి అవసరమైన ఆలయ సామాగ్రి

కుండలు టేరాకోట్ ప్రక్రియల్లో తయ్యారు చెయ్యబడ్డ వస్తువులు లభ్యమైనాయి.

అంతేకాకుండా లభించిన మరికొన్ని శాసనాలు క్రీస్తుశకం 8 వ శతాబ్దం లో రాష్ట్రకూటులు ఈ ఆలయానికి భారీగా భూ విరాళాలు ఇచ్చినట్లు ధాన శాసనాలు లభ్యమైనాయి.

లభించిన పురాతన చారిత్రక ఆధారాలను పట్టి ఈ ఆలయాన్ని పలుసార్లు జీర్ణోద్ధరణ చేసినట్టు పురాతత్వ వేత్తలు,చరిత్రకారులు అభిప్రాయం.

క్రీస్తుపూర్వం 3 శతాబ్ధం చివరలో మొట్టమొదట గా మత కోణంతో ఈ ఆలయం పై దాడులు చేసింది భౌద్ధ చక్రవర్తి ఆనందుడు ఇతను భౌద్ధమతాభిమానంతో ఈ ఆలయాన్ని భౌద్ధ అరామంగా మార్చాడు

తరవాత క్రీస్తు పూర్వం 4 శతాబ్దం చివరిలో గుప్తుల కాలంలో

భౌద్దారామాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి శ్రీకృష్ణ ఆలయంగా మార్పు చేశారు.తిరిగి 7వ శాతాబ్ధ ము చివరలో వైష్ట్నవ ఆలయ మును తిరిగి జైనారామంగా మార్చారు. తిరిగి 9 వ శతాబ్ద చివర కాలంలో తిరిగి శ్రీకృష్ణ ఆలయంగా మార్చారు. కాబట్టే ఈ ప్రదేశం లో జరిగిన తవ్వకాలలో హిందూ మత చిహ్నాల తోపాటు భౌద్ధ జైన మత చిహ్నాలు లభించాయి అని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం.

మధ్య యుగంలో క్రీస్తుశకం 1017-1018 లో మహ్మద్ గజనీ బృందావనం మరియు మధుర పై దాడి చేసి చరిత్రలో కనీ వినీ ఎరగని రక్తపాతం సృష్టించి విలువైన అనంత సంపదను దోచుకున్నాడు.

మధుర పై గజనీ చేసిన దాడిని గజనీ ఆస్థాన రచయిత, అల్ ఉత్బీ తన తారిఖ్-ఇ-యామిని అనే అరబిక్ లో వ్రాసిన చారిత్రక గ్రంథంలో వర్ణించాడు.తారిఖ్-ఇ-యామిని అరబిక్ నుండి

ఇంగ్లీష్ అనువదించబడిన పత్రి నేటికీ లభ్యం అవుతున్నది

-తారిఖ్-ఇ-యామిని అంటే అరబిక్ భాషలో అలంకరించబడిన, పుష్పించే పుష్పం అని అర్థం అలంకారిక ప్రాస గద్యంలో వ్రాసిన తారిఖ్ ఐ యామిని, లేదా కితాబ్ ఐ యామిని, సెబుక్టిగిన్ మరియు మహముద్ పాలనల చరిత్ర.

గజనీ ఆస్థాన చరిత్రకారుడు అబూ నస్ర్ ముహమ్మద్ ఇబ్న్ ముహమ్మద్ అల్ జబ్బారు-ఎల్ ఉట్బి రాశారు. అతని రచనలో సెబుక్టిగిన్ పాలన మొత్తం, మరియు మహముద్ యొక్క భాగం, 410 హిజ్రా సంవత్సరం వరకు ఉన్నాయి.

అతని రాత లలో నే”నగరం మధ్యలో ఒక భారీ మరియు అద్భుతమైన శిల్ప కళ తో అలరారే ప్రాచీన ఆలయం ఆకాశాన్ని తా కుతున్నట్లు ఉంది, ఇది మానవులు కాదు, దేవతలు నిర్మించారని ప్రజల విశ్వాసం … ఆలయానికి సంబంధించిన ఏదైనా అంశాన్ని వర్ణించటానికి భాషా పటిమ సరిపోదు.

చెయ్యి తిరిగిన చిత్రలేఖకుడు మాత్రమే ఆలయ సౌందర్యాన్ని తన ప్రతిభతో చిత్రాలు గా ఆవిష్కరించ గలడు . ఈ ఆలయ అందాన్ని వర్ణన చెయ్యటానికి, పదాలు సరిపోవు చిత్రాలలో,మాత్రమే చెప్పగలము చిత్ర లేఖనం కూడా. చిన్నబోయింది ఆలయ అందాన్ని తెలియజేయడంలో విఫలమైంది.” ఘజనీకి చెందిన మహమూద్ ఇంకా ఇలా వ్రాశాడు, “ఎవరైనా ఈ ఆలయానికి సమానమైన అందమైన భవనాన్ని నిర్మించాలనుకుంటే, కనీసం వంద మిలియన్ దినార్లు ఖర్చు చేయకుండా చేయలేరు, ఇంకా అనేక రకాల సామర్థ్యాలు కల వ్యక్తుల తో పాటు అనుభవజ్ఞులైన కార్మికులు కలగలిసి రాత్రి పగలు పనిచేస్తే దాదాపు, రెండు వందల సంవత్సరాలుసమయం పట్టవచ్చు అని అంచనా వేశారు

ఇంతటి సుందర ఆలయ సముదాయాన్ని కూల్చివేసి కాల్చివేసి ఆలయ సంపద ను దోచుకుని రమ్మని మహ్మద్ గజనీ తన సైనికులకు ఆదేశించాడు. వారు ఆలయ ప్రాంగణంలోని బంగారు మరియు వెండి విగ్రహాలను దోచుకున్నారు

ఈ ఆలయంలో దోచుకున్న సంపదను దాదాపు వెయ్యి ఒంటెల పై తన దేశానికి మోసుకెళ్ళాడు.

గజనీ

ఈ ప్రదేశం లో జరిగిన తవ్వకాలలో కనుగొనబడిన సంస్కృతంలో ఉన్న ఒక రాతి శాసనం ప్రకారం

విక్రమ సంవత్ ఇతను మొట్టమొదటి భారతీయ క్యాలండర్ రూపకర్త 1150-1207 కాలంలో గహడవల రాజు అయిన విక్రమ్ సంపత్ ఆదేశానుసారం అతని సామంతుడిగా ఉండే జజ్జ అనే రాజు’తెల్లని మరియు మేఘాలను తాకుతున్న’ విష్ణు ఆలయాన్ని తిరిగి నిర్మించాడు అని తెలుస్తున్నది

ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి చాలా పెద్ద సైన్యంతో మధుర పై దాడి చేసి హిందువులను ఊచకోత కోసి ఆలయాన్ని విధ్వంసం చేశారు ఆలయ సంపదను తిరిగి దోచుకున్నారు. అంతేకాకుండా యమునా నది లో హిందువులు ఎవరు స్నానం చేయరాదు అని ఆదేశించాడు.ఇంకా నదీతీరంలో హిందువులు క్షౌర ము చేయించుకొనరాదని కూడా ఆజ్ఞలు జారీచేయబద్దాయి అని తారిఖ్-ఇ-దౌదీ అనబడే పారశీక గ్రంధంలో పేర్కొన్నారు

తిరిగి మొఘల్ చక్రవర్తి జహంగీర్ సైన్యాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా సికిందర్ లోడి దాడులతో నామ మాత్రంగా మిగిలిన ఈ ఆలయ సముదాయం పై తిరిగిదాడి చేశారు కనీ వినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించారు.

అయితే జంహంగీర్ చక్రవర్తి కాలంలో నే 1618 లో ఓర్చాకు చెందిన వీరసింగ్ దేవ్ బుందేలా దాదాపు ముప్పై లక్షల రూపాయల వ్యయం తో ఆలయంలో కొంత భాగాన్ని పుననిర్మించారు. ఆ రోజులలో

మొఘల్ యువరాజు దారాషికో ఈ ఆలయానికి భారీ మొత్తంలో భూరి విరాళం తోపాటు ధన వస్తు రూపంలో సహాయం చేశారు

చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశానుసారం మథుర గవర్నర్ అబ్దున్ నబీ ఖాన్ ఆలయాన్ని సమూలంగా కూల్చివేసి ఎదురు తిరిగిన హిందువులను తెగనరికి దేవాలయ శిథిలాలపై జామా మసీదును నిర్మించాడు. మథురలో జాట్ తిరుగుబాటు సమయంలో, అబ్దుల్ నబీ ఖాన్ 1669 లో చంపబడ్డాడు. జాట్ నాయకులు తిరిగి కేశవ దేవ్ ఆలయాన్ని తిరిగి నిర్మించగా ఈ సారి ఔరంగజేబు స్వయంగా మధురపై దాడి చేసి 1670లో ఆ కేశవదేవ ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో షాహీ ఈద్గాను నిర్మించాడు

ఫ్రెంచ్ యాత్రికుడు. జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ అను రత్నాల వ్యాపారి

1650 నుండి 1675 వరకు దాదాపు ఆరు సార్లు భారత దేశాన్ని సందర్శించాడు ఆ సమయంలోనే మధురను దర్శించాడు ఎర్ర ఇసుక రాతితో నిర్మించిన కేశవ దేవ్ అష్టభుజి ఆలయా విశిష్ఠతను తన ట్రావెలాగ్ లోఎంతో అద్భుతంగా వర్ణించారు అంతే కాకుండా ఔ రంగజెబ్ దాడి కి సంబంధించిన వివరాలను భీతావహంగా వివరించాడు మొఘల్ ఆస్థానంలో పనిచేసినఇటాలియన్ యాత్రికుడు నికోలావ్ మనుచి 19 ఏప్రిల్ 1638–1717 ఒక వెనీషియన్ రచయిత, స్వీయ-బోధన వైద్యుడు మరియు యాత్రికుడు, అతను మొఘల్ సామ్రాజ్యం యొక్క చరిత్రను ప్రత్యక్షంగా చూసి నాటి స్థితి గతులను పుస్తక రూపంలోవ్రాసాడు, అంతేకాక మొఘల్ ఆస్థాన యునాని వైధ్యుడి గా పని చేశారు ఇయన తనరాసిన స్టోరియా డో మోగోర్ లో నాటి కేశవ దేవ్ ఆలయ వైభవాన్ని దాడికి గురైన నేపథ్యాన్ని సవివరంగా గ్రంధస్థం చేశారు

మధుర కు మల్లాపురం అనే పేరు కూడా ఉంది. మధుర లో కృష్ణ జన్మస్థాన్ గా పిలువబడే ప్రస్తుత స్థలాన్ని కత్రా లిట్. ‘మార్కెట్ ప్లేస్’ కేశవదేవ అని రకరకాల పేర్లతో భక్తజనం పిలుస్తారు.

1804లో మథుర బ్రిటీష్ నియంత్రణలోకి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కత్రా భూమిని అంటే ఆలయానికి చెందిన భూమినివేలం వేసింది. ఈ వేలంపాటలో మధుర కృష్ట జన్మ భూమి స్థలాన్ని కాశీలోని ఒక సంపన్న బ్యాంకర్ శ్రీ రాజా పత్నిమల్ కొనుగోలు చేసారు

శ్రీరాజా పత్నిమల్ తను బ్రిటీష్ ప్రభుత్వం నుండి కొనుగోలు చేసిన స్థలంలో ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు కానీ అలా చేయలేకపోయాడు. అతని వారసులు శ్రీరాయ్ కృష్ణ దాస్ కత్రా భూమిని అనగా శ్రీకృష్ణ జన్మభూమి గా పిలవబడుతున్న స్థలాన్ని వారసత్వంగా పొందారు.

మథుర ముస్లింలు 1935 లో వేసిన రెండు సివిల్ వ్యాజ్యాలలో, ఆలయ భూమి మరియు షాహీ ఈద్గా ఉన్న 13.37 ఎకరాల భూమి యాజమాన్యం కోసం అతని వారసుడు రాయ్ కృష్ణ దాస్ ను సవాలు చేస్తూ మొట్టమొదటి సారి న్యాయ స్థానం మెట్లు ఎక్కారు అయితే అలహాబాద్ హైకోర్టు రెండింటిలోనూ శ్రీ రాజ్ కృష్ణ దాస్‌కు అనుకూలంగా తీర్పులను వెలువరించింది

1935లో దాఖలు చేయబడ్డ ఈదావాల లో శ్రీ రాయి కృష్ణ దాస్ కు శ్రీ. కైలాష్ నాథ్ కట్జూ అతను ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ గవర్నరు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర రక్షణ మంత్రి గా పలుపదువులు నిర్వహించాడు.ఇతను భారతదేశ ప్రముఖ న్యాయవాదులలో ఒకడు. ఇతనుతో కలిసి మరియు శ్రీమదన్మోహన్ చతుర్వేది కూడా ఈ వివాదంలో శ్రీ రాయ్ కృష్ట్న దాస్ కు సహాయం చేసారు.

1944 లో ప్రముఖ హిందూ నాయకుడు మరియు విద్యావేత్త శ్రీ మదన్ మోహన్ మాలవీయ శ్రీ రాజ్ కృష్ణ దాస్ నుండి 7 ఫిబ్రవరి న పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లా ఆర్థిక సహాయంతో 13000 రూపాయిలను శ్రీకృష్ణ జన్మభూమి స్థలాన్ని కొనుగోలు చేశారు. పండిట్ శ్రీ మదన్ మోహన్ మాలవ్య మరణం తరువాత, జుగల్ కిషోర్ బిర్లా శ్రీ కృష్ణ జన్మభూమి ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించారు,

ఫిబ్రవరి 21 1951న శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌గా నమోదు చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారు. జుగల్ కిషోర్ బిర్లా

నూతన ఆలయ నిర్మాణ బాధ్యతలను మరొక పారిశ్రామికవేత్త మరియు పరోపకారి శ్రీ జైదయాల్ దాల్మియాకు అప్పగించారు..

ఆలయ సముదాయం నిర్మాణం అక్టోబర్ 1953లో భూములను చదును చేయడంతో ప్రారంభించబడింది

మరియు ఫిబ్రవరి 1982లో అంటే దాదాపు ముప్పై సంవత్సరాలకు పూర్తయింది.

శ్రీ జై దయాళ్ దాల్మియా తరవాత పెద్ద కుమారుడు శ్రీ విష్ణు హరి దాల్మియా ట్రస్ట్ కార్యక్రమాలకు నాయకత్వం వహించారు మరణం వరకు ట్రస్ట్‌లో పనిచేశాడు. శ్రీ విష్ణు హరి దాల్మియా మరణానంతరము అతని కుమారుడు శ్రీ జై దయాళ్ దాల్మియా మనవడు అనురాగ్ దాల్మియా ట్రస్ట్‌లో జాయింట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. నూతన ఆలయ నిర్మాణానికి రామ్‌నాథ్ గోయెంకాతో సహా ఇతర వ్యాపార కుటుంబాలు నిధులు సమకూర్చాయి .

1968లో, శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మరియు షాహీ ఈద్గా కమిటీ స్థల విషయంలో పరస్పరం ఒక రాజీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి,

ఈ ఒప్పడం ప్రకారం ఆలయ భూమిని ట్రస్ట్‌కు మరియు షాహీ ఈద్గా నిర్వహణను ఈద్గా కమిటీకి బదలాయింపు జరిగింది. అలాగే శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ మునుముందుఎటువంటి చట్టపరమైన దావాలనుషాహీ ఈద్గా.పైవేయబోదు.

భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు గణేష్ వాసుదేవ్ మావలంకర్ రాజీ ఒప్పందంపై సంతకం చేసిన శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్‌కు మొదటి ఛైర్మన్

అయితే చైర్మన్ హోదాలో ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి అతని చట్టపరమైన అధికారం లేదు అన్నది నేటి సంఘ్ పరివార్ విశ్వ హిందూ పరిషత్ నాయకుల వాదన. ఈ ఒప్పందం తో హిందువులకు అన్యాయం జరిగిందని మెజార్టీ హిందూప్రజల అభిప్రాయం

గణేష్ వాసుదేవ్ మావలంకర్ తరువాత MA అయ్యంగార్ , తరువాత అఖండానంద సరస్వతి మరియు రామ్‌దేవ్ మహారాజ్ వచ్చారు. నృత్యగోపాలదాస్ ప్రస్తుత చైర్మన్.

1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తో, బృందావన్ నివాసి మనోహర్ లాల్ శర్మ, 1968 ఒప్పందాన్ని సవాలు చేస్తూ మధుర జిల్లా కోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.అలాగే యథాతథ స్థితిని కాపాడే 1991 నాటి మత ప్రార్థనా స్థలాల చట్టాన్ని రద్దు చేయాలనే పిటిషన్‌ను కూడా జత చేసి దాఖలు చేశారు.

శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంతానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని కోరుతూ మథుర కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణకు మథుర కోర్టు అంగీకరించింది. మనీష్‌ యాదవ్‌, మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌, దినేశ్‌ శర్మ అనే ముగ్గురు వ్యక్తులు ఈ పిటిషన్ వేశారు. షాహీ ఈద్గా ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించేందుకు అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించాలని వారు కోరారు. మొత్తం 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కృష్ణుడి ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారని పిటిషనర్లు ఆరోపించారు. 17వ శతాబ్దం నాటి ఈ మసీదును తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

మథుర సివిల్ కోర్టులో ఈ వివాదంపై 2020 సెప్టెంబర్‌లో తొలి పిటిషన్ దాఖలైంది. లఖ్‌నవూ వాసి రంజనా అగ్నిహోత్రి సహా మరో ఆరుగురు వ్యక్తులు శ్రీకృష్ణు భగవానుడి తరఫున ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ మసీదును తొలగించి ఆ ప్రాంతాన్ని కృష్ణ జన్మభూమి ట్రస్టుకు తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.

అయితే 2020 సెప్టెంబర్ 30న ఈ పిటిషన్‌ విచారణ యోగ్యం కాదని సివిల్ కోర్టు జడ్జి తిరస్కరించారు. పిటిషనర్లు ఏ ఒక్కరూ మథురకు చెందినవారు కాదని పేర్కొన్నారు. దీంతో పిటిషనర్లు తమ వ్యాజ్యాన్ని పునఃపరిశీలించాలని మథుర జిల్లా కోర్టును ఆశ్రయించారు. 2022 మే 19న ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది కోర్టు. ట్రస్ట్‌ను, ఆలయ అథారిటీలను ఈ దావాలో పార్టీలుగా చేర్చింది.

మధుర ఆలయం వెనుక సుదీర్ఘ రక్త చరిత్ర ఉంది

కొన్నిలక్షల మంది మన పూర్వుల ఆత్మ బలిదానం ఉంది మధుర ను విముక్తి చెయ్యటం మన అందరి కర్తవ్యం

2020 నుంచి ఇప్పటి వరకు మథుర కోర్టులో శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కనీసం డజనుకుపైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఒకరు ఈ స్థలంలో తవ్వకాలు జరపాలని కోరగా, మరొకరు పురావస్తు శాఖతో శాస్త్రీయ పద్ధతుల లోసర్వే జరిపించాలని డిమాండ్ చేశారు. మసీదులో ఉండే ఆలయ అవశేషాల రక్షణ కోసం అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేయాలని మరొక పిటిషనర్‌ కోరారు. ప్రస్తుతం డిస్తిక్ కోర్టు హైకోర్టులో హిందువులకు అనుకూలమైన తీర్పులు రాగా షాహీ ఈద్గా దర్గా లో అధునాతన శాస్త్రీయ పద్దతులలో సర్వే జరపాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కూడా తాజాగా కిందటి డిసెంబర్ లో సమర్థించింది

ముఖ్యంగా వివాదాస్పదమైన13;37 ఎకరాల పై యాజమాన్య హక్కులు ఎవరికి చెందుతాయి అన్న విషయం పై సుప్రీం కోర్టు లో విచారణ జరుగుతోంది

అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఆలయానికి 1991 ప్రార్థనా స్థలాల చట్టం వర్తించదు ఎందుకంటే న్యాయ వివాదం 1935 లోనే ప్రారంభమైంది కాబట్టి..

త్వరలో ఈ ఆలయ అంశంలో కుడా మనం తీయ్యని కబురు వింటాం

రామ ప్రతిష్ఠ జరిగింది

విశ్వేశ్వరుడు విముక్తి ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి

కృష్ణయ్య ను కూడా దర్గా పేరు తో ఆక్రమించిన13.37 ఎకరాలను కలుపుకుని భవ్య కృష్ణా ఆలయం త్వరలో నిర్మించాలని కోరుకుందాం

జై శ్రీరామ్ జై విశ్వనాథ జై శ్రీకృష్ణ

భాష & సంస్కృతి → రామాయణం కోణంలో

Ami Ganatra గారు రామాయణం గురించి podcast లలో మాట్లాడుతుంటే వేలకొద్దీ వీక్షణలు కనిపిస్తున్నాయి. గంట- గంటన్నర వీడియో అయినా ఓపికగా చూస్తున్నారు అంటే, ‘అసలు విషయం ఏమిటి’ అని తెలుసుకోవడానికి మనుష్యులు సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టం. మొన్న ఎప్పుడో ‘ఈమాట ‘ కథ చదివాక వ్రాసుకున్న పోస్టు ఇది. ఇప్పుడు పెడుతున్నాను.

ఓ ‘భారతీయ భాష’ అనేది సామాన్యుడికి దూరం కావాలని పత్రికలు కూడా పనిగట్టుకుని ఇటువంటి కథలు ప్రచురిస్తున్నాయా అనిపించింది ఓ కోణంలో నాకు. Revive అవుతూ ఇప్పుడిప్పుడే పునరుద్ధరించుకుంటున్న సంస్కృతిపై చిగళ్ళు కూడా మొలకెత్తనివ్వకుండా చేస్తున్నారా ?

రామాయణం అనేది భారతీయ సంస్కృతి లో ఓ భాగం👇👇👇👇👇

భారత దేశంలో ఏ మూల వెళ్ళినా ఆ ప్రదేశానికి రామాయణంతో లంకె ఉంటుంది. పండితులు లేదా పామరులు అన్న బేధం లేకుండా ప్రతీ వారూ రామునితో తమని తాము identify చేసుకుంటారు. ‘అయ్యో రామ’ అనేది తెలుగు వారి ఊతపదం. సీతారాములవారు లేని తెలుగు వారి పెళ్లిపత్రిక ఉండదు. ఇంట్లో పెద్దవారిని ఏదైనా కలిపించుకుంటే సాధారణంగా అనే మాట ‘ కృష్ణారామా అనుకుంటూ కూర్చోవచ్చు కదా’ . ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా రామాయణం అనేది భారతీయ సంస్కృతి అనేది స్పష్టం.

రాముడే ఎందుకు ?👇👇👇👇👇

భక్తి అంటే భగవంతుడుని ఒక రూపంలో గుండెల్లో దాచుకోవడము. ఓ సాధారణ మానవుడికి ఎన్ని లౌకిక విషయాలలో మునిగి తేలుతూ ఉన్నా , ఒక్కసారి ఆ భక్తి భావం అనేది ఏర్పడ్డాక ఎక్కడ చూసినా ఆ రూపమే కనిపిస్తుంది. రాముడు ఒక మానవుడిగా అవతారం ఎత్తి మనుష్యులతో నివసించాడు కాబట్టి, ఆ రూపం అనేది అందరి మనసులకీ దగ్గరయిన భగవద్ రూపం. అందుకే ఆయన భారతీయ సంస్కృతిలో భాగం అయిపోయాడు.

రామాయణం పై తెలుగు సాహిత్యం 👇👇👇👇

రామాయణం వాల్మీకీ మహర్షి రచించిన ఆది కావ్యం. వాల్మీకి మహర్షి ఆ కావ్యంలో ఓ పాత్ర కూడా. రాముడికి సమకాలీనుడు.

1 తెలుగులో వ్రాసిన ముఖ్యమైన రెండు రామాయణములు → భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం.

2 పోతన ‘పలికించెడి వాడు రామభద్రుడు’ అంటూ భాగవతం అనువాదం మొదలుపెట్టాడు.

3 మొల్ల దాదాపు 800 పద్యాలతో రామాయణం రచించింది.

4 అన్నమయ్య, రామదాసు , త్యాగయ్య మొదలయిన వీరందరూ తమ పదసాహిత్యంతో రాముని కీర్తిస్తూ వాగ్గేయకారులయ్యారు. వారికి రామునిపైన ఎనలేని భక్తి. ఆ భక్తిలో మునిగితేలారు వారు. దెబ్బలకు తట్టుకోలేక నిందాస్తుతి చేసిన కంచెర్ల గోపన్న , వెంటనే ‘ అబ్బా తిట్టితిని’ అని కూడా వాపోయాడు.

5 త్యాగరాజు గారు రోజూ వాల్మీకి రామాయణం పారాయణ చేసేవారుట .

‘ అలకలల్లలాడగ’ అనే ఈ కీర్తనలో విశ్వామిత్రుల వారు రాముడ్ని చూసి ఎలా పొంగిపోయారో చాలా వివరంగా చెబుతారు. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుల వారు దశరథుడిని వచ్చి, మారీచ సుబాహుల నుండీ తన యాగం రక్షించడానికి ఒక కొడుకుని పంపమని అడుగుతారు. అది కూడా ఏ కొడుకుని పంపాలో చెబుతూ ‘ఆ ముంగురులు మొహాన పడుతుండే ఆ పెద్ద కొడుకునే’ పంపమని అడుగుతారట.

ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని వ్రాసిన మధ్యమావతి కృతి ఇది. ఇక్కడ అలకలు అంటే ముంగురులు. విశ్వామిత్రుల వారు రాముడ్ని చూసి పొంగిపోయే ఘట్టాలు రెండిటినీ ఈ కృతిలో చూస్తాము 👇👇👇👇👇👇

ప. అలకలల్లలాడగ కనియా

రాణ్మునియెటు పొంగెనో

అ. చెలువు మీరగను

మారీచుని మదమణచే వేళ (అ)

చ. ముని కను సైగ తెలిసి శివ

ధనువును విరిచే సమయ-

మున త్యాగరాజ

వినుతుని మోమున రంజిల్లు (అ)

వాల్మీకి రామాయణం చదవటం ఒక ఎత్తు. ఆ భక్తిని ఒక కృతిలో ఇంత అందంగా అక్షరాలని పేర్చడం ఒక ఎత్తు. చాగంటి వారు, వేటూరి వారు త్యాగరాజుల వారి భక్తి గురించి ఈ కృతినే ప్రస్తావించారు. విశ్వామిత్రుడి గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా త్యాగరాజుల వారు ఆయనే విశ్వామిత్రుల వారిని స్వయంగా చూసినట్లు పాడారు .

ఇలా ఈ విధంగా రామాయణంని అనేకమంది కవులు ఎన్నో రకాలుగా ఎంతో అందంగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు.

సాహిత్యంలో ప్రక్రియలు కవి యొక్క సృజనాత్మకత సూచిస్తాయి. అన్నమయ్య ఒకే విషయం చెప్పినా ఎన్నో రకాలుగా చెబుతాడు. తెలుగులో వ్రాసిన భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం రెండిటిలో అవాల్మీకాలు ఉన్నాయి. ఉడుత కథ లాంటివి. ఓ ఉడుత & దాని పైన ఆ చారలు చూడగానే రాముడు గుర్తు రాకపోవడం అంటూ ఉండదు. ఇటువంటి ప్రక్రియలు సంస్కృతిని పెంపొందించేవే కానీ సంస్కృతిని పునాదులు పెకిలించడం అనేది లేదు. ఆనాటి అన్నమయ్య నుంచీ ఈరోజు శ్యామలరావు గారు లాంటి వారి వరకూ సాహిత్యంలో రాముడి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఆంటే రాముడు ఒక సంస్కృతి అనే మాట చెబుతూనే ఉన్నారు. . సామాన్యుడు రాముడికి దగ్గరయ్యేలా చేస్తూనే ఉన్నారు.

భారతీయ సంస్కృతి పునర్జీవనం (Cultural Revival)👇👇👇👇👇

చిన్నప్పుడు ఎప్పుడో 10వ తరగతి వరకూ తెలుగు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుల వల్ల తిరిగి చదివే అవకాశం లేక, ఇప్పుడు తిరిగి తెలుగు చదువుకోవడం మొదలు పెట్టారు. కొందరు ‘సంస్కృతభారతి’ లాంటి బళ్ళలో చేరి సంస్కృతం కూడా చదువుకోవడం మొదలు పెట్టారు. కొందరు సంగీతం నేర్చుకుంటున్నారు. ఈమధ్య సోషల్ మీడియా వల్ల కావచ్చు. covid లో lockdownలో దొరికిన సమయం వల్ల కావచ్చు. ఈ ధోరణి బాగా కనిపిస్తోంది. పైగా అంతర్జాలంలో బోలెడు సమాచారం దొరకడం మూలాన, ఎంతో మంది పైన చెప్పిన విధంగా ఎన్నో విషయాలు సునాయాసంగా తెలుసుకుంటున్నారు.

అయోధ్య తీర్పు వెలువడిన వెంటనే కొన్ని కోట్లమంది భారతీయులు ఆనందంతో సోషల్ మీడియాలో profile picture మార్చుకున్నారు. అది ‘ఇంకొకరిపై గెలిచాము’ అన్న ఆనందం కాదు. ‘రాముడికి గుడి కడతారు’ అన్న ఆనందం. అయోధ్యలో అన్ని వేల దీపాలు వెలిగిస్తే, కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో చూసి తరించారు.

మార్పు ఏ విధంగా చోటు చేసుకుంటోంది అనడానికి , ఈ మధ్య ముఖ పుస్తకంలో వల్లీశ్వర్ గుండు గారు వ్రాసిన వ్యాసం ‘రానున్న ఒక పెను మార్పుకి ఇది సంకేతమా ? అన్నది ఒక ఉదాహరణ.

ఇటువంటి ఈ మార్పుకి కారణం భాజపా పాలన కొంత కారణం అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశ్యంలో → Y2K వలన కూడా భారతదేశం నుండీ పాశ్చాత్యదేశాలకి వెళ్తున్న భారీ వలసలతో అనేక కుటుంబాలకి ఆర్థికబలం పెరగడం ఇంకో కారణం. బొజ్జ నిండా పాలు త్రాగాకే చిన్నారులు నవ్వులు చిందిస్తారు కదా మరి !! అందుకే సంస్కృతి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు . అదే మార్పుకు కారణం అవుతోంది.

ఆధునిక సాహిత్యపు విషవృక్షాలు 👇👇👇👇👇

‘భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి, అందునా ముఖ్యంగా సాహిత్యాన్ని కాపాడుకోవాలి’ అన్న ఉద్దేశ్యంతో ఈ విధంగా కొందరు పునరుద్ధరణకై పూనుకుంటున్నా, జరగవలసిన నష్టం భారీగానే జరిగిపోయింది. మేధావీ వర్గం, కలం అనే ఆయుధంవాడుకుంటూ & అవార్డులు అంది పుచ్చుకొంటూ కొన్ని తరాలని భారతీయ సంస్కృతికి, భాషకి దూరం చేసేసారు. ఆ కలమే తిరిగి వారి వారసులకు అందించారు. అందిస్తున్నారు ఇంకా…. నేను కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డుల గురించి వ్రాసిన వ్యాసం చూడవచ్చు .

ఈ అవార్డుల సాహిత్యం వివిధ దేశ విదేశీ భాషల్లోకి అనువాదం కావించబడి, ఒక documented literature గా మారిపోతోంది. ఇక పాఠ్యాంశాలలోకి కూడా వెళ్తోందేమో తెలీదు మరి. ఈ కలుపు మొక్కలు, విషవృక్షాలై సాహిత్య ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి.

తెలుగు భాషంటే ఆసక్తి 👇👇👇👇👇

సృజనాత్మకత అన్న పేరుతో వాల్మీకి వ్రాసిన రామాయణానికి విరుద్ధంగా ఉన్న కథలు వ్రాస్తారు మేధావీ వర్గం. ఇప్పుడిప్పుడే భాష నేర్చుకునే వారికి (పైన చెప్పాను ) మ్రింగుడు పడవు. వారికి తెలుగు సాహిత్యం అనేది ఎటువంటి దృష్టి కోణాన్ని చూపుతుంది ? ‘ నను బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లీ’ అని భజన చేసేవారు, ‘సీతమ్మ మాయమ్మ ‘ అని త్యాగరాజు గుర్తు చేసుకునే వాళ్ళు ఆ కథలను చదివి ఆమోదించగలరా ?సంస్కృతికి విరుద్ధంగా వ్రాసే కథ ‘తెలుగు భాష ‘ కొత్త తరాలకి నేర్చుకుందాం అనే ఆసక్తి కలిగిస్తుందా లేక ఓ త్యాగరాజు కీర్తన ఆసక్తి పెంచుతుందా ?

ఓ పక్క ఎంతో మంది Cultural Revival కోసం పని చేస్తూ ఉంటే , ఇంకా ఇటువంటి కథలు వ్రాయడంలో ఈ రచయితల ఉద్దేశ్యం ఏమిటి ? మనోభావాలు దెబ్బతినడం పక్కన పెడితే, కథాంశమే ‘ఇటువంటి రాముడిని నేను పూజించానా ?’ అన్న ఆత్మనూన్యతకి గురి చేస్తుంది. తమ సంస్కృతినే సందేహించడం మొదలు పెడ్తాడు పాఠకుడు.

’ ‘అటువంటి రామాయణం చదివితే ఎంత చదవకపోతే ఎంత’ అని భాష చదివి పెంపొందించుకోవాలి అన్న ఆసక్తి కూడా చంపేస్తుందేమో అనిపిస్తుంది కూడా.

సాహిత్యం అంటూ బావుంటే …. 👇👇👇👇👇

ఏదైనా సాహిత్యం లో సృజనాత్మకత అంటూ బావుంటే అది ఏ భాషలో వ్రాసారో అన్నది పాఠకుడికి అనవసరం. దానిని పట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు.

‘శంకరాభరణం’ చిత్రం హీరో, డ్యూయెట్ పాటలు లేకుండా తీసిన సినిమా. ఇన్నేళ్ళు అయినా కొన్ని తరాలు మర్చిపోలేదు. ఇంకొక ఉదాహరణ ‘Harry Potter’. అర్ధరాత్రి లేచి కొట్టు దగ్గర పడిగాపులు కాచి , ఆ పుస్తకం కొన్న పిల్లలు ఉన్నారు. OTT లో ‘మలయాళం ‘ సినిమాలు బావున్నాయి అంటూ subtitles పెట్టుకుని చూస్తున్నవారు ఉన్నారు. చైనాలో బాహుబలి సినిమా చూసిన వారు ఉన్నారు. భాషతో సంబంధం లేదు వారికి . ఆ సాహిత్యం లో ఆ సృజనాత్మకత నచ్చింది అంతే !

ముగింపు 👇👇👇👇👇

ఏ భాష సాహిత్యం ఆ భాషకి సంబంధించిన సంస్కృతి గురించి చెప్తుంది. మేధావీ వర్గం కథలు భారతీయ సంస్కృతి పైనే విషం చిమ్ముతూ, తమ పూర్వికుల నమ్మకాలనే పరిహసిస్తుంటే ‘భాష నేర్చుకోవాలి’ అనే అనురక్తి భావితరాలకు ఎందుకు ఉంటుంది ?

సృజనాత్మక సాహిత్యం , ఆ సంస్కృతిని కూడా కలుపుకుంటూ అందులోని విషయాలను గొప్పగా చెబుతూ ఉంటే భాష మీద ఆసక్తి కలిగి ఆ భాష విస్తరిస్తుంది. కాబట్టి, రచయితలు భావితరాలని దృష్టిలో పెట్టుకుని → వారి సృజనాత్మకతకి పదును పెడుతూ → మేధావీ వర్గం చేతిలో కలం ఉన్నది అన్న విషయం సామాన్య పాఠకులు మర్చిపోయేలా చేసేలా → అద్భుతమైన రచనలు చేయాలి.

నేను ఇటీవలి కాలం లో చాలా చక్కటి కథలు చదువుతూ ఉన్నాను. ఆ కథల గురించి ముందు ముందు వచ్చే పోస్టులలో వ్రాస్తాను🙏🙏.

13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు – నా ప్రసంగం

(మొదటి సారి కదా కొంచెం గొప్పలు ఎక్కువ చెప్పుకుంటున్నాను )👇👇👇👇👇👇👇👇

సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానం, అనుభవము చాలా తక్కువ. నన్ను నేను ఓ సామాన్య పాఠకురాలిగా భావించుకుంటాను. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండీ MA రెండవ సంవత్సరం చదువుతూ సాహిత్యంలో ఇప్పుడిప్పుడే అ ఆ లు దిద్దుతున్నాను. కాబట్టి నా ప్రసంగంలో తప్పులేవైనా ఉంటే మన్నింప ప్రార్థన.

నా గురించి నేను చెప్పాలి అంటే ఒక విషయం తప్పక చెప్పాలి .
నా యొక్క ఈ అస్థిత్వం అంటే భారతీయ/సనాతన/హిందువు/బ్రాహ్మణ /తెలుగు/ వీటిల్లో ఏ భావంతో నన్ను చూసినా, ఈ అస్తిత్వం ఇలా ఉండటానికి కారణం → ఎన్నో ప్రయాసలకు లోనైనా సరే , దానిని నిలబెట్టుకున్న నా పూర్వీకుల నిర్ణయం వల్లనే అని నూటికి నూరుపాళ్ళు నమ్ముతాను.

ఈనాడు నేను మాట్లాడ బోయే అంశము 👇👇👇👇
సాహిత్యము లో సమకాలీన చరిత్ర, సామాజిక పరిస్థితులు మరియు చరిత్ర యొక్క ఆవశ్యకత

సాహిత్యము అనేది ఒక మనిషి జీవన విధానంలో తెలియకుండానే చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అవి పురాణేతిహాసాలు కావచ్చు. నాటకాలు కావచ్చు. జానపద సాహిత్యం కావచ్చు.

సాహిత్యము అనేది ఒక కధను నాటకీయంగా చెబుతూనే ఇంకో కోణంలో అప్పటి సమకాలీన చరిత్ర మరియు సామాజిక పరిస్థితులు కూడా చెప్తుంది.

ఒక ఉదాహరణ : 👇👇👇👇

పోతన గారి భాగవతంలో శివుడు హాలాహలం భక్షణం చేసినపుడు పార్వతీ దేవి గురించి ఈ పద్యం చెప్తాడు :
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!”

అంటే ఇక్కడ ఆనాడు తెలుగు వారి ఆచారాలలో మాంగళ్య ధారణ ఉండేదని, అది చాలా ముఖ్యమైనదనీ స్పష్టమవుతుంది. ఇక పోతన గారి భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు చదువుతుంటే తెలుగువారి జీవన విధానం కళ్ళముందుంటుంది కానీ ఎక్కడో ఉత్తరభారతాన ఉన్న మధురలోని బృందావనం గుర్తు రాదు మనకి. ‘అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు’ అంటే భయపడే తెలుగు శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు.

వీటిని బట్టి ఆనాటి సామజిక పరిస్థితులు కనిపిస్తాయి.
ఈ విధంగా సాహిత్యంలో ఆనాటి పరిస్థితులు గత చరిత్రలో ఒక అస్థిత్వాన్ని మనకి తెలియజేస్తాయి . అంటే ‘ఓహో తెలుగు వారు ఇలా ఉండేవారు కాబోలు ’ అని.

చరిత్ర యొక్క ఆవశ్యకత 👇👇👇👇
అయితే చరిత్ర అనేది ఎందుకు తెలుసుకోవాలి ? గతం గతః అని వదిలివేయచ్చు కదా? అయిపోయిందేదో అయిపొయింది. చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అంటే , ఒక అస్థిత్వాన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా జాతి మీద జరిగిన అకృత్యాలు, మారణహోమాలు జరిగి ఉంటే , అటువంటివి పునరావృత్తం కాకుండా ఏమి చర్యలు తీసుకోవాలో, తెలుసుకోవడానికి చరిత్ర తెలుసుకోవాలి.

ఆ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి అంటే మొదట ఆ జాతిమీద జరిగిన దారుణాలు గుర్తింపబడాలి. తరువాత కొత్త చట్టాలు రూపొందించడం, ఆ చట్టాలు అమలు పరచడం ద్వారా ఆ అస్థిత్వాన్ని కాపాడ గలుగుతాము. అంతే కాదు తరువాతి తరాలు కలిసిమెలిసి ఉండేలా చేయాలి అంటే ఈ ఇద్దరి జాతుల మధ్య సయోధ్య కుదరాలి. అంటే reconciliation . ఇందులో సాహిత్యం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.

అందుకు ఉదాహరణలు:👇👇👇👇
ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులపైన జరిగిన మారణహోమం. ఈ అంశం పైన ఎంతో సాహిత్యం వచ్చింది. యూదులపై అటువంటి చరిత్ర పునరావృత్తం కాకుండా ఎన్నో చట్టాలు వచ్చాయి.

ఇంకొకటి ఆఫ్రికా జాతుల వారి మీద జరిగిన అకృత్యాలు. . వారిని బానిసలు గా అమ్మివేయబడటం, వారి పైన మారణకాండ, దాష్టీకాలు ఎన్నో జరిగాయి. . అలాగే వారి అస్తిత్వం కాపాడటం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. ఈ అకృత్యాల మీద సాహిత్యంలో ఉదాహరణలు Roots నవల, To Kill a Mockingbird నవల.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ సాహిత్యం పాఠ్యాంశాలుగా బళ్ళలో పిల్లలకి బోధిస్తున్నారు..అమెరికాలో పిల్లలు 8వ తరగతిలోనే To Kill a Mockingbird పాఠ్యాంశంగా చదివుతారు.

సాహిత్యం ఈ విధంగా ఒక అవగాహన కల్పించి ఈ అకృత్యాలని ప్రపంచం గుర్తించేలా చేస్తుంది . అందుకే ఇందులో సాహిత్యం పోషించే పాత్ర చాలా ఎక్కువ.

భారతభూమిపై జరిగిన అకృత్యాలు 👇👇👇👇
ఇవి దాదాపుగా వరుసగా వెయ్యేళ్ళ పాటు కొనసాగాయి. . మతం పేరుతో ఎన్నో మారణహోమాలు, ఆడవారి పైన మాన భంగాలు, వారిని బానిసలని చేసి అమ్మడం వంటి అకృత్యాలు ఎన్నో జరిగాయి..
భారతీయులు పవిత్రంగా భావించే పుణ్య క్షేత్రాలలోని గుళ్ళ మీద 7 వ శతాబ్దం మొదలు కొని 17 వ శతాబ్దం వరకూ ఎన్నో దాడులు జరిగాయి. ఆనాటి భారతీయులు ప్రాణాలకు తెగించి గుడిని కాపాడుకున్నారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాచీన గుళ్ళు చూసినపుడు తలలు తెగి పడిన విగ్రహాలు, సమాధులతో నిర్మాణాలు కనిపిస్తాయి అంటే ఆ దాడులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించవచ్చు.
ఈ దేవతా మూర్తులని కాపాడుకునేవాళ్ళు. మళ్ళీ దాడి జరిగేది.
ఒక ఉదాహరణ : దక్షిణ భారతదేశంలో శ్రీరంగం దేవాలయం మీద రెండు సార్లు దాడి జరిగింది. ఒకటి ఖిల్జీ గవర్నర్ అయిన మల్లిక్ కఫుర్ చేసిన దాడి . తరువాత తుగ్లక్ సైన్యం చేసిన దాడి . రెండవ సారి దాడి జరిగినపుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని ముందు కేరళ , తరువాత తిరుమల తరలించారు. అదే ఈనాడు మనం తిరుమలలో చూసే రంగమండపం. ఇలాగ భారతదేశం నలుమూలల జరిగిన అకృత్యాల గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.

ఇవి ‘రాజుల మధ్యలో యుద్ధాలుగా పరిగణించవచ్చు కదా ‘అంటారేమో. కానీ ఇవి ‘మతదురహంకారంతో జరిగిన అకృత్యాలు’ అని పురావస్తు పరిశోధనల వలన, చరిత్రకారుల పరిశోధనల వలన నిర్ధారణ అయ్యింది. మరి ప్రపంచం భారతజాతి మీద జరిగిన అకృత్యాలు గుర్తించిందా ? గుర్తించలేదు. ఆనాడు ఈ రెండు జాతుల మధ్య సయోధ్య లేదు అనటానికి సాక్ష్యం భారతదేశం మూడు భాగాలయ్యింది.

అందుకే ఇటువంటివి పునరావృత్తం కాకుండా ఇటువంటి అకృత్యాలపైన చట్టాలు రావాలి. అంటే, ఈ అకృత్యాలపైనా విరివిగా సాహిత్యం రావాలి . పిల్లలకి పాఠ్యాంశాలుగా బోధింపబడాలి.

ఈ అంశాలపైన తెలుగు సాహిత్యం 👇👇👇👇👇👇
** 1350-1440 మధ్యలో స్కాందపురాణం నుండీ కాశీ మహత్యాన్ని వివరిస్తూ కవిసార్వభౌముడు శ్రీనాథుడు వ్రాసిన కావ్యం ‘కాశీ ఖండం’. అంతకుముందు 1170లలో శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన ‘నైషధం’ కావ్యంలో దమయంతీ స్వయంవరంలో కాశీపట్టణ వైభవం గురించి వివరిస్తాడు. ఈ సాహిత్యం ప్రాచుర్యంలో ఉన్నది కానీ చరిత్రకారులు చెప్పే, ఢిల్లీ సుల్తానుల ఆదేశం ప్రకారం, 1190 ల నుండీ 1670 దాకా ఎన్నో సార్లు నేలమట్టమైన కాశీ గురించి సాహిత్యంలో ఎక్కడైనా ఉటంకించారా అన్నది ఒక ప్రశ్న.

** దుర్భాక రాజశేఖర కవి 1888 లో రాణా ప్రతాపుని చరిత్రను వస్తువుగా తీసుకుని ‘రాణా ప్రతాప చరిత్ర’ అనే ఐదు ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.

** 1897లో గడియారము వేంకట శేష శాస్త్రి శివాజీ చరిత్రను వస్తువుగా తీసుకుని ‘శివభారతము’ అనే ఎనిమిది ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.

**రజాకార్ల యొక్క అరాచకాల మీద దాశరధి రంగాచార్య గారు వ్రాసిన ‘మోదుగుపూలు ‘ లాంటి నవల ఉన్నది.

**‘బండెనుక బండికట్టి’ అనే జానపద గేయం ఆనాటి చరిత్రని స్పష్టంగా చెప్తుంది.

**సంచిక పత్రిక లో కస్తూరి మురళీకృష్ణ గారు అనువదిస్తున్న జోనరాజ ద్వితీయ రాజతరంగిణి కాశ్మీరు లో అరాచక చరిత్ర వివరిస్తుంది.

**తెలుగులో ఈ అరాచకాలని గురించి స్పష్టంగా చెబుతూ ఉన్న శతకాలు రెండు ఉన్నాయి. ఆ శతక కర్తలు అరాచక చరిత్రకి ప్రత్యక్ష సాక్ష్యులు.

1 తిరుమల గుడి పైన 1700లో గోల్కొండ నవాబులు చేసిన దాడి గురించి వేంకటాచల విహార శతకకర్త ‘నల్లకాల్వ వరకవి సీతాపతి’ ఆ శతకము లో చాలా విశదంగా వివరించారు. ఒక సీస పద్యం చూద్దాం.(see the picture)

2 ఇదేవిధంగా 1750లో సింహాచలం ఆలయం పైన దాడి జరగబోతోందని గోగులనాటి కూర్మనాథ కవి నిందాస్తుతి రూపంలో సింహాద్రి నారసింహశతకము అని నరసింహుడిని వేడుకుంటూ రచించారు 70 పద్యాల దాకా చెప్పగానే ఒక తుమ్మెదల గుంపు వచ్చినా కొండని ఆక్రమించిందని, ఆ సైన్యాన్ని తరిమికొట్టిందని చరిత్ర.

అందులో ఒకటి


సీ. పాశ్చాత్యుల నమాజుపై బుద్ధిపుట్టెనో
మౌనుల జపముపై మనసు రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో
విప్రయజ్ఞములపై విసువు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో
దేవతాప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో
భక్తనిత్యోత్సవపరత మాని
గీ. వాండ్రు దుర్మార్గు లయ్యయో వ్రతము చెడ్డ
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరఁగఁదోలు
పారసీకాధిపతులఁ బటాపంచలుగను
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!

ఆధునిక తెలుగు సాహిత్యం కోణం 👇👇👇👇👇👇
ఒక వైపు తెలుగు ప్రాచీన సాహిత్యం ధర్మం తప్పకుండా ఎలా నడవాలి అని చెప్తూ , ఈ పుణ్యక్షేత్రాలు & ఆ వైభవాన్ని ఎంతో గొప్పగా చెప్తే, ఇంకొకవైపు ఈ సనాతనధర్మం , గుళ్ళలో మూర్తిపూజ అనేది ఒక మూఢనమ్మకం లాగా చెప్పిన ఆధునిక తెలుగు సాహిత్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనే చెప్పాలి. ఇటువంటి ఈ ఆధునిక సాహిత్యం ఎంత ప్రచారం లో వచ్చింది అంటే ఎక్కడైనా ఎప్పుడైనా రామాయణం, రాముడు గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా సామాన్యుల చర్చల్లో కూడా ఉండే విషయాలు
సీత అగ్నిప్రవేశం,
వాలిని చంపడం,
సీతని అడవుల్లో వదిలేయడం.
అంతే కాదు. రావణాసురుడు ద్రావిడ జాతికి చెందినవాడు. రాముడు ఆర్యుడనీ చెప్పే కథలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

అందుకు ఉదాహరణ ఇటీవలి కాలంలో వచ్చిన ‘విముక్త’ కథలు. ఆ కథలు చదివాక ఇది నాకు అనిపించిన భావము. రామాయణంలోని స్త్రీల గురించిన నేపథ్యంలో వచ్చిన కథలు. సీతాదేవి, అహల్య, రేణుకా దేవి, ఊర్మిళ ఇలా అందరిని పీడితుల్లాగా చూపించి పీడకుడు పీడితుడు అనే భావజాలంలోకి తెచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి. అంటే భర్త పీడకుడు. భార్య పీడితురాలు. ఇక్కడ సమస్య పరిష్కారం ఏమిటంటే స్త్రీ కి భర్త నుంచి విముక్తి . అంటే నేను ఇక్కడ బాధలు పడే స్త్రీలని కించపరచడం లేదు. నేను చెప్పేది ఏంటంటే రామాయణం అంటేనే భారతీయులకి ఎంతో స్ఫూర్తి. రామాయణంలో స్త్రీ పాత్రలు ఎంతో స్ఫూర్తి. అటువంటి స్త్రీ పాత్రలను ఇలా భావజాలపు చట్రంలో ఇరికించడమూ, రాముడు ‘ఆర్యుడ’ని అని చెప్పడం అనేది చాలా బాధాకరం.

ఈ విధంగా ప్రాచుర్యంలో వచ్చిన ఆధునిక సాహిత్యం వలన ఏమి జరిగింది మనకి?👇👇👇👇👇👇
భారతజాతిపై జరిగిన అన్యాయాలు & అకృత్యాలు ప్రపంచానికి తెలియనందువలన, ఎంతో మంది ప్రాణాలు వదిలేసిన ఆ జాతికి తీరని అన్యాయం జరిగింది అని చెప్పాలి. అంతే కాదు . భారత సంతతి తమ పూర్వీకులను తామే అసహ్యించుకునేలా చేసింది.

ముగింపు 👇👇👇👇👇👇
ఏ జాతి పైన అకృత్యాలు జరిగాయో , ఎప్పుడైనా సరే ఆ జాతే ఆ అకృత్యాల గురించి ధైర్యంగా మాట్లాడాలి.

భారతీయులుగా భారత సాహిత్యంలో భారత చరిత్ర చెప్పనంత కాలం ప్రపంచానికి 1200 ఏళ్ళపాటు భారత జాతి మీద జరిగిన అకృత్యాలు ఏనాటికి తెలియవు.

**********************************************************
ఈ సదవకాశం నాకిచ్చిన వంగూరి వారికీ & సిలికానాంధ్ర వారికి అనేకానేక ధన్యవాదములు 🙏 🙏 🙏

ఈ ప్రసంగంలో పంచుకున్న అభిప్రాయాలన్నీ నావే అని గమనించవలసిందిగా ప్రార్థన.🙏 🙏 .

References:👇👇👇👇👇👇
వేంకటాచల విహారశతకం – నల్లకాల్వ వరకవి సీతాపతి
సింహాద్రి నారసింహ శతకము-గోగులపాటి కూర్మనాధ కవి
చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర by డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి
Flight of Deities – Dr.Meenakshi Jain
Anveshi-An Explorer’s Journey,

‘విముక్త’ కథలు – ఓల్గా

13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు – నా ప్రయాణం కబుర్లు

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం & వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి సంయుక్త ఆధ్వర్యంలో 13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారి భవనంలో గత వారాంతం అక్టోబర్ 21-22 2023 న జరిగింది.

వక్తలని ఆహ్వానిస్తూ వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి విద్యుల్లేఖ రాగానే నా ప్రసంగం కూడా పంపించాను. చాలా రోజులు జవాబు రాకపోయేసరికి ‘నాబోటి దాని మాటలు ఎలా ఎంపిక చేస్తార్లే మరీ అత్యాశ’ అనుకుని మర్చిపోయాను. ఉన్నట్టుండి రాజు గారు నుంచీ వక్తలని ఉద్యేశిస్తూ మళ్ళీ లేఖ . ‘నా ప్రసంగం ఎంపిక అయ్యిందా ‘ అని అడిగాను వారిని. ‘అందుకేగా పంపాము ‘ అని జవాబు వ్రాసారు ఆయన . మొత్తం ప్రసంగం తిరిగి వ్రాసి పంపాను. కానీ ఈ గందరగోళంలో నేను పంపిన draft copy ప్రచురణ అయ్యింది అని, ‘సభా విశేష సంచిక’ చూసాక అర్ధమయ్యింది.

చిట్టెంరాజు గారు, నేను ‘పదసాహిత్యం ‘ తరగతిలో సహాధ్యాయులం. తరగతికి రాగానే అయన అందర్నీ పేరుపేరునా భలే చక్కగా పలకరిస్తారు. ఇక నన్ను చూసినప్పుడల్లా ‘టికెట్ బుక్ చేసావా’ అంటూ పలకరించడం మొదలు పెట్టారు. అలా టికెట్ కొనుక్కుని ప్రయాణానికి సిద్ధమయ్యాను.

2017లో వంగూరి వారి తెలుగు సదస్సు మా ఊర్లోనే జరిగింది. ఎంతో మంది రచయితలు వచ్చారు. ఈమాట లో, కౌముదిలో రచనలు చేసే రచయితలే నాకు పెద్ద సెలెబ్రిటీలు. వారు వ్రాసిన కథలు గురించి వారితో పంచుకునే అవకాశం వచ్చింది. అలా ఆనాడు ఎందరో సాహితీ ప్రముఖులని కలిసాను . మొట్టమొదటి సారి like minded group తో కలిస్తే ఆ వచ్చే ఆనందం ఏంటో అర్ధమయ్యింది. అందుకే ఆ ఆనందం ఏ మాత్రం వదులుకోకూడదు అని నిర్ణయించేసుకున్నాను.

మరి ఈసారి 2023లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అంటే నేను చదివే విశ్వవిద్యాలయం, మా ఆచార్యుల వారు మృణాళిని గారిని & ఇతర సహాధ్యాయులని కూడా కలవడం అవుతుందని చాలా ఆనందం వేసింది. అనుకున్నట్లే మా సీనియర్లు అయిన కిరణ్ సింహాద్రి, భాస్కర్, వేణుగోపాల్ గార్లను, నాతో పాటూ చదువుతున్న గిరిధర్ గారిని కలిసాను. ఇక చిట్టెంరాజు గారి సంగతి వేరే చెప్పలేదనుకుంటాను.

20 తేదీ మధ్యాహ్నం కల్లా అక్కడికి వెళ్ళాను. Airport నుండీ BART అనే మెట్రో రైలు ప్రయాణం చేద్దాం అని ముందరరోజు నిర్ణయించేసుకున్నాను. అమెరికాలో ఎప్పుడూ కారులో ప్రయాణిస్తాం. అవకాశం ఉన్నపుడు ఎలా ఉంటుందో చూడచ్చు కదా అనిపించింది. పగటిపూట కూడా అయ్యింది. భయం ఏమి ఉండదు అని స్నేహితురాలు కూడా భరోసా ఇచ్చేసింది. DC మెట్రో తో పోలిస్తే నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే మన భాగ్యనగరం & ఢిల్లీ మెట్రో నే బావుందేమో అనిపించింది కూడా.

పనిలో పని దానధర్మ సంస్థ వెంకట్ ఊటుకూరి గారిని కలవాలి అనుకున్నాను. వెళ్ళిన రోజు సాయంత్రమే కలిసాను. వారు ఓ గంటన్నర ప్రయాణం చేసి వచ్చారు. వారిని కలవడం చాలా సంతోషం అనిపించింది.

ఇక సిలికానాంధ్ర కుటుంబం చేసిన మర్యాదలు అంతా ఇంతా కాదు. సభా ప్రాంగణం అంతా తెలుగు మయం. చిత్రాలు చూసి ఉంటే అర్ధమవుతుంది. వచ్చిన వారు 10 lbs బరువు పెరిగేలా చేసి పంపడమే వారి ధ్యేయం అన్నట్టు చెప్పారు రాజు చమర్తి గారు. ఉన్న రెండు రోజులు ‘కాఫీలు తాగారా .టిఫినీ తిన్నారా’ అని అడుగుతున్నట్లే అనిపించింది. వీరందరినీ మేము ‘మనబడి’ సదస్సుల్లో కలుస్తూనే ఉంటాము. వారి నిజస్వరూపం ఈ రెండురోజుల్లో తెల్సింది 😂(సరదాగా) . ‘మనబడి’ లాంటి పెద్ద సంస్థ నడపడానికి వెనుక ఎంత మంది కృషి ఉంటుంది అనేది స్పష్టంగా అర్ధమయ్యింది. ‘కాన్ఫరెన్స్’ అని అనిపించేలా బల్లలు, పెన్నులు , notepad లు పెట్టారు. పూలగుత్తుల అలంకరణ చిత్రాలలో చూసారుగా. మధ్యలో నోట్లోకి అలా ఏదో చప్పరించేలా జీడిపప్పులు, M & M లు ఉంచారు. మధ్యాహ్నం భోజనాలు అయిన కాసేపటికి కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. ‘ మీరంతా సరస్వతీ స్వరూపులు’ అంటూ ఆనంద్ గారు అన్నీ చేతికి తెచ్చివ్వటం ఆశ్చర్యం వేసింది. కాసేపటికి వేడి వేడి మిరపకాయ బజ్జీలు, పునుగులు పెట్టారు. సాయంత్రం అరిటాకులు వేసి వడ్డనలు. అప్పుడు నేను ‘సదస్సు కి వచ్చిన అతిథి’ అనే వేషం పక్కన పెట్టి, ‘సిలికానాంధ్ర వాలంటీర్ , విద్యార్థిగా వేషం’ వేసి , హడావిడిగా వడ్డన చేస్తూ పని చేసినట్లు నటించాను. ఫొటోల్లో కూడా పడేటట్లు చూసుకున్నాను. భోజనాల తరువాత వల్లీ గారి కవితా కిళ్లీ ఇచ్చారు. ఆ కిళ్ళీ తింటే అలా ఆశువుగా కవిత్వం చెప్పేస్తారట 😂 వల్లీ గారే చెప్పారు.

వక్తల ప్రసంగాలు చాలా మటుకు బావున్నాయి అక్కడక్కడా తప్ప. భాస్కర్ రాయవరం లాంటి వారి ప్రసంగాలు నాలాంటి విద్యార్థులకి ఉపయోగపడేలా ఉన్నాయి. వారూ నా సహాధ్యాయి. సాహిత్య అనుభవం కలిగినవారు కూడా కావడంతో ఆ ప్రసంగం చాలా బావుంది. వారు వారి ఛానల్ లో కథాకేళి అనే కార్యక్రమం నిర్వహిస్తారు . దాన్ని ఆధారంగా చేసుకుని వివిధ దేశాల్లో ఆ కథ చెప్పే క్రమం ఎలా ఉంటుంది అని చెప్పారు.

ఇక కొందరు వక్తలవి పేర్లు చెప్పలేను కానీ నాకు నచ్చలేదు. నాలాంటి విద్యార్థులు ఆ ప్రసంగం నుంచీ నేర్చుకోవాలి అంటే పొందికగా articulate చేసి మాట్లాడాలి . అలా కాకుండా సమయ పాలన లేకుండా out of the topic ప్రసంగిస్తే నాలాంటి దానికి ఉన్న ఆసక్తి కూడా పోతుంది. శ్యామల దశిక గారి కథా విశ్లేషణ, ఉమాభారతి గారి డయాస్పోరా కథలు లాంటి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఫణి డొక్కా గారి కథా పఠనం నవ్వించి నవ్వించి పొట్ట నొప్పి పుట్టేలా చేసింది. మధ్యలో మూడు ముఖ్య ప్రసంగాలు మిస్ అయ్యాను (బోల్డన్ని కబుర్లు లలిత ప్రసంగం అందులో ఒకటి).ఎందుకో కూడా చెప్తాను.

శారద పూర్ణా శొంఠి గారు లాంటి వారిని కలవడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టంలో ఒకటి. ఆ ఉన్న రెండు రోజులు పొద్దున్నే వారి పాదాలకు నమస్కారం చేసుకోవడం నవరాత్రులలో అమ్మ అనుగ్రహం.

నా ప్రసంగం శనివారం సాయంత్రం ఉండాలి. కానీ సమయం సరిపోనందువల్ల ఆదివారం పొద్దుటికి postpone అయ్యింది. ప్రసంగాలు మిస్ అయ్యాను అన్నాను కదా. చెప్తా ఆ సంగతి. నా గోల! నా చీరల పిచ్చి తెల్సిందే కదా. సాయంత్రం కదా నా ప్రసంగం . చీర మార్చుకోవడం నెమ్మదిగా చేయచ్చుగా. తొందర !! మధ్యలో పరిగెత్తుకుంటూ బసకు వెళ్ళి వచ్చేసరికి ఈ ప్రసంగాలు కాస్తా అయ్యిపోయాయి. ఈ లోపల నా ప్రసంగం నిర్వాహకురాలు గారు గీత గారు వచ్చి ‘మనది postpone అయ్యింది తెలుసా ‘ అన్నారు . ‘ అయ్యో చీర ‘ అంటే ‘నేనిస్తాను పర్వాలేదు ‘ అని ఆవిడ 😀.
‘నా బాధ అది కాదండీ . రేపటికి తెచ్చుకున్న చీర ఇదివరకు మనబడిలో speech అప్పుడు కట్టేసుకున్నాను. నా ఛానల్ చూసిన వాళ్ళు స్పీచ్ అంటే ఈవిడ ఎప్పుడూ అదే చీర కట్టుకుంటుంది అనుకుంటారు ‘ అని చెప్తుంటే, అటుగా వెళ్తున్న చిట్టెంరాజు గారు ‘ఏవిటీ ఆ పిల్ల మీద ధుమధుమలాడుతున్నావ్ ‘ అన్నారు. ఈలోగా మా ఆచార్యుల వారు కనపడి ‘postpone అయ్యింది మీ group . అయ్యో పాపం చీర కూడా మార్చుకొచ్చినట్లున్నావ్’ అన్నారు. ‘గురువు గారు . మీకే నా బాధ అర్ధమయ్యిందండీ’ అనేశాను 😂.

శనివారం రాత్రి కిరణ్ ప్రభ గారికీ , కాంతి కిరణ్ గారికి జీవన సాఫల్యం పురస్కారం ఇచ్చారు . కన్నుల పండుగలా ఉండింది. . సన్మానం తరువాత వారిరువురి ప్రసంగాలు క్లుప్తంగా, అద్భుతంగా ఉన్నాయి. యూట్యూబ్ లో వారి ఛానల్ లో చూడవచ్చు. తరువాత వంగూరి చిట్టెంరాజు గారికి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ‘Mascot’ అయిన మహా అనే ఏనుగు పేరుతో ‘మహా’ అనే పురస్కారం ఇచ్చి, పూల వానలు కురిపించి సత్కరించారు. అంటే రాజు’ గారు ‘మహా’ రాజు గారు అన్నమాట. వారు సరదాగా ‘ఇక పైన ఏనుగు చాకిరీ చేయాలా’ అన్నారు. . ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సాహిత్య సేవ చేస్తున్న కిరణ్ ప్రభ దంపతులని , వంగూరి చిట్టెంరాజు గారిని ఈవిధంగా సత్కరించడం నాలాంటి వారికి చాలా ఆనందదాయకంగా అనిపించింది. ఈ సారి సదస్సు తరువాత ‘కిరణ్ ప్రభ గారికి, కాంతి కిరణ్ గారికి నేను తెలుసు’ అని చెప్పుకోగలను.

ఇక్కడ వంగూరి వారి గురించి నాకు అర్ధమయ్యింది కొంత చెప్పాలి. 2017లో మా ఊర్లో సాహితీ సదస్సు పెట్టినపుడు , నన్ను ‘ఏదో ఒకటి మాట్లాడు’ అన్నారు. ‘నాకేం రాదండీ’ అంటే , ‘ నీ బ్లాగులో రైలాటే చదువు. బావుంది కదా ‘ అన్నారు. అంటే దీన్ని బట్టి కొత్త రచయితలని ఎలా ప్రోత్సహిస్తారో అనేది స్పష్టమవుతుంది. వచ్చేస్తుంటే ‘అంతా సవ్యంగా అనిపించిందా నీకు ‘ అని తండ్రి గారు అడిగినట్లు ప్రశ్న. పరాయి దేశంలో ఎవరడుగుతారు ఇంత ఆప్యాయంగా ? అందుకే అంటాను. నేర్చుకోవాలే కానీ అమెరికాలో ఇటువంటి వారు మా తరం వారికీ ఓ గురువుల్లా ఒక direction చూపిస్తూ ఉంటారు. వీళ్ళని ఏదో పనీపాటూ లేని వారీగా జమ కడుతూ ‘నాకే అన్నీ తెలుసు’ అనుకుంటే ఇటువంటి వారు సాంగత్యం దొరకదు.

మళ్ళీ నా గోల కి వచ్చేద్దాం ! ఆ తర్వాత ఆదివారం పొద్దున మొట్టమొదటి ప్రసంగం నాదే. ఆ విధంగా postpone అవ్వటం నాకు మంచికే. సభలో ఉన్నవాళ్లు ప్రసంగం ఎలా ఉన్నా చచ్చినట్టు వినాల్సిందేగా ! ‘break’ అని చెప్పడానికి కూడా వీల్లేదు మరి . ఎందుకంటే అప్పుడే breakfast అయ్యింది గా ! నా ప్రసంగం వీడియో చూసినవారికి అర్ధమయ్యే ఉంటుంది. నేను ముఖ పుస్తకంలో వ్రాసుకునే ఆలోచనలన్నీ గబగబా పాఠం అప్పజెప్పినట్లు చెప్పేసాను. రెండు నిముషాలు మించిపోయింది. గీత గారు ఏమీ అనలేదు పాపం.

చాలా సన్నిహితమైన నా స్నేహితురాలు కూడా అక్కడే ఆ ఊర్లో ఉంటుంది. వెళ్ళినపుడు తనని కూడా కలవచ్చు అనుకున్నాను కూడా. ఎప్పుడు వెళ్ళినా వాళ్లింట్లోనే ఉంటాము. అస్సలు రాలేదని , కలిసి ఏళ్ళు గడిపోయాయని తను అంటుంటే 2:30 కల్లా సభనుంచి సెలవు తీసుకున్నాను రాత్రికే తిరుగు ప్రయాణం. అందుకే ఆదివారం కూడా కొన్ని ప్రసంగాలు miss చేసుకున్నాను. తిరిగి వచ్చేస్తుంటే ఏదో ఆత్మీయులని వదిలి వచ్చిన ఫీలింగ్.

స్నేహితురాలు వాళ్ళింటికి వెళ్ళగానే వారి పక్క ఇంట్లో తమిళులు బొమ్మలకొలువు పేరంటం పిలిచారు. వెళ్లి అమ్మవారిని చూసుకుని, భోజనం చేసి , మా స్నేహితురాలింట్లో persimmon పళ్ళు కోసుకుని , తిని , pack చేసుకున్నాను. వెంటనే తిరుగు ప్రయాణం.

సోమవారం పొద్దున్నే ఇంట్లో విజయ దశమి వేడుకలు చేసుకున్నాను.

భారతీయుడిని భారతీయుడిగా …. 

యూదులు హిందువులతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉన్నవారు. అంత కంటే తక్కువ సంఖ్యలో ఉన్నవారు కెనడాలో Indigenous వారు. వీరు కలిసికట్టుగా పని చేసి తమపై జరిగిన హత్యాకాండని ప్రపంచం గుర్తించగలిగేలా చేసుకున్నారు.

హిందువులం ఇన్నికోట్ల మందిమి ఉన్నాము అని చెప్పుకోవడానికే. జరిగిన అన్యాయాలు తెలుసుకోము. తెల్సినా తేలిగ్గా తీసిపారేస్తాము. ప్రపంచానికి తెలుసా మన మీద జరిగిన అన్యాయాలు అక్రమాలు ?

ప్రపంచంలో అన్ని జాతుల వారి గురించి ఏడుస్తారు మన పిల్లలు. మన జాతి గురించి ఏడవాలి అన్న సంగతి మనం వాళ్ళకి నేర్పించట్లేదు. ఎందుకంటే మనమే ఆ చరిత్రని తెలుసుకోము. తెలిసినా feel అవ్వము. feel అవ్వకపోతే పూర్వీకుడు పడ్డ బాధ తెలీదు . మన వ్యవస్థ మీద పిల్లలు ప్రశ్నిస్తే ‘సమాధానం లేని చాలా ప్రశ్నలు వేశారు’ అని మురిసిపోతాము . పూర్వీకుల మీద, వ్యవస్థ మీదా ఛలోక్తులు వేస్తాం.

అన్నీ maggi noodle లా 2 minutes కంటే మించకూడదు. వీడియో 2 నిమిషాలికి మించి ఉండకూడదు. పోస్ట్ ఓ పేరా కి మించి ఉండకూడదు. కానీ అమ్మవారి మీద సౌందర్యలహరి , శివానంద లహరి ఎన్ని ఉంటే అన్ని స్తోత్రాలు చదివేసి బోలెడు instant పుణ్యం సంపాదించుకుంటాము. అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలు మన కళ్లబడకుండా చూసుకుంటాం.

ఎవడు బాగు చేస్తాడు మనల్ని ?

భారతీయులు కాపాడుకున్న దేవతామూర్తులు

ఒక చోటి నుంచీ ఒక చోటికి వెఱ్ఱివాళ్ళలా ప్రాణాలకు తెగించి దాచిన ఆ దేవతామూర్తులని మోసుకుంటూ, దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టుకుంటూ, ధర్మాన్ని రక్షించి తమ భక్తికి సాటిలేనిది ఏదీ లేదని చెప్పారు. ఆ సంస్కృతిని మిగిల్చి వెళ్ళిన మన పూర్వికులకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?

ఈ చరిత్రని చాప కింద తోసేసి , నా సంస్కృతి నుండీ నన్ను, నాలాంటి వాళ్ళని దూరం చేసేసారు. ఇది క్షమించరాని తప్పు.

ప్రముఖ చరిత్రకారిణి మీనాక్షి జైన్ గారు ‘Flight of Deities’ మీద చేసిన ప్రసంగం విన్నాక కళ్ళలో నీరు రాని భారతీయులు ఉండరేమో అనిపించింది. నా పూర్వీకుల నమ్మకాన్ని, వారి భక్తిని కళ్ళకు కట్టినట్టు గా చెప్పి, నా పూర్వికులపై నాకు అపారమైన గౌరవాన్ని కలుగజేసిన మీనాక్షి జైన్ గారి ప్రసంగాన్ని తెలుగులో వ్రాసే సాహసం చేసాను.👇👇👇

 మీకు భారత్ తో ఏం పని?

అందరూ నా పోస్టులు చదివి మెచ్చుకుంటున్నా ‘అమెరికా వలస వెళ్ళాక  మీకు భారత్ తో  ఏం  పని? అమెరికాలో కూర్చుని ఇక్కడ  కబుర్లు ఎందుకు చెప్తారు’ అనే మాట కొంచెం బాధ కలిగిస్తోంది.  ఈ మాట మొన్న మార్చి లో భారత్ వచ్చినపుడు కొందరు నాతో అన్నారు కూడా. 

సప్త సముద్రాలు దాటాక ఏ పూజ చేసినా ఫలితం ఉండదు అంటారు.  పూజలు, క్రతువులు ఏవైనా చేసే విషయంలో మేము అర్హత కోల్పోయి ఉండవచ్చు కూడా.  కాదని నేను చెప్పను. భారతీయ శాస్త్రాలలో ఏముందో నాకు తెలీదు. 

కానీ ఇక్కడ ఇంకో కోణం ఉంది. వలస వచ్చిన మాకు cultural  identity  అనేది  భారతదేశంతోటే ముడిపడి ఉంటుంది. మా దేశంలో నా  identity  నా భాష పరంగానో, నేను ఏ దేశం నుండీ వచ్చానో ఆ దేశ పరంగానో, నా మతపరంగానో ఉంటుంది. ఇంద్ర ధనుస్సులో  రంగులు వేరయినా ఎలా కలిసి ఇంద్ర ధనుస్సుని అందంగా మారుస్తాయో  అలా అందరూ కలిసిపోవడమే →  అమెరికా సంస్కృతి.  అంటే అర్ధం?  నేనేమీ  నా identity  కోల్పోకుండా  ఉండే స్వేచ్ఛ నాకుంది ఇక్కడ.  

కాబట్టి పొలిటికల్ గా చూస్తే భారత్ అనేది ఓ దేశం.  కానీ నా సంస్కృతి కూడా ! రెండు దేశాల మధ్య రాజకీయ పరంగా మాట్లాడే అర్హత కూడా నాకు లేకపోవచ్చు. కానీ ఇంకా నేను ఆ సంస్కృతినే  కొనసాగిస్తున్నాను కాబట్టి దాని  గురించి మాట్లాడటంలో తప్పు లేదు.  భారతదేశపు  రాజకీయ కోణం లో  కూడా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని నా సంస్కృతిని హేళన, demonize  చేయడం చేస్తున్నారు.  ఎలా చూస్తూ ఊరుకుంటాము? 

అమెరికాలో బళ్లలో హిందూ సంస్కృతిని  misrepresent చేస్తున్న  పాఠ్య ప్రణాళికని మార్చమని Education Dept  వారికి లేఖలు పంపాను.  బంగ్లాదేశ్ లో సనాతనుల మీద దౌర్జన్యాలు జరిగితే నిరసన తెలియజేశాను.  పాకిస్తాన్ లో దైవనింద చేసారు అంటూ  హిందువులకి  మరణశిక్షలు విధిస్తే వారికీ క్షమాభిక్ష పెట్టించమని వేడుకున్నాను.  అమెరికాలో కూర్చుని ‘డబ్బు పంచుతున్నాం కదా’ అని  భారతీయుల్ని & వారి జీవనాన్ని హేళన చేసేవారిని,  వారిని కులాల పరంగా, మతాల పరంగా  విడదీసే వారిని ఖండించాను & ఖండిస్తాను. 

‘నా సంస్కృతి యే  గొప్ప, కాబట్టి అదే అందరూ follow అవ్వాలి’ అని  కూడా నేను ఎప్పుడూ అనను.   కానీ అధర్మం అనిపించినపుడు  మాట్లాడకపోతే  నా గురువులు చెప్పినట్లు  నేను మూగదాని క్రింద లెక్క. 

ఇది Global వరల్డ్.  ‘నా  సంగతి నేను చూసుకుంటా . మీ సంగతి మీరు చూసుకోండి ‘ అంటే ఎలా కుదురుతుంది?.  ఒకరికొకకరం అండగా నిల్చోకపోతే కాలిఫోర్నియాలో SB 403 మార్పులు వచ్చేస్తాయి , Leicester, UK లో జరిగిన గొడవలు ఎవరికీ తెలియవు. పాకిస్తాన్ లో హిందూ అమ్మాయిల బలవంతపు వివాహాలు తెలియవు 

ఎన్నో వేల  ఏళ్ళ  తరువాత కూడా తమ దేశాన్ని, సంస్కృతిని, భాషనీ కాపాడుకోవడానికి కలిసికట్టుగా పని చేసే యూదులని ఉదాహరణగా తీసుకుని భారతీయ  సంస్కృతిని  కాపాడుకోవాలి.  

‘నేను అమెరికాలో ఉన్నాను’ అంటే గొప్ప కాకపోవచ్చు.  కానీ రెండు దేశాలలో నివసించిన అనుభవం ఉన్నది. అంటే  నా అవగాహన ఒక దేశంలో నివసించేవారికంటే ఎక్కువ అన్నట్టే కదా . 

ఆ అవగాహనతోటే వ్రాస్తున్న వ్రాతలే కానీ గర్వంతో వ్రాస్తున్నవి కాదు. 

ఔరంగజీబుని బతికిస్తున్నారు

ఓ పోస్టు వ్రాయడానికి ఆ మధ్య మొఘల్ రాజుల ( కాదూ కాదూ దొంగలు) చరిత్ర చదివాను. అందులో భాగంగా ఓ పాకిస్తాన్ చరిత్రకారుడి మాటలు విన్నాను. ఓ భారతీయ చరిత్రకారుడు మాటలూ విన్నాను. ఒకరు కుడి . ఒకరు ఎడమ. చరిత్ర కదా ఇద్దరూ ఒకటే మాటలు చెప్పారు.

జహంగీర్ (అనార్కలి – సలీం) కొడుకుని గుడ్డి వాడ్ని చేసి చిత్ర హింసలు పెడతాడు.

జహంగీర్ గారి భార్య నూర్జహాను సింహాసనం అధిష్టించేందుకు తన కూతుర్ని సవతి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది.

ఈ గుడ్డి వాడ్ని, ఆ అల్లుడిని చంపుతాడు మన తాజ్ మహల్ నిర్మాణ కర్త.

ఈయనకి నలుగురు కొడుకులు. కుమారుడు ఈయనని ఖైదులో పెట్టిన విషయం అందరికీ తెల్సిందే. ఆ రోజుల్లో టర్కీలకు ఉండే ఓ వింత ఆచారం గురించి చెప్పారు ఇద్దరు చరిత్రకారులు. దేశాన్ని పరిపాలించే రాజుకి, ఒకరి కంటే ఎక్కువ కొడుకులు ఉన్నపుడు , ఆయన తదనంతరం ఎవరైతే సింహాసనం కావాలనుకుంటారో వారు వారి అన్నదమ్ములతో యుద్ధం చేయాలి. Throne or coffin అనే పద్ధతి. గెలిస్తే సింహాసనం లేదా సమాధి అని అర్ధం అట. అందుకే ఔరంగజేబు తన అన్నదమ్ముల్ని చంపాడట. సింహాసనం ఎక్కాడట. గుళ్ళో మూర్తులని ధ్వంసం చేయలేకపోతే గర్భగుళ్ళో మాంసం పడేసి రావడం ఈయన వంశస్థుల ఆచారంట . అందుకు ఈయన గుళ్ళు ధ్వంసం చేయడం ఆయనకో హాబీలా పెట్టుకున్నాడు. .

వావివరుస లేదు. దయాదాక్షిణ్యం లేదు. నా బళ్ళో పాఠ్యపుస్తకాలు ఈ దొంగల్ని ‘చక్రవర్తులు’ అని పరిచయం చేయడం, అది నేను చదవడం, మార్కులు తెచ్చుకోవడం. ఏ జన్మలో పాపం చేసుకున్నామా అనిపించక మానదు.

భారతదేశం అంటే రాముడు జన్మించిన భూమి. కృష్ణుడు గీతని బోధించిన భూమి.

అన్నయ్య ‘నేను తండ్రి మాట నిలబెడతాను. రాజ్యం పరిపాలన చేయను’ అంటే, ‘నీ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుంటా ‘అంటూ అన్నయ్య పాదుకలు తలమీద పెట్టుకుని తపస్సు చేసుకున్నాడు ఆ తమ్ముడు. దుషశిక్షణ అంటూ కన్న తండ్రిని చెరసాలలో బంధించిన రాక్షసుడిని అష్టమ సంతానంగా వచ్చి వధించిన వాడు భగవానుడు. నరకాసురుడిని చంపి 16000 వేల మంది స్త్రీలకి జీవితాన్ని ప్రసాదించాడు మహానుభావుడు.

ఎవరు రాక్షసులు ఎవరు దేవుళ్ళు విడమర్చి చెప్పక్కర్లేదేమో.

‘జై శ్రీరామ్’ అనే భారతీయుడు = ఒక బత్తాయి & భాజపా ని వెనకేసుకొచ్చేవాడు. అంతే అర్ధమయినవాడు మొదట ‘తాను భారతీయుడిని’ అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి.

‘వాడు నా వాడు’ అని చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సింది పోయి ఔరంగజేబుని కొంతమంది జేబులో పెట్టుకుని ఆరాధిస్తున్నారట. ప్రపంచంలో ఎక్కడైనా తన వారిని హింసించిన వారిని పూజించే వారు ఉంటారా ? ఇదేనా భారతీయత ? 🤔🤔 ?

భిన్నత్వం లో ఏకత్వం – భారతీయత

వ్యాసంలో ఇంకా స్పృశించ వలసిన అంశాలు చాలా ఉన్నాయి. చుక్కలని కలిపే ప్రయత్నం చేశాను.

India, that is Bharat -అంతేగా 

ప్రపంచంలో  భారతదేశం ఒక్కటే అనుకుంటాను colonists ని పూజిస్తుంది.

  ఈ రోజు ఓ స్నేహితురాలు ముఖపుస్తకంలోనే  కొన్ని ఫోటోలు పెడుతూ  ‘Dalhousie’ అని వ్రాసింది.  అసలు ఆ ఊరు ఉందని,  అదొక hill resort  అని , హిమాచల్ ప్రదేశ్లో ఉందని నిజంగా నాకు తెలీదు.  నాకు తెలిసినవాడు ఒక్కడే ఆ పేరుతో ‘Lord Dalhousie’ .  పైగా ఆ ఊర్లో ఓ గుర్తు యూట్యూబ్ చెప్పింది .  ‘I LOVE DALHOUSIE’ . అది చూసి బిత్తరపోయాను. ఆ ఊరికి  ఆ పేరు ఎందుకు ఉందో  కూడా సగం తెలీదు మనకి.  

‘Dalhousie Town was named after The Earl of Dalhousie, who was the British Governor-General in India while establishing this place as a summer retreat’   అని వికీపీడియా చెప్పింది.  

ప్రపంచంలో లేని వింతలన్నీ భారతదేశంలోనే జరుగుతాయేమో . అందుకే  ‘India, that is Bharat’ అయ్యింది (ప్రపంచంలో ఏ దేశానికి రెండు పేర్లు ఉండవు )